19 July 2015 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

ఆ నిధులు కరెంట్ బిల్లులకూ సరిపోవు

Written By news on Saturday, July 25, 2015 | 7/25/2015


'ఆ నిధులు కరెంట్ బిల్లులకూ సరిపోవు'
మడకశిర : హంద్రీనీవా ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కనీసం కరెంట్ బిల్లులకు కూడా సరిపోవని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన రైతు భరోసాయాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. మడకశిరలో జరిగిన బహిరంగసభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్టాటకలో బోయ వర్గంవారు ఎస్టీలుగా ఉన్నారని, కానీ ఏపీలో మాత్రం బీసీలుగా ఉండిపోయారన్నారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జరిగే తొలి అసెంబ్లీ సమావేశాల్లో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేస్తామని ఆయన పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన రూ.200 కోట్ల నిధులు కరెంట్ బిల్లులకు కూడా సరిపోవంటూ ఆయన ఎద్దేవా చేశారు.

తాను అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి ఆయకట్టుకు నీరందిస్తానన్నారు. రైతులు, మహిళలను బాబు దారుణంగా మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ఏపీని గుడిసెలు లేని రాష్ట్రంగా చేస్తానన్న బాబు ఒక్క ఇల్లయినా కట్టించి ఇవ్వాలన్నారు. విద్యుత్ ఛార్జీలు దారుణంగా పెంచారని, గతంలో రూ. 200 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు రూ.600 వస్తోందని తెలిపారు. చంద్రబాబు సర్కార్ మెడలు వంచైనా సరే హామీలు సాధించుకుందామని ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రిషితేశ్వరి కేసును మరుగున పడేసేందుకు కుట్ర

గుంటూరు : రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ మేరుగ నాగార్జున, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ హెచ్చరించారు. శనివారం వారు నాగార్జున యూనివర్సిటీని సందర్శించారు.

ఈ సందర్భంగా మేరు నాగార్జున మాట్లాడుతూ.. రిషితేశ్వరి కేసును మరుగున పడేసేందుకే యూనివర్సిటీకి 10 రోజులు శెలవులు ప్రకటించారన్నారు. విద్యార్థులు అందోళన చేస్తే ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌తోనే సరిపెట్టారని ఆయన అన్నారు. ఆత్మహత్య కారకులందరిపై కేసు నమోదు చేసి శిక్షించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.
 

టీడీపీనే చేసిందేమోనని అనుమానం


'టీడీపీనే చేసిందేమోనని అనుమానం'
విజయనగరం : తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టిన పారిశుద్ధ్య కార్మికులు శనివారం వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణను కలిశారు. తమ సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలంటూ వారు వినతిపత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సమ్మెపై ఒంటెద్దు పోకడలు అనుసరిస్తోందన్నారు. రాజమండ్రిలో జరిగిన ప్రమాద ఘటనలు టీడీపీనే చేసిందేమోనని అనుమానం కలుగుతుందన్నారు.

అటువంటి కుట్రపూరిత కార్యక్రమాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని బొత్స వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రాజమండ్రిలో ఉండగానే జరిగిన ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజధాని పేరుతో చేస్తుంది పాలన కాదని, వ్యాపారమని బొత్స ఎద్దేవా చేశారు. వ్యాపార భాగస్వామ్యం కోసం చంద్రబాబు సింగపూర్ నుంచి రాజధాని ప్లాన్ తీసుకున్నారని ఆయన విమర్శించారు.

'అనంత’ ఆత్మహత్యలు దేశానికి తెలిశాయి!


'అనంత’ ఆత్మహత్యలు దేశానికి తెలిశాయి!
అందుకే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ‘అనంత’కు వచ్చారు: వైఎస్ జగన్

అనంతపురం: ‘‘రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోయిందని రాహుల్‌గాంధీ అన్నారట. వారు పెద్దోళ్లు... అవసరంకోసం ఏమైనా మాట్లాడతారు. అవసరం వస్తే దండ వేస్తారు. లేదంటే బండ వేస్తారు. కానీ ఏడాదిగా ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉన్నాం. గుంటూరు, మంగళగిరితోపాటు చాలాచోట్ల దీక్షలు చేశాం. మేం చేసిన రైతు భరోసాయాత్రతోనే అనంతపురం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఢిల్లీకి తెలిశాయి. అందుకే విమానం ఎక్కి ఢిల్లీ నుంచి జిల్లాకు వచ్చారు’’ అని  ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై వైఎస్సార్‌సీపీ అధినేత, విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతుభరోసాయాత్ర నాలుగోరోజు శుక్రవారం జగన్ పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో పర్యటించి, ఐదు కుటుంబాలను ఓదార్చారు. రొద్దం మండల కేంద్రంలో రైతులు, డ్వాక్రా మహిళలతో చర్చాగోష్టి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
తెలుగుదేశం ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా మోసం చేయడంతో రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. అనంతపురం జిల్లాలో 80 మందికిపైగా అన్నదాతలు, 20మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు ధైర్యం చెప్పాలని గత నాలుగు నెలల్లో 23 రోజులపాటు భార్య, పిల్లలను వదిలి రైతు భరోసాయాత్ర చేస్తున్నా. రెండు విడతల్లో 25 కుటుంబాలను పరామర్శించా. మూడో విడత సాగుతోంది. రైతులు, చేనేతలు ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారో ప్రభుత్వాలకు చూపించేలా తిరుగుతున్నా. ఈ యాత్రతోనే‘అనంత’ ఆత్మహత్యలు దేశానికి తెలిశాయి. అనంతపురం అనే  ఓ జిల్లా ఉందని రాహుల్‌గాంధీకి జ్ఞానోదయమైంది.

అవసరం ఉందంటే దండ.. లేదంటే బండ
రాహుల్‌గాంధీ చాలా పెద్దవారు. అవసరం కోసం ఏదైనా మాట్లాడతారు. అవసరం లేకపోతే తీసి పక్కనపడేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చివరి రక్తపుబొట్టు వరకూ కాంగ్రెస్‌పార్టీ కోసం శ్రమించారు. వారి కోసం పోరాడారు. పోరాడుతూనే చనిపోయా రు. వైఎస్ బతికి ఉన్నపుడు గొప్పవారు... జగ న్ కూడా కాంగ్రెస్‌లో ఉన్నంతవరకూ గొప్పవాడే! ఇచ్చిన మాటకోసం ‘ఓదార్పు’ చేసేందుకు పార్టీని వదిలితే జగన్ చెడ్డవాడైపోయాడు... వైఎస్ కూడా చెడ్డవారైపోయారు. చివరకు టీడీపీతో కలిసి మాపై ఒక్కటై కేసులు పెట్టారు.

వైఎస్ పేరు చెప్పకపోతే ఇక్కడ ఏమీ చేయలేరు. అందుకే రాహుల్‌గాంధీ మళ్లీ వైఎస్‌కు దండ వేశారు. అవసరం వస్తే దండ వేస్తారు... లేదంటే బండ వేస్తారు. రాష్ట్రాన్ని విడగొట్టొద్దని అంటే వినకుండా విడగొట్టారు. ఇప్పుడొచ్చి ప్రత్యేకహోదా రాలేదా? పోలవరం కాలేదా? అని మాట్లాడుతున్నారు. వీళ్లలా భయానక రాజకీయాలు నేర్చుకోలేదని చెప్పేందుకు సంతోషిస్తున్నా.

రైతులు పిట్టల్లా రాలుతున్నా చంద్రబాబుకు పట్టలేదు
‘అనంత’లో రైతులు, చేనేతలు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికలముందు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఇప్పడు చేయలేదు. దీంతో అప్పులబాధ తాళలేక వీరంతా ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. లక్షలమంది ఉపాధికోసం బెంగళూరుకు వలస వెళుతున్నారు. ‘అనంత’లో ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా చంద్రబాబుకు పట్టలేదు. హామీలు అమలు చేసేలా పోరాడుదాం, చంద్రబాబు మెడలు వంచుదాం.

విత్తనాలు కూడా సరఫరా చేయని అన్యాయమైన పరిస్థితులున్నాయి. జిల్లాకు 5.50 లక్షల క్వింటాళ్ల వేరుసెనగ విత్తనం అవసరమైతే.. కేవలం 1.50లక్షల క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారు. టీడీపీ నేతలు వాటిని అమ్ముకుంటూ పట్టుబడిన దారుణస్థితి. దీంతోపాటు ఇసుకను కూడా దోచుకుతింటున్నారు.

ఇష్టాగోష్టిలో రైతులు, డ్వాక్రా మహిళల అభిప్రాయాలు
చంద్రబాబు తొలగిపోతే శనిపోతుంది
సార్! మాది షిరిడిసాయి గ్రూపు. మాకు రూ.1.50 లక్షల అప్పుంది. రుణ మాఫీ అవుతాదని అప్పుచెల్లించలేదు. ఇప్పుడు మీ అబ్బసొమ్మా... బాకీ కట్టండని బ్యాంకోళ్లు అంటాండారు. భిక్షగాళ్లకు వేసినట్లు మూడువేలు ఇస్తున్నారు. తిరుపతికి వెళ్లకుండానే నామాలు పెడుతున్నారు. చంద్రబాబు తొలగిపోతే ఏడేళ్ల శనిపోతుంది.     -  నిర్మల, చోలేమరి

ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పుడే చూశా..
సార్... నాకు రూ.1.40 లక్షల బ్యాంకు అప్పుంది. వడ్డీ రూ.30వేలైంది. రూ.14వేలే మాఫీ అయింది. ఇన్స్యూరెన్స్, ఇన్‌పుట్‌సబ్సిడీ లేదు. గత 45 ఏళ్లలో విత్తనాలు ఇవ్వని ప్రభుత్వాన్ని ఇప్పుడే సూచ్చాండా!      - శ్రీరామిరెడ్డి, రొద్దం

రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేశాడు..
డబ్బులు మాఫీ అవుతాయని ఆశపడి అందరం ఓట్లేసినాం. ఇప్పుడు మూడునామాలు పెట్టిచ్చుకున్నాం. నాకు పింఛన్‌కూడా ఇవ్వలేదు. టీడీపీ వాళ్లకే ఇస్తాండారు. నాకు ఇచ్చినా, ఇవ్వపోయినా లెక్కలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా సెంద్రబాబు సేసినాడు.  - రత్నమ్మ, రాగిమేకలపల్లి,

బాబు మాటలు నమ్మి నట్టేట మునిగాం


బాబు మాటలు నమ్మి నట్టేట మునిగాం
రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేకప్రతినిధి: ‘‘బాబు రావాలి.. రుణమాఫీ జరగాలి.. అంటూ మా ఊళ్లో ఎన్నికల ముందు ఇంటి గోడలపై, స్కూలు బిల్డింగ్‌కు, బ్యాంకు వద్ద పెద్దపెద్ద అక్షరాలతో రాశారు. చంద్రబాబు ఏదో చేస్తారని, ఆయన ఇచ్చిన హామీలు అమలవుతాయని నమ్మి ఓట్లేస్తే.. రుణమాఫీ కాకపోగా 14% అపరాధ వడ్డీని బ్యాంకు అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. బాబు మాటలు నమ్మి నట్టేట మునిగాం’’ అని రొద్దం మండలం వై.టి.రెడ్డిపల్లి గ్రామస్తులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు. మూడో విడత రైతు భరోసాయాత్రలో భాగంగా శుక్రవారం పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని వై.టి.రెడ్డిపల్లిలో మహిళా రైతు లక్ష్మీదేవమ్మ, పెద్దపాతన్న, గోనిమేకలపల్లిలో శ్రీనివాసులు, గోపీనాథ్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు.

బ్యాంకులో ఉన్న బంగారాన్ని కూతురు పెళ్లికి విడిపించలేక తన భార్య ఆత్మహత్య చేసుకుందని లక్ష్మీదేవమ్మ భర్త హనుమంతప్ప వాపోయారు. ప్రభుత్వం రూ. 1.50 లక్షల ఎక్స్‌గ్రేషియా మాత్రమే ఇచ్చిందని చెప్పారు. ‘‘వాళ్లు ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు. వాళ్లు ఇవ్వాలనుకుంటే ఒక రకమైన సహాయం.. ఇవ్వకూడదనుకుంటే మరోరకం సహాయం.. లేదంటే అది కూడా ఇవ్వకుండా ఉంటారు. ఇలాగైతే చనిపోయిన రైతు కుటుంబాలకు మేలు జరిగేదేలా?’’ అని సర్కారు తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడికి సమీపంలోనే ఉన్న రైతు పెద్ద పాతన్న కుటుంబాన్ని పరామర్శించారు. పాతన్న కూతురు అంజలి(12) పుట్టుకతోనే మూగ, చెవిటి వైకల్యంతో బాధపడుతోందని తెలుసుకుని... ఆమెకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించే బాధ్యతను తీసుకున్నారు. తన భర్త మరణానికి ఎక్స్‌గ్రేషియా వర్తించదని అధికారులు నివేదికలు రూపొందించారని శ్రీనివాసులు భార్య సరోజమ్మ వాపోయారు. ఆమె కు న్యాయం చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు.

అడ్డగోలు నిర్ణయాలు ఇంకెంత కాలం


అడ్డగోలు నిర్ణయాలు ఇంకెంత కాలం: వైఎస్సార్‌సీపీ
సాక్షి, హైదరాబాద్: మన తెలంగాణ... మన పాలన... అన్నీ అందరి నిర్ణయాలతో సమష్ఠిగా కలసి బంగారు పాలన చేసుకుందామని ఉద్యమ సమయంలోనూ, ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్ వాస్తవంగా, క్షేత్రస్థాయిలో చేస్తున్నదేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రశ్నించింది. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి.. సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హుజూరాబాద్‌లో ఉపాధ్యాయురాలి దండనకు తొమ్మిదేళ్ల ఆశ్రీత బలికావటం తమ పార్టీని కలచి వేసిందన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. విద్యా శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించాలని హితవు పలికారు. ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థకు చేరిన మాట నిజమేనని తమ పార్టీ అంగీకరిస్తుందని తెలిపారు. వారంలోనే ఖాళీ చేయిస్తామని సీఎం అత్యవసరంగా ప్రకటించడం ఎంటని ప్రశ్నించారు.

అది ఆచరణ సాధ్యమా... ప్రకటించిన కేసీఆర్‌కే తెలియాలని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై సీఎం కమిటీ వేసినా ఇంత వరకు ఒక్కసారన్నా అది సమావేశం కాలేదన్నారు. 13 నెలల్లో సీఎం రకరకాల నిర్ణయాలు తీసుకున్నారని... 18 సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసిందని తెలిపారు. ఇలాంటి దుందుడుకు నిర్ణయాల సీఎంను తాను ఎన్నడూ చూడలేదని కొండా పేర్కొన్నారు. ఒకే రోజు కేబినెట్ సమావేశంలో 43 నిర్ణయాలపై కేసీఆర్ సర్కారు వైఖరి ప్రకటించిందన్నారు. దాన్ని ఒక రికార్డుగా ఆయన మంత్రి వర్గసభ్యులు ప్రచారం చేసుకున్నా.. వాటిపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. తక్షణమే 43 నిర్ణయాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

‘హోదా’పై పోరాడుతోంది జగన్ మాత్రమే


‘హోదా’పై పోరాడుతోంది జగన్ మాత్రమే
రాహుల్‌గాంధీ వ్యాఖ్యలకు బదులిచ్చిన వైఎస్సార్‌సీపీ
మా అధ్యక్షుడు ప్రధాని, హోం, ఆర్థిక మంత్రులను కలిశారు
ప్రత్యేకహోదాకోసం మంగళగిరిలో నిరసనదీక్ష చేశారు
మా పోరాటాలవల్లనే కొందరికైనా న్యాయం దక్కింది
ప్రత్యేకహోదా, పోలవరంపై మీరేం చేశారు?

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై జగన్ మాట్లాడాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించడం చూస్తే...

ఆయనకు రాజకీయం తెలియకపోయుండాలి లేదా దురుద్దేశమైనా ఉండాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారధి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తోందని రాహుల్ చేసిన విమర్శలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై రాహుల్‌గాంధీ, చంద్రబాబు ఎవరూ పట్టించుకోలేదు. ఏడాది కాలంలో ఒక్క అడుగు ముందుకు పడకున్నా మౌనముద్ర దాల్చారు.

రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పోరాడింది మా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన ఇప్పటికి రెండుసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరారు. మూడు నాలుగుసార్లు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ను, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీనీ కలిసి విన్నవించారు. మంగళగిరిలో నిరసన దీక్ష చేపట్టారు. కేంద్రంలో మిత్రపక్షమే అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా ఎం దుకు సాధించలేకపోతున్నారని ముఖ్యమంత్రిని అనేకసార్లు ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా సాధన కోసం వెంటనే కేంద్రం నుంచి టీడీపీ మంత్రులను వైదొలగాలని డిమాండ్ చేశారు’’ అని వివరించారు. ప్రత్యేక హోదాపై పార్లమెం ట్‌లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఏం పోరాటం చేసిందని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఒకసారైనా ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.
 
చంద్రబాబు వైఫల్యాలపై మాట్లాడరేం?
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు రాష్ట్రానికొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రైతు ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబు గురించి ఒక్కమాట మాట్లాడకుండా వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంద ని పార్థసారధి తప్పుపట్టారు. ‘‘బీజేపీ పెద్దల అవినీతి అంశాలపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలు మాత్రం రాహుల్‌కు కనిపించడం లేదు.

ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు లాంటి ‘ఓటుకు కోట్లు’ కేసులో  కూరుకుపోయిన చంద్రబాబు గురించి ఒక్కమాట మాట్లాడలేదు. పట్టిసీమ ప్రాజెక్టు అవినీ తి కంపుకొడుతున్నా రాహుల్ కు కనబడలేదు.బాబు కారణంగానే పుష్కరాల్లో 30 మంది చనిపోయారని జాతీయ మీడియా కోడైకూసినా, 22 మంది తమిళులను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపినా రాహుల్‌గానీ, సోనియాగానీ పార్లమెంట్‌లో ప్రస్తావనే తేలేదు’’ అని దుయ్యబట్టారు.దీన్ని బట్టి ఎన్నికల ముందు టీడీపీతో ఉన్న అక్రమ సంబంధాన్ని రాహుల్ ఇంకా కొనసాగిస్తున్నారని అర్థమవుతోందని విమర్శించారు.
 
జగన్ పోరాటంతోనే కొందరికైనా న్యాయం
‘‘జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో రైతు దీక్ష చే పడితేగానీ ప్రభుత్వం తొలిదశ రుణమాఫీ డబ్బు విడుదల చేయలేదు. ఆయన అల్టిమేటం జారీ చేస్తేగానీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించలేదు. మంగళగిరిలో దీక్ష చేపడితేగానీ డ్వాక్రా మహిళలకు కనీసం రూ. మూడు వేలైనా సాయం దక్కలేదు’’ అని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోవడంవల్ల ఇలాంటివన్నీ రాహుల్‌కు తెలిసి ఉండకపోవచ్చని పార్థసారధి విమర్శించారు.

అనంతపురం జిల్లాలో వందమంది రైతులు చనిపోతే జగన్ మూడోవిడత భరోసాయాత్ర నిర్వహిస్తుంటే... రాహుల్ 14 నెలల తర్వాత నిద్రలేచారన్నారు. రాహుల్  పరామర్శ యాత్ర ఒక వంక మాత్రమేనన్నారు. సొంత సీఎం, మంత్రులు, నేతలందరూ విభజన వద్దని వారించినా వినని వారికి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు.  రాష్ట్రంలో ఒక్కసీటు కూడ గెలవని కాంగ్రెస్, 67 సీట్లు గెలిచిన తమకు పోటీ పార్టీగా అస్సలు భావించడం లేదన్నారు.

అవసరమైతే దండ.. లేకుంటే బండ

Written By news on Friday, July 24, 2015 | 7/24/2015


'అవసరమైతే దండ.. లేకుంటే బండ వేస్తారు'
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ అవసరముంటే వాడుకుంటాదని, లేదంటే పక్కన పెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి కాంగ్రెస్ పార్టీ తనపై కేసులు పెట్టిందని ఆరోపించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. రొద్దం సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇదే రోజు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. అవసరమైనపుడు దండ వేయడం, లేకుంటే బండ వేయడం రాహుల్ కే చెల్లిందని అన్నారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..
 
  • దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి బొట్టుదాకా ఇందిరా గాంధీ కుటుంబం కోసం కష్టపడ్డారు
  • వైఎస్ఆర్ బతికున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్లు గొప్పవాడన్నారు
  • కాంగ్రెస్ లో కొనసాగినంత వరకు వైఎస్ జగన్ ను మంచి వాడన్నారు
  • వైఎస్ఆర్ కోసం ప్రాణాలు వదిలిన వారి కోసం ఓదార్పు యాత్ర చేస్తే నన్ను చెడ్డవాడన్నారు
  • కాంగ్రెస్ చంద్రబాబుతో కలసి నాపై కేసులు పెట్టింది
  • అవసరమైనపుడు దండ వేయడం, అవసరం లేకుంటే బండ వేయడం రాహుల్ కే చెల్లింది
  • రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి ఇప్పుడు అన్యాయం జరిగిందని రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారు
  • ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు సాధనకు అనేక పోరాటాలు చేశాం
  • వైఎస్ ఆర్ సీపీ ఆధ్వర్యంలో వైజాగ్ లో ధర్నా, తణుకు, మంగళగిరిలో దీక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేయడం రాహుల్ కు గుర్తు రాలేదా?
  • రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యల గురించి దేశానికి తెలియజేసేందుకు రైతు భరోసా యాత్ర చేపట్టాను
  • 4 నెలల రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నా
  • అనంతపురం జిల్లా రైతుల దుస్థితిని దేశం తెలుసుకునేలా చేశాం
  • దీన్ని తెలుసుకునే రాహుల్ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు
  • ఏపీలో రైతులు, డ్వాక్రా మహిళలు అనేక బాధలు పడుతున్నారు
  • ఎన్నికల ముందు చంద్రబాబు హామీలు నమ్మి రైతులు, డ్వాక్రా మహిళలు రుణాలు కట్టలేదు
  • అనంతపురం జిల్లాలో 70 మంది రైతులు, 20 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు
  • ఈ జిల్లాలో ఉపాధి కరువై రైతులు, వ్యవసాయ కూలీలు వలస వెళ్లారు
  • రైతులు ఆనందంగా ఉన్నారని చంద్రబాబు చెప్పటం సిగ్గుచేటు
  • రైతులకు వేరుశనగ విత్తనాలు సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వముంది
  • అనంతపురం జిల్లా రైతులకు 5 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కావాల్సి ఉంటే కేవలం లక్షన్నర క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారు
  • ఆ విత్తనాలను కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు
  • టీడీపీ నేతలు ఇసుకను దోచుకుంటున్న వైనాన్ని జనం గమనిస్తున్నారు

నాలుగో రోజు ముగిసిన జగన్ రైతు భరోసా యాత్ర

నంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగో రోజు రైతు భరోసా యాత్ర ముగిసింది. శుక్రవారం ఆయన పెనుకొండ నియోజక వర్గంలో పర్యటించారు. ఆత్మహత్యకు పాల్పడిన పలు రైతు కుటుంబాలను పరామర్శించారు.

వైటిరెడ్డిపల్లి లో ఆత్మహత్యకు పాల్పడిన లక్ష్మీదేవమ్మ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన అదే గ్రామంలోని పెద్ద పాతన్న కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గౌనిమేకలపల్లి చేరుకుని రైతులు శ్రీనివాసులు, గోపినాథ్ కుటుంబాలను ఓదార్చారు. కొత్తపల్లికి చేరుకుని రైతు లక్ష్మన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఆ తర్వాత రొద్దం గ్రామంలో రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు.

రొద్దం సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. రైతు భరోసా యాత్రంలో భాగంగా ఐదో రోజు శనివారం వైఎస్ జగన్ పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. రేపు పలు కుటుంబాలను పరామర్శించనున్నారు.

మాస్టర్‌ప్లానంతా వ్యాపారమే


మాస్టర్‌ప్లానంతా వ్యాపారమే
సాక్షి, హైదరాబాద్: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్  రూపొందించామంటూ సీఎం చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని, వాస్తవానికి అందులో ఉన్నదంతా వ్యాపారమేనని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గద్దెనెక్కినప్పటినుంచే రాజధానిపై సింగపూర్‌లోని ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని, లావాదేవీలకు సంబంధించిన  అంశాలపై ఎపుడో మాట్లాడేసుకున్నారని చెప్పారు.

రాజధానికి సంబంధించి ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరగలేదని, అవన్నీ సింగపూర్ సంస్థలతోనే అనే విషయం ఇపుడు స్పష్టంగా తేలిపోయిందన్నారు. రాజధాని నిర్మాణంకోసం ప్రత్యేక సంస్థనొకదాన్ని ఏర్పాటు చేస్తామని, స్విస్ చాలెంజింగ్ పద్ధతిలోనే పనులప్పగిస్తామని ఓవైపు చెబుతూనే మళ్లీ దేశంలోని ఇతర సంస్థలకూ టెండర్లలో పాల్గొనే అవకాశమిస్తామంటూ నిష్పాక్షికంగా ఉన్నట్లు చంద్రబాబు ప్రజలముందు నటిస్తున్నారని ధర్మాన విమర్శించారు.

కాగా కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేసిన వ్యవహారంలో ఆమెదే తప్పని మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు అభిప్రాయపడటం అప్రజాస్వామికమని ధర్మాన ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ వ్యవహారంలో  సీఎం ఓ ఐఏఎస్ అధికారితో దర్యాప్తు చేయిస్తానని హామీఇచ్చినా ఇంతవరకూ రూపుదాల్చలేదన్నారు.

తొక్కిసలాటలో కుట్ర ఉందని మంత్రులతో చెప్పిస్తారా?

పుష్కరాల్లో తొక్కిసలాటకు కారణాలు వేరే ఉన్నాయంటూ మంత్రులతో కేబినెట్ భేటీలో చెప్పించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ధర్మాన అన్నారు. చంద్రబాబు చేసిన తప్పువల్ల పుష్కరాల్లో 30మంది ప్రాణాలు కోల్పోయిన విషయం స్పష్టంగా అందరికీ తెలిసిపోతోంటే మంత్రులతో ఇలా మాట్లాడించడం తగదన్నారు.

శాంతియుత ర్యాలీపై పోలీసుల దాష్టీకం


శాంతియుత ర్యాలీపై పోలీసుల దాష్టీకం
- అధికారపార్టీ నేతలఆదేశాలతో జంగా అరెస్ట్
- యరపతినేని అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయం
- పోలీసులపై మండిపడ్డ వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు
- మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం
సాక్షి, గుంటూరు:
 టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో పోలీసులు అధికారపార్టీ నేతలు చెప్పినట్లుగా నడుచుకుంటూ ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా చేపట్టే ర్యాలీలపై జులుం ప్రదర్శిస్తున్నారు. అక్రమాలు బయటకు రాకుండా అధికారపార్టీ నేతలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు పరిధిలో అధికారపార్టీ నేతల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడటం, ఎదురుతిరిగిన వారిపై తప్పుడు కేసులు బనాయించి జైలుపాలు చేయడం అధికార పార్టీ నేతలకు పరిపాటిగా మారింది. అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా, రేషన్ మాఫియాలకు అధికార పార్టీ నేతలు అండగా నిలుస్తూ కోట్లు గడిస్తున్నారు.

దీనిని ప్రతిఘటిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే యరపతినేని అక్రమాలపై పోరాడేందుకు సిద్ధమైన వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిపై గత రెండు రోజులుగా పోలీసులు ప్రవర్తిస్తున్నతీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంది. బుధవారం దాచేపల్లిలో యరపతినేని అక్రమాలకు నిరసనగా నల్లజెండాలతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన జంగాను దౌర్జన్యంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లిన సంఘటన తెల్సిందే. దీనికి నిరసనగా గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసేందుకు జంగా గుంటూరుకు పాదయాత్రగా బయలుదేరారు. రాజుపాలెం మండలం, కోటనెమలిపురి గ్రామ బస్టాండు వద్దకు రాగానే పిడుగురాళ్ల రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా అక్కడ చేరుకుని జంగాను అరెస్టు చేసి రాజుపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. జంగా అరెస్టుకు నిరసనగా వైఎస్సార్ సీపీ రాజుపాలెం జడ్పీటీసీ మర్రి సుందర్రామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పోలీసుస్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.

వారినిసైతం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. విషయం తెల్సుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మాచర్ల, బాపట్ల ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఆతుకూరి ఆంజనేయులు తదితర నాయకులు రాజుపాలెం పోలీసుస్టేషన్‌కు చేరుకుని జంగాను పరామర్శించారు. ఈ విషయం ఇంతటితో వదిలేది లేదనీ, జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రమానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని నాయకులు చెప్పారు. పోలీసులు అక్రమాలకు పాల్పడే రౌడీలు, గూండాలకు వత్తాసు పలుకుతూ ప్రజాస్వామ్యయుతంగా పాదయాత్ర చేస్తున్న జంగాను అరెస్టు చేయడం హేయమైన చర్య అని వారు మండిపడ్డారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ


ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్
పట్నంబజారు(గుంటూరు) : 
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నిప్పులు చెరిగారు. గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేస్తున్న దురాగతాలను తెలియపరిచేందుకు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న పార్టీ నేత జంగా కృష్ణమూర్తి విషయంలో పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

గురజాల నియోజకవర్గంలో ఎమర్జెన్సీ పెట్టిన విధంగా పరిణామాలు ఉన్నాయని మండిపడ్డారు. అరండల్‌పేటలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి విషయాలను వెల్లడించేందుకు బయలుదేరిన జంగాను బుధవారం ఒకసారి, గురువారం బెల్లకొండ వద్ద మరోసారి అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు.

యరపతినేని చేస్తున్న మైనింగ్ మాఫియా, ప్రభుత్వ వనరులను కొల్లగొడుతున్న విషయాన్ని సంబంధిత ఆర్డీవో, తహశీల్దార్‌లకు చెప్పినప్పటికీ ప్రశ్నించే హక్కు లేదన్న చందం గా వ్యవహరిస్తున్నారన్నారు. జంగాను అక్రమం గా నిర్బంధించినంత మాత్రాన నిజాలు దాగవ న్న  విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ అక్రమాలను అడ్డుకోవడంతో పాటు, జంగాకు అండగా పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ అధికార పార్టీ దురాగతాలను ఎండగట్టేందుకు ఎంతటి పోరాటాలకైనా వెనుకాడమని హెచ్చరించారు. పార్టీ నగరాధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ పోలీసులు ఖాకీ చొక్కాలు విప్పేసి, పచ్చ చొక్కాలు వేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జంగా ఆరోగ్యం సరిగాలేదని తెలిసినా, అరెస్ట్ చేయించడం టీడీపీ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.  సమావేశంలో వైఎస్సార్‌సీపీ పలు విభాగాల నేతలు ఆతుకూరి ఆంజనేయులు, ఎండీ నసీర్‌అహ్మద్, అంగడి శ్రీనివాసరావు, కొత్తా చిన్నపరెడ్డి, మొగిలి మధు, సయ్యద్ మాబు, బండారు సాయిబాబు, యేళ్ళ జయలక్ష్మి, కొలకలూరి కోటేశ్వరరావు, మండేపూడి పురుషోత్తం, అత్తోట జోసఫ్, ఆవుల సుందర్‌రెడ్డి, నిమ్మరాజు శారదాలక్ష్మి, దేవరాజు, ఎలికా శ్రీకాంత్‌యాదవ్, గనిక ఝాన్సీరాణి, ఉప్పుటూరి నర్సిరెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

పోలీసులా..తెదేపా కార్యకర్తలా..


పోలీసులా..తెదేపా కార్యకర్తలా..
రాజుపాలెం : వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, జెడ్పీటీసీ సభ్యుడు మర్రి వెంకట్రామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలను గురువారం పోలీసులు అరెస్టు చేయటంతో విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులులు రాజుపాలెం పోలీస్ స్టేషన్‌కు వచ్చి జంగాను, జెడ్పీటీసీని, నాయకులను పరామర్శించారు. అనంతరం పిడుగురాళ్ల రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డిని కలసి వారిని అరెస్టు చేయటానికి గల కారణాలు చూపించాలని అడిగారు. శాంతియుతంగా కాలి నడకన వెళ్తున్న కృష్ణమూర్తిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు.

శాంతి భద్రతల దృష్ట్యా అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అరాచకాలు చేస్తున్న ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోవటం దారుణం అన్నారు. కోనా రఘుపతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కృష్ణమూర్తికి ఒక సామాజిక వర్గం ఉందని తెలిసి కూడా అరెష్టు చేయడం అగ్గి మీద కిరోసిన్ పోసినట్లు ఉందని పేర్కొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీకి పోలీసులు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని, అధికారం ఒకరి సొత్తు కాదని తెలుసుకోవాలన్నారు.

జిల్లా సేవాదళ్ అధ్యక్షులు చిన్నప్పరెడ్డి, పిడుగురాళ్ల , దాచేపల్లి జెడ్పీటీసీలు వీరబద్దుని రామిరెడ్డి, ములుగొండ ప్రకాష్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ మాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మొగిలి మధుసూదన్‌రావు, బీసీ సెల్ రాష్ట్ర సభ్యులు కోడిరెక్క దేవదాసు, జిల్లా సంయుక్త కార్యదర్శి తాటికొండ చిన్న ఆంజనేయులురెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, రాష్ట్ర విభజన అధ్యక్షులు కొఠారి నరసింహారావు, రాష్ట్ర బీసీ కార్యవర్గ సభ్యులు కుందుర్తి గురవాచారి, బీసీ సెల్ సభ్యులు దూదేకుల మీరావలి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు పాట్లు


ఇది గిమ్మిక్కుల ప్రభుత్వం
- ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు పాట్లు
- మాస్టర్ ప్లాన్ కాదది డైవర్షన్ ప్లాన్
- ధ్వజమెత్తిన వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి, మేయర్, ఎమ్మెల్యేలు
కడప కార్పొరేషన్:
 చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రభుత్వం గిమ్మిక్కులు చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో నగర మేయర్ కె. సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాతో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఓటుకు కోట్లు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయి, చంద్రబాబు మాట్లాడిన కాల్‌రికార్డింగ్స్ బట్టబయలైతే దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పుష్కరాలను వినియోగించుకొన్నారన్నారు.

పుష్కరాలు గోదావరి నదీ పరివాహక ప్రాంతమంతా సాగుతాయి, కానీ చంద్రబాబు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంతా నేనే చేస్తున్నాను, అంతా నావల్లే జరుగుతోందని వ్యక్తిగత ప్రచారం చేసుకోవడానికి 30 మంది ప్రాణాలు బలిగొన్నారని మండిపడ్డారు.  పుష్కరాల్లో జరిగిన  తొక్కిసలాట ఘటనను చెరిపేయడానికి మాస్టర్‌ప్లాన్ అంటూ ప్రచారం మొదలు పెట్టారన్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌తో సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, సింగపూర్‌లోని ఒక కంపెనీ దాన్ని తయారు చేసిందన్నారు. రెండు దేశాల మధ్య ఒప్పందాలు జరిగేటప్పుడు ఆ దేశ జాతీయ జెండాలు పెట్టడం చూశాం గానీ ఏపీ ప్రభుత్వం, సింగపూర్ కంపెనీ మధ్య ఒప్పందం జరిగితే రెండు దేశాల జెండాలు పెట్టడం విచిత్రంగా ఉందన్నారు.
 
కాంగ్రెస్ బతుకంతా పిల్ల టీడీపీగా బ్రతకడమే
ఆంధ్రప్రదేశ్‌ను అడ్డంగా విభజించి రాహుల్‌గాంధీ ఏ మొఖం పెట్టుకొని రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని వారు ప్రశ్నించారు. వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబంపై కాంగ్రెస్, టీడీపీలు పగబట్టినట్లు వ్యవహరించాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓదార్పు చేయడానికి వీల్లేదని ఆదేశించిన దౌర్భాగ్యపు చరిత్ర సోనియాది, కాంగ్రెస్‌ది అన్నారు.

వైఎస్ జగన్ లొంగలేదని టీడీపీతో కలిసి ఆయనపై కేసు వేయించి 16నెలలు జై ల్లో పెట్టించారని మండిపడ్డారు. పై నుంచి ఆదేశాలు ఇచ్చి వైఎస్‌ఆర్ పేరును చార్జిషీట్‌లో చేర్చారన్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఆయన విగ్రహానికి ఎలా పూలమాల వేస్తారని ప్రశ్నించారు. వైఎస్‌ను స్మరించే అర్హత రాహుల్‌గాంధీకి లేదని తెలిపారు. ఇక కాంగ్రెస్ చరిత్ర అంతా ఏపీలో పిల్ల టీడీపీగా బ్రతకడమేనని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్ పాల్గొన్నారు.

పుష్కరాల పేరిట 30 మందిని బలిచేశారు

Written By news on Thursday, July 23, 2015 | 7/23/2015


'పుష్కరాల పేరిట 30 మందిని బలిచేశారు'
కడప : గోదావరి పుష్కరాల నిర్వహణ పేరిట 30 మంది అమాయక ప్రజలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలి తీసుకుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. పట్టణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... ప్రజా సమస్యలను ప్రభుత్వం గాలికొదిలేస్తుందని, కేవలం ఆర్భాటాలకే పెద్దపెట వేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతులు సమస్యలతో అల్లాడుతుంటే వేల కోట్ల రూపాయలు వెచ్చించి పుష్కరాల సినిమా తీస్తారా అని ఈ సందర్భంగా రాయచోటి ఎమ్మెల్యే ప్రశ్నించారు. రైతాంగం నిర్వీర్వం కాకముందే వారిని ఆదుకోవాలని, ఎకరాకు రూ. 20 వేలు తక్కువ కాకుండా ఇన్ పుట్ సబ్సిడీ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్భాటాలకు పోకుండా ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఏపీ మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు సర్కారుకు 4 రోజుల టైమ్ ఇస్తున్నాం


'చంద్రబాబు సర్కారుకు 4 రోజుల టైమ్ ఇస్తున్నాం'
అనంతపురం: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర బంద్ చేపడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. 14 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నా చంద్రబాబుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న ఆయన మున్సిపల్ కార్మికుల సమ్మెపై స్పందించారు.

చంద్రబాబు ప్రభుత్వానికి 4 రోజుల సమయం ఇస్తున్నామని, ఈలోపు స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త బంద్ చేపడతామన్నారు. శుక్రవారం జరిగే మున్సిపల్ కార్మికుల కలెక్టరేట్ల ముట్టడికి వైఎస్సార్ సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పుట్టపర్తిలో మున్సిపల్ కార్మికుడు వెంకయ్య గుండెపోటుతో మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచమంటే ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి తప్పడం న్యాయమా అని ప్రశ్నించారు. కార్మికుల వేతనాలు పెంచితే రూ.200  నుంచి రూ. 300 కోట్లు భారం పడుతుందన్నారు. కార్మికుల సమ్మెపై ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. సింగపూర్ బృందానికి రెడ్ కార్పెట్ పరిచే చంద్రబాబుకు కార్మికుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వైఎస్ జగన్ తెలిపారు.

ఎమ్మెల్సీగా ఉమ్మారెడ్డి ప్రమాణం


ఎమ్మెల్సీగా ఉమ్మారెడ్డి ప్రమాణం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్  శాసనమండలి సభ్యునిగా వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ప్రాంగణంలో ఉమ్మారెడ్డితో మండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణం చేయించారు. గుంటూరు జిల్లా స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ కోటాలో ఉమ్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేతలు విజయసాయిరెడ్డి, బొత్సా సత్యనారాయణతో పాటు పలువరు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఉమ్మారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు.
తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు, గుంటూరు జిల్లా నేతలు, స్ధానిక ప్రజాప్రతినిధులకు ఉమ్మారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై పెద్దల సభలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మారెడ్డి వెల్లడించారు.

ఏం ముఖం పెట్టుకుని వైఎస్ విగ్రహానికి పూలమాల వేస్తారు?


ఆ అర్హత రాహుల్‌కు లేదు: వాసిరెడ్డి పద్మ
ఏం ముఖం పెట్టుకుని వైఎస్ విగ్రహానికి పూలమాల వేస్తారు?
మీకు అవసరమైతే పూలదండ వేస్తారు.. లేదంటే బురద చల్లేస్తారా?
టీడీపీతో కలసి కేసులు వేసి వైఎస్ కుటుంబాన్ని వేధించింది మరిచారా?
విభజనకు కారణమైన రాహుల్ ఏపీలో ఎలా అడుగుపెడతారు?
జగన్‌ను అక్రమ కేసుల్లో ఇరికించి, వైఎస్ పేరును చార్జిషీట్‌లో చేర్చటం గుర్తులేదా?



హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని, కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిని కక్ష గట్టి వేధించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి వైఎస్ విగ్రహానికి పూలదండ వేసే నైతిక అర్హతేలేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మూడు దశాబ్దాలపాటు కాంగ్రెస్ అభ్యున్నతికి అహరహం కృషిచేసిన వైఎస్ మరణానంతరం ఆయన ప్రతిష్టకు భంగం కలిగించడానికి ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నించిందన్నారు. జీవించి ఉన్నంతకాలం వైఎస్ రాష్ట్రంలో టీడీపీతో పోరాటం చేస్తే.. అదేపార్టీతో కాంగ్రెస్ కుమ్మక్కై వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా కుట్రపన్ని కేసులు పెట్టించిందని విమర్శించారు. జగన్‌ను సీబీఐ కేసుల్లో ఇరికించడంతోపాటుగా వైఎస్ పేరును చార్జిషీట్‌లో ఏఐసీసీ నేతలు పెట్టించారని ఆవేదన వెలిబుచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ క్షీణించిపోయాక ఇపుడు మళ్లీ వైఎస్ పేరు చెప్పి రాజకీయలబ్ధి పొందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌వారు ముందుకొస్తున్నారన్నారు.

‘‘కాంగ్రెస్‌కు నచ్చితే పూలదండ వేస్తారు, లేకుంటే బురద జల్లుతారా.. అసలు రాహుల్‌గాంధీ ఏ ముఖం పెట్టుకుని వైఎస్ విగ్రహానికి పూలమాల వేస్తారు? అసలాయనకు ఆ నైతిక హక్కుందా?’’ అని పద్మ ప్రశ్నించారు. వైఎస్‌పై చల్లాల్సినంత బురదజల్లి, ఆయన కుటుంబాన్ని తీవ్ర వేధింపులకు గురిచేసింది చాలక ఇపుడు ఆయన తమ నాయకుడంటూ నివాళులర్పించడానికి రాహుల్ ఏముఖం పెట్టుకుని వస్తున్నారు? మరణించేవరకూ వైఎస్ కాంగ్రెస్ అభ్యున్నతికి కృషిచేస్తే ఆ తర్వాత ఆయన్ను అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించడమేగాక టీడీపీతో కలసి కేసులు వేసింది మరిచారా? అని ప్రశ్నించారు. వైఎస్ మృతిని తట్టుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబాల్ని ఓదారుస్తానంటే కాంగ్రెస్ జగన్‌కు అనుమతినివ్వకుండా అందర్నీ ఒకచోట చేర్చి ఓదార్చాలనే దౌర్భాగ్యపు సలహాను ఆనాడు సోనియాగాంధీ ఇచ్చారని మండిపడ్డారు. మరణించినవారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇస్తామని ఏఐసీసీ ప్రకటించి ఇన్నేళ్లయినా వారికి అర్ధరూపాయి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.

సీబీఐ చార్జిషీటులో వైఎస్ పేరు పెట్టించింది మీరే కదా!
టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటై జగన్‌పై కేసులు పెట్టించింది.. సీబీఐ చార్జిషీటులో వైఎస్ పేరును పెట్టించిందీ కాంగ్రెస్ నేతలే కదా అని వాసిరెడ్డి పద్మ అన్నారు. అసెంబ్లీలో వైఎస్‌ను ఇష్టానుసారం తూలనాడుతూ ఆయనపై అవాకులు, చవాకులూ పేలుతూ ఉంటే కిమ్మనకుండా ఉన్న కాంగ్రెస్ నేతలకు ఇపుడు వైఎస్ గుర్తుకొచ్చారా? అసలు వైఎస్ విగ్రహంవైపు సూటిగా చూసే ధైర్యం, అర్హత రాహుల్‌కున్నాయా? అని నిలదీశారు. ఇవాళ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి తాముచేసిన పాపాల్ని రాహుల్ కడిగేసుకుంటామనుకుంటే  భ్రమే అవుతుందని, రాష్ట్రప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.

నిండుగా ఉండిన రాష్ట్రాన్ని అడ్డంగా విభజించడానికి కారకులైన రాహుల్ అసలు ఆంధ్రప్రదేశ్‌లో ఎలా అడుగుపెడతారని ప్రశ్నించారు. విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ అడుగంటిపోవడంతో కాంగ్రెస్‌వారు ఇపుడు మళ్లీ వైఎస్‌ను తమ నేతగా చెప్పుకుని ఆయన పేరుతో లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో భవిష్యత్తు లేదని, ఆ పార్టీ ఇకపై ‘పిల్ల టీడీపీ’గా ఉండాల్సిందేనని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్‌వారికి వైఎస్‌ను జ్ఞాపకం చేసుకునే నైతిక అర్హత కూడా లేదన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదని తమకున్న ఓట్లను చంద్రబాబుకు వేయించి ఆయన  సీఎం కావడానికి కాంగ్రెస్ నేతలు తోడ్పడ్డారని, అలాంటిదిపుడు టీడీపీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని చూడటానికి రాహుల్ ఇక్కడికొస్తున్నారా? అని పద్మ సూటిగా ప్రశ్నించారు.

ఎమ్మెల్యే వర్మకు ఫోన్‌లో జగన్ పరామర్శ


ఎమ్మెల్యే వర్మకు ఫోన్‌లో జగన్ పరామర్శ
పిఠాపురం : పుత్రికావియోగంతో బాధపడుతున్న పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను పలువురు ప్రముఖులు బుధవారం పరామర్శించారు. పిఠాపురం మండలం పి.దొంతమూరులోని స్వగృహంలో ఉన్న ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు, బీసీసెల్ ప్రధాన కార్యదర్శి వెంగళి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి మొగలి అయ్యారావు, పార్టీ నేతలు పంపన రామకృష్ణ, జ్యోతుల భీముడు, నడిగట్ల చింతలరావు, తెడ్లపు చిన్నారావు, ఆనాల సుదర్శన్, గుండ్ర రాజుబాబు, బత్తిన ఏసుబాబు, మొగలి ప్రభాకరరావు, కర్నీడి సత్యనారాయణ, గట్టెం మోహనరావు ఎమ్మెల్యే వర్మను పరామర్శించి సంతాపం తెలిపారు. 

అధికారులు బెదిరిస్తున్నారయ్యా..


అధికారులు బెదిరిస్తున్నారయ్యా..
రుణమాఫీ కాక మా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు
అయినా ఆయనది రైతు ఆత్మహత్య కాదంటున్నారు
విచారణ పేరుతో డీఎస్పీ, ఆర్డీవో బెదిరిస్తున్నారు
ఏపీ విపక్షనేత వైఎస్ జగన్‌తో చెప్పుకొని బోరుమన్న రామాంజనమ్మ
రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డ ఏపీ విపక్ష నేత
పోస్టుమార్టం, రుణమాఫీ రిపోర్టులతో కేసు వేస్తాం
ఆత్మహత్యలు గుర్తించి పరిహారం అందించేలా పోరాడతాం
ధైర్యంగా ఉండండి... పిల్లలను బాగా చదివించుకోండి
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జగన్ భరోసా
మూడోవిడత రైతు భరోసాయాత్రలో రెండోరోజు 3 కుటుంబాలకు పరామర్శ


(రైతు భరోసా యాత్ర నుంచి సాక్షిప్రతినిధి): ‘‘మాకు అన్యాయం జరిగిందయ్యా. రుణమాఫీ కాక అప్పులబాధతో మా ఆయన ఆత్మహత్య చేసుకుంటే అది రైతు ఆత్మహత్య కాదని ఆఫీసర్లు బెదిరిస్తున్నారు. డీఎస్పీ, ఆర్డీవో విచారణకు మా ఇంటికి వచ్చారు. ఇది రైతు ఆత్మహత్యకాదని, ఇతర కారణాలవల్ల ఆత్మహత్య చేసుకున్నారని మమ్మల్ని బెదిరించినట్లు మాట్లాడతాండారు’’ అని అనంతపురం జిల్లా వర్లి గ్రామానికి చెందిన రామాంజనమ్మ వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చెప్పుకొని బోరుమన్నారు. జగన్ ఆమెను సముదాయించి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. ‘‘గంగన్న కుటుంబానికి 4.60 ఎకరాల పొలం ఉంది. బ్యాంకులో రూ. 53 వేలు అప్పుంది. ఇందులో రూ.10,711 మాఫీ అయింది. అంటే ఆయన రైతని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా! పైగా అప్పుల బాధతో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. పోస్టుమార్టం చేశారు. రికార్డు లున్నాయి. అలాంటప్పుడు అది ఎందుకు రైతు ఆత్మహత్య కాదు. నిజమైన రైతుల ఆత్మహత్యలను కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు.

ఇలాంటివాటి వివరాలు సేకరించి కోర్టులో కేసువేస్తాం. ఇలాంటి వాటిపై గట్టిగా పోరాడి, పరిహారం వచ్చేలా చూస్తాం’’ అని జగన్ భరోసానిచ్చారు. వివరాలు సేకరించాలని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి సూచించారు. గంగన్న సోదరుడు తిమ్మప్ప వర్లి గ్రామానికి పదేళ్లపాటు సర్పంచ్‌గా కొనసాగారని, అలాం టి వ్యక్తి తమ్ముడికి ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులు కల్పించడం దారుణమన్నారు. గంగన్న కుమారుడు వరప్రసాద్ సెంట్రింగ్ పనిలో శిక్షణ తీసుకుంటే ఏదైనా కంపెనీలో ఉద్యోగం ఇప్పించేలా చూస్తామని చెప్పారు. మూడో విడత రైతు భరోసాయాత్రలో భాగంగా రెండోరోజు బుధవారం జగన్ మూడు కుటుంబాలను పరామర్శించారు. బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లిలో రెండురోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న ఈరన్న అనే రైతు కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత కళ్యాణదుర్గం మండలం ముదిగల్లులో నారాయణప్ప కుటుంబాన్ని, వర్లిలో గంగన్న కుటుంబాన్ని పరామర్శించారు.

ఏ అధికారీ మా ఇంటికి రాలేదు..
బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లిలో ఈ నెల 20న ఈరన్న అనే రైతు ఉరి వేసుకుని చనిపోయాడు. జగన్ వారి ఇంట్లోకి వెళ్లగానే ఈరన్న భార్య మారెక్క, పిల్లలు ప్రహ్లాద, ప్రవీణ్‌లు బోరున విలపించారు. ‘‘సార్! మా నాన్న చనిపోయి రెండు రోజులైంది. ఏ అధికారీ మా ఇంటికి రాలేదు. ఆత్మహత్యను విచారించలేదు. మీరే మొదటగా మా ఇంటికి వచ్చారు’’ అని ఈరన్న పెద్దకుమారుడు ప్రహ్లాద చెప్పాడు. పొలం సాగు, బ్యాంకు అప్పు, సబ్సిడీ వివరాలను జగన్ ఆరా తీశారు.

తన భర్త, మరిది కలిసి సొంతపొలం ఏడెకరాలు, కౌలుపొలం 12 ఎకరాలు సాగు చేశారని మారెక్క చెప్పారు. బోర్లు పడక, నీళ్లురాక రూ. 5 లక్షల అప్పయిందని, ప్రభుత్వం నుంచి ఏ సాయం అందలేదని తెలిపారు. తండ్రి అప్పులు తీర్చేందుకు ప్రవీణ్ ఐటీఐ చదువు మధ్యలో ఆపివేసి బెంగళూరుకు కూలిపనికి వెళుతున్నాడని తెలిసి జగన్ చలించిపోయారు. వెంటనే కాలేజీకి వెళ్లి చదుకోవాలని సూచించారు. చదువుకు తాము భరోసాగా ఉంటామని, నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ చూసుకుంటారని చెప్పారు. పోలీసులతో ఎఫ్‌ఐఆర్ చేయించి ఈ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి సూచించారు.

పూర్తి పరిహారం ఇవ్వలేదు
కళ్యాణదుర్గం మండలం ముదిగల్లులో ఆత్మహత్య చేసుకున్న నారాయణప్ప కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ‘‘సార్... నా భర్త చనిపోయి పది నెలలవుతోంది. రైతు ఆత్మహత్యగా ప్రభుత్వం గుర్తించింది. రూ.ఐదు లక్షల పరిహారం ఇస్తామన్నారు. రూ.మూడు లక్షలు ఇచ్చామని చెబుతాండారు. అందులో రూ.1.50 లక్షలు ఊళ్లో పెద్దమనుషుల ద్వారా ప్రైవేటు అప్పులు చెల్లించారు. మరో రూ.1.50 లక్షలు బ్యాంకులో వేశారంట. కానీ మాకైతే  ఏం తెలీదుసార్! ఏడాదికి రూ.50 వేలు ఇస్తామంటున్నారు సార్’’ అని నారాయణప్ప భార్య చంద్రమ్మ తెలిపారు.

కచ్చితంగా పరిహారం మొత్తం అందేలా ప్రభుత్వంతో పోరాడతామని జగన్ ఆమెకు భరోసానిచ్చారు. పిల్లల చదువు బాధ్యత నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్‌కు అప్పగించారు. అనంతరం జగన్ కళ్యాణదుర్గంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి ఫాంహౌస్‌లో బస చేశారు. అంతకుముందు పట్టణంలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. వాల్మీకి విగ్రహానికి పూలమాల వేశారు. రెండోరోజు యాత్రలో ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

జిల్లా టీడీపీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్న కలెక్టర్

Written By news on Wednesday, July 22, 2015 | 7/22/2015


'జిల్లా టీడీపీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్న కలెక్టర్'
న్యూఢిల్లీ: కడప జిల్లా కలెక్టర్ జిలా టీడీపీ అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులెవ్వరినీ ఏ కార్యక్రమానికీ పిలవడంలేదని అన్నారు.

ఎంపీ ల్యాడ్స్ నిధులను విడుదల చేయకుండా కలెక్టర్ ఆపేస్తున్నారని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 80 శాతం పూర్తిచేసి కడపకు 44 వేల క్యూసెక్కుల నీరు అందించారని చెప్పారు. అయితే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండా మంత్రి దేవినేని ఉమ అడ్డుపడుతున్నారని విమర్శించారు. గాలేరు. నగరి పనులు తక్షణమే పూర్తి చేయాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రాయితీలు ఇచ్చేలా పార్లమెంట్ లో పోరాడుతామని చెప్పారు.
 

కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయానికి భూమిపూజ


కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయానికి భూమిపూజ
అనంతపురం: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన రైతుకుటుంబాలకు ఆదుకునేందుకు అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మూడో విడత రైతు భరోసా యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. బుధవారం ఆయన కళ్యాణ దుర్గం నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు. అంతకముందు కళ్యాణ దుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఆయన భూమి పూజ నిర్వహించారు.
అనంతరం భరోసా యాత్రను ప్రారంభించారు. నేరుగా బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లికి చేరుకుని అక్కడ ఆత్మహత్యకు పాల్పడిన రైతు ఈరన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ముదిగల్లు చేరుకుంటారు. అక్కడ బోయనారాయణప్ప కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం వర్ణి లో హరిజన గంగన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు.


అది మాస్టర్ ప్లాన్ కాదు.. డైవర్షన్ ప్లాన్


అది మాస్టర్ ప్లాన్ కాదు.. డైవర్షన్ ప్లాన్
రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై రోజా ధ్వజం
‘ఓటుకు కోట్లు’ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పుష్కరాల పబ్లిసిటీ
పుష్కర ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు మాస్టర్‌ప్లాన్ హడావుడి
సింగపూర్ సంస్థలిచ్చే కమీషన్ల కోసమే వారితో ఒప్పందం

 
హైదరాబాద్: కొత్త రాజధాని నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రిలో విడుదల చేసింది మాస్టర్ ప్లాన్ కానే కాదని, అదో డైవర్షన్ ప్లాన్ అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో  విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు నోటు వ్యవహారంలో పరువు పోగొట్టుకున్న బాబు ఆ వివాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు పుష్కరాల్లో బాగా పబ్లిసిటీ చేసుకుని లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. అక్కడ 30 మంది మృతి చెంది వ్యవహారం వికటించడంతో ఇపుడు హడావుడిగా సింగపూర్ నుంచి ప్రత్యేక విమానంలో అక్కడి మంత్రిని పిలిపించి మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేశారని విమర్శించారు. ప్లాన్ సీడీ విడుదల వ్యవహారం చూస్తే సినిమా ట్రైలర్ వేడుకను గుర్తుకు తెచ్చిందని రోజా ఎద్దేవా చేశారు. విదేశాల్లో ఎక్కడెక్కడ మంచి ఫ్లైఓవర్లు, భవనాలు, రోడ్లు ఉన్నాయో వాటన్నింటినీ మాస్టర్ ప్లాన్‌లో చూపించి ప్రజలను కలల్లో విహరింప జేసే యత్నం చేశారన్నారు. రాష్ట్రం విడిపోయాక ఆర్థిక పరిస్థితి భారీ లోటులో ఉందని చెబుతున్న చంద్రబాబు రాజధానిని కట్టడానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని రోజా సూటిగా ప్రశ్నించారు.

బాబు సీఎం అయ్యాక తెచ్చిన రెండు బడ్జెట్‌లలోనూ రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, కేంద్రం నుంచి కూడా నిధులు రాలేదని, రాజధాని నిర్మాణానికి రూ.1.4 లక్షల కోట్లు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వారి నుంచి ఇంత వరకూ సమాధానమే రాలేదని వివరించారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా రాజధాని కడతామని చంద్రబాబునాయుడు చెప్పడం ప్రజలను నిలువునా మోసం చేయడం కాదా? అని ఆమె ప్రశ్నించారు. సింగపూర్ సంస్థలు ఎవరికీ ఏదీ ఉచితంగా చేయవని, వారు పూర్తి వ్యాపారాత్మక దృ క్పథంతో ఉంటారని అలాంటి వారు ఉచితంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చారంటే నమ్మాలా? అని నిలదీశారు. రాజధాని ప్రాంతంలో సింగపూర్ సంస్థలకు పది వేల ఎకరాలను కట్టబెడుతున్నారని జూలై 6వ తేదీన ఓ ఆంగ్ల దిన  పత్రికలో వచ్చిన కథనాన్ని ఆమె ఉటంకిస్తూ... దీనిపై ఇంతవరకూ ప్రభుత్వం సమాధానమే చెప్పలేదన్నారు. సింగపూర్ సంస్థకు ఒక లక్ష కోట్ల రూపాయలు ఇస్తున్నట్లేనన్నారు. అసలు మన రాష్ట్రంలోనే అంతర్జాతీయస్థాయి గల గొప్ప ఇంజనీర్లు ఉంటే వారిని కాదని సింగపూర్‌ను ఆశ్రయించడం ఏమిటి? వారిచ్చే కమీషన్లతో జేబులు నింపుకుందామనే కదా? అని ఆమె ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం 2050 నాటికి పూర్తవుతుందని మాస్టర్ ప్లాన్‌లో చెప్పడం చూస్తే ఈ 35 ఏళ్లు భూములు ఇచ్చిన రైతులు ఏం కావాలి? వారి జీవనం ఎలా కొనసాగాలని నిలదీశారు.

లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు


లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలను ఈ నెల 19న లండన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యునెటైడ్ కింగ్‌డమ్, యూరప్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 150 మందికిపైగా ప్రవాసాంధ్రులు, వైఎస్సార్‌కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ బాల్యం, రాజకీయ ప్రస్థానం, ప్రజాజీవితంతో కూడిన వీడియోను నిర్వాహకులు ప్రదర్శించారు. పార్టీ నేతలు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్‌రెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్ , కొరుముట్ల శ్రీనివాసులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అట్లాంటా ఎన్నారై విభాగం కన్వీనర్ గురవారెడ్డి తదితరులు టెలిఫోన్ లైన్‌ద్వారా.. వైఎస్సార్ అభిమానులకు అభినందనలు తెలిపి ఉత్తేజపరిచారు. తెలుగు ప్రజలందర్నీ కుల, మత, ప్రాంతీయబేధాలు లేకుండా ప్రేమించి వైఎస్సార్ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.

వీడియో ద్వారా ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ సందేశాన్ని వినిపి ంచారు.  ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ యూకే, యూరప్ విభాగంలో క్రియాశీలంగా పనిచేస్తున్న సందీప్ వంగల, కిరణ్, అబ్బాయ్ చౌదరి, పీసీ రావు, ప్రదీప్‌రెడ్డి, వాసు, శివ, సతీష్ తదిరులు తమ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. వైఎస్ ఆశయాల సాధన వైఎస్ జగన్‌తో సాధ్యమనే సందేశాన్ని వినిపించారు. బ్రిటన్‌లో పార్టీ బలోపేతానికి చేయాల్సిన కార్యాచరణతోపాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరువు కోరల్లో చిక్కుకున్న పల్లెల్లో వైఎస్సార్‌సీపీ ఎన్నారై శాఖ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు.

ప్రచారం కోసం ఎంతకైనా తెగిస్తాడు


ప్రచారం కోసం ఎంతకైనా తెగిస్తాడుమంగళవారం అనంతపురం జిల్లా శెట్టూరు బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. హాజరైన జనసందోహంలో ఓ భాగం
- ఏపీ సీఎం చంద్రబాబుపై విపక్షనేత వైఎస్ జగన్ ధ్వజం
- బాబు నోరుతెరిస్తే అబద్ధాలు, మాట్లాడేదంతా మోసమే
- పబ్లిసిటీ వస్తుందంటే రూ. ఐదు లక్షల పరిహారం ఇస్తామంటారు.. లేదంటే రైతు ఆత్మహత్యలే జరగలేదని అంటారు
- జగన్ వస్తున్నారంటే హడావుడిగా పరిహారం ప్రకటిస్తారు... లేదంటే లేదు
- ప్రచారం కోసం పుష్కరాల్లో షార్ట్‌ఫిల్మ్ తీసి 29 మందిని బలితీసుకున్నారు
- రైతులు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు
- అపరాధవడ్డీకి కూడా సరిపోని విధంగా రుణమాఫీ వర్తింపజేశారు
- ఎన్నికల హామీలు నెరవేర్చేలాప్రభుత్వం ఒత్తిడి తేవాలి
- ప్రారంభమైన మూడో విడత ‘అనంత’ రైతు భరోసా యాత్ర

రైతు భరోసాయాత్ర నుంచి సాక్షి ప్రతినిధి:
 ‘‘చంద్రబాబు నోరుతెరిస్తే అబద్ధాలు, మాట్లాడేదంతా మోసమే! పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారు. పబ్లిసిటీ వస్తుందంటే ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.ఐదు లక్షల పరిహారం ఇస్తామంటారు. లేదంటే ఆత్మహత్యలే జరగలేదని అంటారు. జగన్ వస్తున్నారంటే హడావుడిగా పరిహారం ప్రకటిస్తారు. లేదంటే లేదు. చివరకు ఎంతలా దిగజారాడంటే... గొప్పగా పుష్కరాలు చేశారని చెప్పుకునేందుకు షార్ట్‌ఫిల్మ్ తీసి 29 మందిని బలితీసుకున్నారు’’ అని ఏపీ ముఖ్యమంత్రి చ ంద్రబాబునాయుడుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మూడోవిడత రైతు భరోసాయాత్రను ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలంలో మంగళవారం ప్రారంభించారు. శెట్టూరులో జరిగిన బహిరంగసభలో జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...

బాబు మోసం వల్లే ఆత్మహత్యలు
ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారని అసెంబ్లీలో చంద్రబాబును గట్టిగా నిలదీశాం. రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులతో పని అయిపోయిన తర్వాత మీరేం చేస్తున్నారని అడిగాం. రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు. ఏ టీవీ ఆన్‌చేసినా రుణమాఫీ కావాలంటే బాబు సీఎం కావాలని ప్రచారం చేశారు. రుణాలు చెల్లించొద్దని మీరు చెప్పిన మాటలు విని వారంతా రుణాలు చెల్లించలేదు. కానీ రుణమాఫీ కాలేదు. రైతులు వడ్డీలేని రుణాలు తీసుకునేవారు. ఈ రోజు 14 శాతం అపరాధ వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు ఒకమాట... తర్వాత ఒకమాట చెప్పి మోసం చేశారు.

మీరు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసంతోనే రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారని గట్టిగా నిలదీశాం. కానీ చంద్రబాబు అవహేళన చేశారు. రాష్ట్రంలో రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. తనకు శాలువాలు కూడా కప్పుతున్నారని గొప్పలు చెప్పుకున్నారు. కానీ బాబు చేసిన రుణమాఫీ స్కీంతో ఎవ్వరికీ రుణమాఫీ కాలేదు. రుణమాఫీ సొమ్ములు వడ్డీలకు కూడా సరిపోలేదు. బ కాయిలు చెల్లించొద్దని చంద్రబాబు చెప్పిన మాటలు విని రైతులు రుణాలు చెల్లించలేదు. దీంతో ఇవాళ రుణాలు రెన్యువల్ కాలేదు. రైతులు ఇన్సూరెన్స్‌ను కోల్పోతున్నారు. ఇలా చంద్రబాబు చేసిన మోసాలు ఎలాంటివో అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులను మోసం చేసిన చంద్రబాబు కనిపిస్తే రాళ్లతో కొడతామని చెప్పండి.

బాబు అందరినీ మోసం చేశారు
రుణ మాఫీ చేస్తానని రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని విద్యార్థులను మోసం చేశారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండువేల రూపాయలు నిరుద్యోగభృతి ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశారు. వెయ్యిరూపాయల పింఛన్ ఇస్తానని కొంతమందికి ఇచ్చారు? ఇంకొంతమందికి ఎగ్గొట్టారు. గుడిసెలు లేకుండా అందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తానన్నారు. గుడిసెలు లేని రాష్ట్రాన్ని తయారు చేస్తానన్నారు. కానీ ఒక్క ఇల్లూ నిర్మించలేకపోయారు. గతంలో ఇంటికి రూ.200 కరెంటు బిల్లు వస్తుంటే.. ఇప్పుడు రూ.800 వస్తోంది.

ఇలా ప్రతీ వర్గాన్ని మోసం చేశాడు. చివరకు ఎంతలా దిగజారాడంటే... చంద్రబాబు గొప్పగా పుష్కరాలు చేశారని చెప్పుకునేందుకు షార్ట్‌ఫిల్మ్ తీసి 29 మందిని బలితీసుకున్నారు. పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారు. పబ్లిసిటీ వస్తుందంటే ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.ఐదు లక్షల పరిహారం ఇస్తామంటారు. లేదంటే ఆత్మహత్యలే జరగలేదని అంటారు. జగన్ వస్తున్నారంటే హడావుడిగా పరిహారం ప్రకటిస్తారు. లేదంటే లేదు. ఇలాంటి వ్యక్తికి గట్టిగా బుద్ధిచెప్పాలి. గట్టిగా మొట్టికాయలు వేయాలి. ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేలా అందరం ఒక్కటి కావాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.

ఘన స్వాగతం
బెంగళూరులో జగన్‌కు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఉషా శ్రీచరణ్ స్వాగతం పలికారు. కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులోని తిప్పనపల్లి వద్ద జిల్లా నేతలు జగన్‌కు స్వాగతం పలికారు. పర్యటనలో ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యద ర్శులు బోయ తిప్పేస్వామి, మోహన్‌రెడ్డి, శింగనమల, మడకశిర, సమన్వయకర్తలు ఆలూరి సాంబశివారెడ్డి, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.
 
ధైర్యంగా ఉండండి.. న్యాయం జరిగేలా చూస్తాం
‘కష్టాలు వచ్చాయని అధైర్యపడొద్దు.. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి.. మీకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం.. అని రైతు పెద్ద నాగప్ప కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలంలో ఇటీవల అప్పుల బాధతో మృతి చెందిన కైరేవు గ్రామ రైతు పెద్ద నాగప్ప కుటుంబసభ్యుల్ని ఆయన పేరుపేరునా పలకరించారు. వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.

మోపిదేవి కుటుంబానికి తప్పిన ప్రమాదం

 వైఎస్ఆర్ సీపీ నేత,  మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఆయన ప్రయాణిస్తున్న కారు బుధవారం ఉదయం కృష్ణాజిల్లా కానూరు వద్ద ప్రమాదానికి గురైంది.  ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి మోపిదేవి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన భార్య, కుమార్తెకు స్వల్ప గాయలయ్యాయి.
 
గాయపడినవారిని విజయవాడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.  కాగా గాయపడినవారికి ఎలాంటి ప్రమాదం లేదని, హఠాత్తుగా ప్రమాదం జరగటంతో వారు షాక్ కు గురైనట్లు వైద్యులు తెలిపారు. మోపిదేవి కుటుంబం హైదరాబాద్ నుంచి రావులపాలెం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వైఎస్సార్‌సీపీ సర్పంచ్ తమ్ముడిపై టీడీపీ నాయకుల దాడి

Written By news on Tuesday, July 21, 2015 | 7/21/2015


వైఎస్సార్‌సీపీ సర్పంచ్ తమ్ముడిపై టీడీపీ నాయకుల దాడి
గుంటూరు (పొన్నూరు) : గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామ శివార్లలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ తమ్ముడిపై టీడీపీ నాయకులు దాడికి దిగారు. ఈ ఘటనలో సర్పంచ్ తమ్ముడు అమరేంద్రప్రసాద్‌కు తీవ్రగాయాలయ్యాయి. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బండ్లమూడి అశోక్, బండ్లమూడి బాబూరావు, బండ్లమూడి చింప్రయ్య, గొల్ల శ్యామ్యూల్, గన్నవరపు అనిల్, అన్నవరపు వీరయ్యలు అమరేంద్రప్రసాద్‌పై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఏయే గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ పదవి గెలిచిందో.. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పి ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అమరేంద్రను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చంద్రబాబు కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేట్లున్నారు


'ఆయన కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారు'
అనంతపురం : చంద్రబాబు కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేలా ఉన్నారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు చేపట్టిన మూడో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన శెట్టూరులో బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
  • రుణమాఫీపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తే.. రైతులంతా సుఖ శాంతులతో ఉన్నారని చెప్పుకొచ్చారు.
  • తనకు సన్మానాలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొన్నారు
  • కానీ ఇప్పుడు చంద్రబాబు కనిపిస్తే రైతులు రాళ్లతో కొట్టేట్లున్నారు
  • చంద్రబాబు చెప్పిన అబద్ధాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
  • గతంలో వడ్డీలేని రుణం వస్తే, ఇప్పుడు రైతులు 14 శాతం అపరాధ వడ్డీ కడుతున్నారు
  • రుణాలు రెన్యువల్ కాక, రైతులు పంటబీమా కూడా పొందలేని దుస్థితిలో ఉన్నారు
  • రూ. 2 వేల నిరుద్యోగ భృతి, డ్వాక్రా రుణమాఫీ విషయంలో అందరినీ మోసం చేస్తున్నారు
  • పుష్కరాల్లో సినిమా తీసేందుకు 29 మందిని బలి తీసుకున్నారు
  • పబ్లిసిటీ కోసం బాబు ఏమైనా చేస్తారు
  • గతంలో 200 రూపాయల వరకు వచ్చే కరెంటు బిల్లు కాస్తా ఇప్పుడు చంద్రబాబు పుణ్యమాని 800 రూపాయలు వస్తోంది
  • జూన్ 30 నాటికి వ్యవసాయ రుణాలు ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటివరకు సహకార బ్యాంకుల నుంచి ఒక్క రుణం కూడా ఇవ్వలేదు
  • చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా.. ఆయన మెడలు వంచైనా గుర్తుచేస్తూనే ఉంటాం.

మగధీర, బాహుబలి ట్రైలర్లు చూసినట్లుంది


'మగధీర, బాహుబలి ట్రైలర్లు చూసినట్లుంది'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదా లేక సింగపూర్ దా అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా..  చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం ఏపీ ప్రభుత్వం.. సింగపూర్ కు లక్ష కోట్ల నజరానా ఇస్తున్నారని  ఆమె ఆరోపించారు. మంగళవారం రోజా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ చూస్తుంటే.. మగధీర, బాహుబలి సినిమా ట్రైలర్లు చూసినట్లు ఉందని అన్నారు. ప్రపంచ దేశాల్లో అందమైన కట్టడాలను ఒకచోటకు తెచ్చి రాజధాని అంటూ చూపిస్తున్నారని, చేతలో చిల్లిగవ్వ లేకుండా అంతర్జాతీయ రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని రోజా సూటిగా ప్రశ్నించారు.  అది మాస్టర్ ప్లాన్ కాదు.. చంద్రబాబు డైవర్షన్ ప్లాన్ అని ఆమె ఎద్దేవా చేశారు.

రాజధాని పేరుతో చంద్రబాబు సమస్యలు సృష్టిస్తున్నారని రోజా అన్నారు. రాజధాని సామాన్యులకు అందుబాటులో ఉండాలని, మాస్టర్ ప్లాన్ లో రైతులు, బడుగులకు చోటెక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని నిలదీశారు. చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ మాని ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి.. ఇప్పుడు దానిపై నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే ఈ మాస్టర్ ప్లాన్ ను చంద్రబాబు తెరమీదకు తెచ్చారని రోజా అన్నారు. అంతర్జాతీయ రాజధాని పేరుతో ప్రజలను కలల్లో విహరింప చేయడమే అని, మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇవ్వడానికి సింగపూర్  ఏమైనా ధార్మిక సంస్థా, బడుగు, బలహీన వర్గాలకు నూతన రాజధానిలో చోటివ్వరా?, 2050 వరకూ రాజధాని నిర్మాణం చేపడితే భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని అన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా ఏమిస్తారో చెప్పాలని, రాజధాని మాస్టర్ ప్లాన్ రియల్ ఎస్టేట్ బ్రోచర్ లా ఉందని అన్నారు.

నేటి నుంచి అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర


నేటి నుంచి అనంతలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నుంచి అనంతపురం జిల్లాలో మూడో విడత ‘రైతు భరోసా యా త్ర’కు శ్రీకారం చుట్టనున్నారు. రుణాల మాఫీ జరగక, కొత్త అప్పులు పుట్టక, వ్యవసాయం చేసుకోలేక సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు ఈ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరాశా నిసృ్పహల్లో ఉన్న రైతుల బలవన్మరణాలను నిలువరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో..

రైతులు బలవన్మరణాలను ఆశ్రయించడం సరి కాదంటూ వారికి భరోసా కల్పించడానికి వైఎస్ జగన్ ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 26వ తేదీ వరకు తొలి విడత, మే 11వ తేదీ నుంచి 18 వరకు రెండో విడత రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. తాజాగా మంగళవారం నుంచి కల్యాణదుర్గం నియోజకవర్గంలో మూడో విడత యాత్రను ప్రారంభించనున్నారు.

జగన్ తొలి రోజు పర్యటన వివరాలను పార్టీ కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ సోమవారం పత్రికలకు విడుదల చేశారు. శెట్టూరు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం ఆయన కైరేవు గ్రామానికి వెళతారు.

Popular Posts

Topics :