18 June 2017 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

పింఛన్లు, రోడ్ల కోసం మీ ఆస్తులిచ్చారా?

Written By news on Saturday, June 24, 2017 | 6/24/2017


పింఛన్లు, రోడ్ల కోసం మీ ఆస్తులిచ్చారా?
సీఎం చంద్రబాబుపై మండిపడ్డ భూమన 
 
హైదరాబాద్‌: తనవల్ల లబ్ధి పొందుతున్నారు కాబట్టి తనకే ఓట్లేయాలంటూ సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలకు మీ అబ్బ సొత్తు ఏమైనా ధారాదత్తం చేస్తున్నారా? అని సీఎంపై మండిపడ్డారు. తరతరాలుగా కూడబెట్టిన ఆస్తులను రహదారులు, పెన్షన్ల కోసం చంద్రబాబు పంపిణీ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. 
 
బాబు చేసిన వ్యాఖ్యలకు జైలుకు పంపాలి
ఎన్నికల్లో ఓటు కోసం రూ. 5 వేలు చొప్పున ఇవ్వగలను అని ప్రకటించిన చంద్రబాబును జైలుకు పంపాలని భూమన పేర్కొన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.కోట్లు వెదజల్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిం చారనేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదన్నారు. రాజధానితోపాటు విశాఖ నుంచి కర్నూలు వరకు భూ దందాలతో దోపిడీ చేసిన రూ. లక్షల కోట్లతో ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు. 
 
లోకేశ్‌కు దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలి
చంద్రబాబు, లోకేశ్‌కు సిగ్గు, లజ్జా, దమ్మూ, ధైర్యం ఉంటే  భూదందాలపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని భూమన సవాలు విసిరారు.  

వాటికి హెరిటేజ్‌ డబ్బులు ఇవ్వడం లేదు


వాటికి హెరిటేజ్‌ డబ్బులు ఇవ్వడం లేదు
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మతిస్థిమితం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. నా పెన్షన్‌, నా రోడ్లు అని ముఖ్యమంత్రి మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ప్రజల పన్నులతో వచ్చిన డబ్బులతోనే పథకాలను అమలు చేస్తున్నారని, వాటికి హెరిటేజ్‌ డబ్బులు ఇవ్వడం లేదని చురకలంటించారు.

శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్‌.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను నీరుగారుస్తున్న చంద్రబాబుకు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. అక్రమంగా సంపాదించారు కాబట్టే నంద్యాలలో ఓటరుకు రూ 5 వేలు ఇస్తానని చంద్రబాబు అన్నారన్నారు. విశాఖ భూకుంభకోణంలో ప్రధాన సూత్రధాని బండారు సత్యనారాయణ అని, ఆయనకు విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హతలేదని వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. అసలు జయంతికి, వర్థంతికి తేడా తెలియని లోకేషా వైఎస్‌ జగన్‌ను విమర్శించేదని వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు.

అంగుళం తిరిగి ప్రతి పేదవాడికి ఇస్తాను

Written By news on Thursday, June 22, 2017 | 6/22/2017


విశాఖపట్నం: అన్యాయాన్ని ఎత్తిచూపేందుకే మహాధర్నా అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ధర్నాతోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బుద్ధి రావాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు రెవెన్యూ అధికారులు కలిసి మాఫియాగా మారారని ధ్వజమెత్తారు. భూములను విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
విశాఖపట్నంలో చోటుచేసుకున్న పెద్ద మొత్తం భూకుంభకోణంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో గురువారం ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇసుకవేస్తే రాలనంత స్థాయిలో జనాలు తమ గోడును వినిపించుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ముదపాకలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భారీగా అసైన్డ్‌ భూములను కొట్టేసే ప్లాన్‌ చేశారని చెప్పారు. 
 
అందులో భాగంగానే లక్ష ఆరు వేల ఎకరాల సర్వే నెంబర్లు కనిపించడం లేదని కలెక్టర్‌ కొత్త కథ చెబుతున్నారని, హుదుద్‌లో రికార్డులు పోయాయని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల తర్వాత ఈ విషయం గుర్తొచ్చిందా అని నిలదీశారు. 16,375 ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ పుస్తకాలు కనిపించడం లేదని కలెక్టర్‌ అంటున్నారని, అంటే లక్ష ఆరువేల ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లు కనిపించలేదని, హుద్‌హుద్‌ వచ్చినప్పుడు పోయాయని అంటున్నారని, మూడేళ్ల తర్వాత ఇలాంటి ప్రకటనలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

హుదుద్‌లో కలెక్టర్‌ భవనాలు ఎగిరిపోలేదని, సునామీలాగా నీరు రాలేదని, తాను 11 రోజులు ఇక్కడే ఉండి అన్ని ప్రాంతాలు తిరిగినట్లు గుర్తు చేశారు. హుదుద్‌లో వచ్చింది గాలి వాన మాత్రమే అని చెప్పారు. రెవెన్యూ రికార్డులు ఎలా అంటే మార్చుకునేందుకే ఈ కట్టుకథలన్నీ కలెక్టర్‌ చెబుతున్నారని, దాదాపు 23 వేల ఎకరాలు కబ్జా అయ్యాయని ప్రభుత్వ లెక్కలే చెబుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఒక్క అంగుళం భూమిని కూడా పోనివ్వమని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.
 
దగ్గరుండి కబ్జా చేయించారు
జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరరావు దగ్గరుండి భూములన్నింటినీ కబ్జా చేయించారని, ఆయన బంధువు భాస్కరరావు తనకు సంబంధం లేని భూములను తన పేరిట రిజిస్టర్‌ చేసుకొని పేదల కాలనీలో భూములను బ్యాంకుల్లో కుదవపెట్టి లోన్లు తీసుకున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమానికి స్వయంగా ప్రభుత్వాధికారులే సహకరిస్తున్నారని ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. గంటకు ఇంత నారా లోకేశ్‌కు ఇంత అని డబ్బులు పంచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

గంట సాక్షాత్తు ఒక మంత్రి అని మరో మంత్రి అయ్యన్న పాత్రుడు విశాఖలో భూదందా జరుగుతోందని ముందునుంచే చెప్పారని, అలాగే, శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ భూములు కబ్జా చేస్తుంటే కాపాడుకునే పరిస్థితి లేకుండా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. కలెక్టరే స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో కుమ్మక్కై లోకేశ్‌తో చేతులు కలిపి అందరు కలసి భూదందాలు చేస్తుంటే సామాన్యుడు ఎక్కడికి వెళ్లాలని మండిపడ్డారు. నేడు ధర్నా జరుగుతుందని, తాను వస్తున్నానని, కంప్యూటర్లలో కొన్ని భూములు లెక్కలు సరి చేశారని చెప్పిన వైఎస్‌ జగన్‌ తాను వస్తే ఒక బటన్‌ రాకుంటే మరో కంప్యూటర్‌ బటన్‌ నొక్కుతున్నారని దుయ్యబట్టారు.

ఎంవీవీఎస్‌ మూర్తి చంద్రబాబుకు బంధువు
‘గీతం కాలేజీల యజమాని ఎంవీవీఎస్‌ మూర్తి చంద్రబాబుకు బంధువు. రిషీ కొండలో 55 ఎకరాలు కబ్జా చేశారు. అవి ప్రభుత్వ భూములు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల కోసం ఉంచిన భూములు. వాటిని కబ్జా చేసి తనకు ఇవ్వాలని చంద్రబాబును కోరగానే వెంటనే కేబినెట్‌ ద్వారా అర్పించేశారు. ఆ భూములు విలువ వెయ్యికోట్లు. అలాగే, రాజీవ్‌ స్వగృహ కోసం మహానేత వైఎస్‌ 7 ఎకరాలు ఇస్తే వాటిని కబ్జా చేశారు. ఆ భూముల విలువ రూ.100 కోట్లు. గతంలో ఉన్న కలెక్టర్‌ భూములు కబ్జా అవుతున్నాయని చెబుతున్నా సొంత బంధువులకు చంద్రబాబు వేలకోట్లు ధారా దత్తం చేస్తున్నారంటే విశాఖలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు’ అని వైఎస్‌జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
 
గంటానే బినామీలతో కొనుగోలు చేయించారు
విశాఖ శివారుల్లో భీమిలీ నియోజకవర్గంలో 358 ఎకరాల అసైన్డ్‌ భూములు గంటా బినామీలతో కొనుగోలు చేయించి పూలింగ్‌ పేరిట జీవోలు ఇప్పించారని, ఆ భూములు కొనడం నేరం అని తెలిసినా కొనొచ్చని లోకేశ్‌ ద్వారా జీవోలు ఇప్పించారని మండిపడ్డారు. మదుపాకలో 950 ఎకరాలు బండారు సత్యనారాయణ దగ్గరుండి తక్కువ ధరకు కొనుగోలుచేసి కోట్లకు అమ్ముకునే కార్యక్రమం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్‌పల్లా భూములు వివాదంలో ఉన్నాయని, అందులో టీడీపీ ఆఫీసు కట్టిస్తున్నారంటే వాటిని కబ్జా చేశారా? చంద్రబాబు నాయుడు అని నిలదీశారు. విశాఖ మీద ప్రేమ ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ఎయిర్‌పోర్ట్‌ తొలగించి భోగాపురంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ తెస్తారని చంద్రబాబు చెబుతున్నారని, కానీ, ఆ ఎయిర్‌పోర్ట్‌ వచ్చేది మాత్రం టీడీపీ నేతల భూములు ఉన్నచోటేనని చెప్పారు.
 
సీబీఐ అయితే తన్ని లోపల వేస్తుంది
విశాఖపట్నం జిల్లాలో ఏవైనా పేదవాడి భూములు ఉన్నాయంటే ఆ భూములపై పెద్దవాడి కన్నుపడుతుందని, పేదలంతా వణికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తొలుత బహిరంగ విచారణ అన్నారు.. వేలమంది వస్తారేమోనని భయపడి.. సిట్‌ తో చేస్తారంట. సిట్‌లో ఉన్న అధికారులంతా చంద్రబాబు కింద పనిచేసేవారు. చేసింది నువ్వు.. నీ కొడుకు.. నీమంత్రులు, నీ రెవెన్యూ అధికారులు అయినప్పుడు సిట్‌ రిపోర్టు ఏమొస్తుంది.
 
సీతమ్మ వారిని ఎత్తుకొని పోవడం సరేనా అని రావణుడు కుంభకర్ణుడితో దర్యాప్తు చేయిస్తే ఏం లాభం హనుమంతుడితో వేయిస్తే గానీ తన్ని లోపల వేస్తాడు. అలాగే, సీబీఐ దర్యాప్తు వేస్తే చంద్రబాబును, లోకేష్‌ను, మంత్రులు, అధికారులను తన్ని లోపల వేస్తారు’ అని వైఎస్‌ జగన్‌ చురకలు అంటించారు. సీబీఐ విచారణకు 20 ఏళ్లు పడుతుందని చంద్రబాబు అంటున్నారని, ఆలస్యం అవుతందని వేయడం లేదా లేక 20 ఏళ్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని వేయడం లేదా చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
ప్రతి అంగుళం తిరిగి ఇస్తాను
చంద్రబాబు కేబినెట్‌ సమావేశం పెడితే పేదవాళ్లను దోచుకో పెద్ద వాళ్లతో కుమ్మక్కుకా అని మంత్రులతో చెబుతున్నారని దుయ్యబట్టారు. ‘విశాఖపట్నం మీ పార్టీకి చాలా చేసింది. మీరు విశాఖపట్నానికి ఏం చేశారు? విశాఖకు స్కాములు, అవినీతి, దోచుకునే కార్యక్రమం బహుమతులుగా ఇచ్చారు. ముఖ్యమంత్రి అంటే సాధారణంగా అంతా భయపడుతుంటారు.. అన్యాయం చేయకూడదనుకుంటారు.

‘సేవ్‌ విశాఖ’ ధర్నాకు పోలీసుల అడ్డంకులు


‘సేవ్‌ విశాఖ’ ధర్నాకు పోలీసుల అడ్డంకులు
విశాఖపట్నం: కబ్జారాయుళ్ల కబంధహస్తాల్లో చిక్కుకున్న విశాఖ నగరాన్ని రక్షించేందుకు గురువారం ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ ‘సేవ్‌ విశాఖ’ పేరుతో మహాధర్నాను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా.. సేవ్‌ విశాఖ మహాధర్నా సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ధర్నాలో పాల్గొనేందుకు బయలుదేరిన వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యర్తలను పోలీసులు వేధింపులకు గురిచేశారు. ర్యాలీలకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు.

అంతకుముందు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వైఎస్‌ జగన్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన కార్యకర్తలనూ పోలీసులు వేధింపులకు గురిచేశారు. కార్యకర్తల వాహనాల నెంబర్లు, పేర్లు, వివరాలు తీసుకొని ఎయిర్‌పోర్ట్‌కు అనుమతించారు. పలు చోట్ల కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు బలవంతంగా తొలగించారు. మరోవైపు టీడీపీ నేతల భూ కబ్జాల వల్ల రూ. కోట్ల విలువైన భూములను కోల్పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విశాఖ వాసులు మహాధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




నేడు ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నా


నేడు ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నా

పాల్గొననున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
- భూ ఆక్రమణలపై గళం విప్పేందుకు బాధితులు సిద్ధం
-  ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి  


 సాక్షి, విశాఖపట్నం: అధికార పార్టీకి చెందిన కబ్జారాయుళ్ల కబంధహస్తాల్లో చిక్కుకున్న విశాఖ నగరాన్ని రక్షించేందుకు ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ గురువారం నిర్వహించే ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నాకు తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. టీడీపీ నేతల భూ కబ్జాల వల్ల రూ. కోట్ల విలువైన భూములను ఎలా కోల్పోయామో చెప్పుకునేందుకు ఇదే సరైన వేదికగా బాధితులంతా భావిస్తున్నారు. జీవీఎంసీ ఎదుట గాంధీ బొమ్మ వద్ద జరిగే ధర్నాలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. వైఎస్‌ జగన్‌ ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌ నుంచి విమానంలో బయల్దేరి 9.30 గంటలకు విశాఖ చేరుకుంటారు.

విశాఖ భూ కుంభకోణంపై సీబీఐతో విచారించాలనే డిమాండ్‌తో నిర్వహిస్తున్న ‘సేవ్‌ విశాఖ’ మహాధర్నాలో ప్రసంగిస్తారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు విమానంలో హైదరాబాద్‌ తిరిగి వెళ్తారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రోగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు. విశాఖ మహాధర్నా ఏర్పాట్లను వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ తదితరులు బుధవారం పరిశీలించారు. ఆందోళనలో తాము కూడా పాలుపంచుకుంటామని ఇతర విపక్షాలు, ప్రజాసంఘాలు ప్రకటించాయి.

గద్దల్లా వాలుతున్న అధికార పార్టీ నేతలు
రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖలో కాస్తంత ఖాళీ జాగా కన్పిస్తే చాలు టీడీపీ నేతలు వాలిపోతున్నారు. గత మూడేళ్లలో లక్ష కోట్లకు పైగా విలువైన భూములను కైంకర్యం చేశారన్న ఆరోపణలున్నాయి.భూ రికార్డుల ట్యాంపరింగ్‌ కుంభకోణంలో అధికార పార్టీ పెద్దలహస్తం ఉన్నట్టు తేటతల్లమవుతోంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్‌తో,  జిల్లాకు చెందిన ఓ మంత్రి పాత్రపై సీబీఐ విచారణ జరపాలని ప్రజలు ముక్తకంఠంతో  డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోకుండా సిట్‌తో దర్యాప్తునకు ఆదేశించటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సీబీఐ విచారణ కోసం వైఎస్సార్‌ సీపీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి విపక్షాలన్నింటినీ ఏకతాటిìపైకి తెచ్చింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో పెందుర్తి మండలం ముదుపాక గ్రామంలో పర్యటించింది. ల్యాండ్‌ పూలింగ్‌ మాటున బలవంతంగా భూములు లాక్కోవడంతో రోడ్డున పడ్డ బాధితులకు అండగా నిలిచింది. ఈ భూకుంభకోణాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చింది.

ప్లీనరీపై పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ కీలకభేటీ

Written By news on Monday, June 19, 2017 | 6/19/2017


ప్లీనరీపై పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ కీలకభేటీ
హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌  పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్లీనరీపై సోమవారం కీలక సమావేశం జరిగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్లీనరీలో చర్చించాల్సిన అంశాలు, కమిటీలు, ఏర్పాట్లపై చర్చించారు. జూలై 8,9 తేదీల్లో నిర్వహించే పార్టీ ప్లీనరీలో ప్రవేశపెట్టాల్సిన తీర్మాణాలపై వైఎస్ జగన్‌, పార్టీ నేతలు నిశితంగా చర్చించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో ఎంపీలు విజయసాయిరెడ్డి. వైవీ సుబ్బారెడ్డి, మండలి విపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి,వెల్లంపల్లి శ్రీనివాస్‌, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

అనంతరం ప్లీనరీ సమావేశం వివరాలను బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో వివరించారు. పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు, తీర్మానాలపై చర్చించినట్లు తెలిపారు. అలాగే విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేస్తూ తమ పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో ఈ నెల 22న విశాఖలో మహాధర్నా చేపట్టనున్నట్లు బొత్స పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేశ్‌ ఆధ్వర్యంలో మంత్రుల ప్రమేయంతోనే లక్ష ఎకరాల భూ కుంభకోణం జరిగిందన్నారు.
దీనిపై సీబీఐతో  విచారణ  చేయించాల్సిందేనని  అన్నారు. డీజీపీ సాంబశివరావు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని, సిట్‌ విచారణ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అధికార పార్టీ నేతలు బెరితెగించి భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని బొత్స మండిపడ్డారు. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పైనా సిట్‌తో విచారణ జరిపించారని ఏం ఫలితం వచ్చిందని ప్రశ్నించారు. సాక్షాత్తూ సీఎం సొంత పొలంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగినా సిట్ దర్యాప్తులో ఆ అంశాలు వెలుగులోకి రాలేదని బొత్స గుర్తు చేశారు.

Popular Posts

Topics :