తుపాను సమయంలో ప్రజలను గాలికొదిలి సీఎం ర్యాలీకి వెళతారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తుపాను సమయంలో ప్రజలను గాలికొదిలి సీఎం ర్యాలీకి వెళతారా?

తుపాను సమయంలో ప్రజలను గాలికొదిలి సీఎం ర్యాలీకి వెళతారా?

Written By news on Saturday, November 10, 2012 | 11/10/2012

త్వరలో విజయమ్మ నేతృత్వంలో ప్రధానిని కలవనున్న పార్టీ బృందం
వరద బాధిత రైతులకు ఎకరాకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాలి 
ఇళ్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి 
వైఎస్సార్ కాంగ్రెస్ పాలక మండలి సమావేశం డిమాండ్.. తీర్మానం 
తుపాను సమయంలో ప్రజలను గాలికొదిలి సీఎం ర్యాలీకి వెళతారా? 
సర్కారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజం

హైదరాబాద్, న్యూస్‌లైన్: నీలం తుపాను ప్రభావంతో పాటు అనేక ప్రతికూల కారణాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతుల రుణాలను మాఫీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రైతుల రుణాలను రద్దు చేయటంతో పాటు వారికి కొత్త రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. సోమవారం పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన సీజీసీ సమావేశం జరిగింది. నీలం తుపానుతో ముంచెత్తిన వరదలు, ఆ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగం కష్టాలపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. పంట చేతికొచ్చే సమయంలో ముంచెత్తిన వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇలాంటి తరుణంలో ముందుకొచ్చి ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని సమావేశం అభిప్రాయపడింది. తక్షణం రైతుల రుణాలను రద్దు చేసి కొత్త అప్పులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమావేశం తీర్మానం చేసింది. సీజీసీ సభ్యులతో పాటు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం సమావేశ వివరాలను రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ పార్టీ సీనియర్ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, భూమన కరుణాకర్‌రెడ్డి, మేకా శేషుబాబులతో కలిసి విలేకరులకు వివరించారు. 

తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలి: నీలం తుపాను ప్రభావాన్ని బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు తక్కువగా అంచనా వేశారని, అందువల్లనే ముందస్తు చర్యలు కూడా చేపట్టలేక పోయారని ధ్వజమెత్తారు. తుపాను బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటాన్ని సమావేశం తీవ్రంగా ఖండించిందన్నారు. పంటలు వేసుకున్న కౌలు రైతుల రుణాలను రద్దు చేయాలని.. వారికి మళ్లీ 75 శాతం సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రంలో వరద బీభత్సంపై చర్చించటానికి తక్షణం శాసనసభను సమావేశపరచాలని కూడా డిమాండ్ చేశారు. తుపాను నష్టాలను వివరించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కోరటానికి విజయమ్మ నేతృత్వంలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఒక ప్రతినిధి బృందం త్వరలో ఢిల్లీ వెళ్లాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈలోగా రాష్ట్రానికి ఇతోధికంగా సాయం అందజేయాలని కోరుతూ ప్రధానికి విజయమ్మ ఒక లేఖ రాస్తారని తెలిపారు. 

ఎకరాకూ రూ. 10 వేల పరిహారం ఇవ్వాలి... 

ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు హెక్టారుకు 25 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్ర వైపరీత్యాల నిధి చైర్మన్ భూపేంద్రహూడా చేసిన సిఫారసులను ఇపుడు అమలు చేయాలని ఆ ప్రకారం రాష్ట్రంలో రైతులకు ఎకరాకు పది వేలు చొప్పున లభిస్తుందని కొణతాల వివరించారు. గృహాలు దెబ్బతిన్న వారికి ప్రభుత్వమే పూనుకుని పక్కా గృహాలను నిర్మించాలని కూడా సమావేశం కోరిందన్నారు. పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు నష్టపోయిన వారికి మళ్లీ రుణాలు ఇవ్వాలని, బాధితులకు బియ్యం, కిరోసిన్‌తో పాటుగా వంట పాత్రలు సహా ఒక నెల రేషన్ ఇవ్వాలని సమావేశం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

డ్వాక్రా రుణాల వసూళ్లను వాయిదా వేయాలి... 

డ్వాక్రా గ్రూపు మహిళలు తీసుకున్న రుణాలను వ్యవసాయరంగంలోనే ఉంచారని అది పూర్తిగా దెబ్బ తిన్నందున ఏడాది పాటు వాటి వసూళ్లను వాయిదా వేసి తాజా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కొణతాల పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు గోదావరి కరకట్టలను నిర్మించటానికి భారీగా నిధులు కేటాయించారని అయినా వాటిని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. వెంటనే కరకట్టల నిర్మాణం చేపట్టాలని కోరారు. రైతుల పొలాల్లో వరదల ఫలితంగా ఏర్పడిన ఇసుక మేటలను తొలగించటానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని సూచించారు. 

వర్షాల తరువాత ప్రబలే రోగాల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అన్నారు. తుపాను సమయంలో రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి వెళ్లటాన్ని కొణతాల తీవ్రంగా తప్పు పట్టారు. ఇంతకన్నా నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం మరొకటి ఉండదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ప్రజల గురించి ఆలోచించి వారి కష్టాలు తీర్చాలని కోరారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ముఖ్య నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, డి.ఎ.సోమయాజులు, ఎస్.రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, మేకా శేషుబాబు, సీజీసీ సభ్యులు బాలమణెమ్మ, కె.కె.మహేందర్‌రెడ్డి, చందా లింగయ్యదొర, కె.గంగారెడ్డి, తోపుదుర్తి కవిత, డి.రవీంద్రనాయక్, కృష్ణారావు, జ్యోతుల నెహ్రూ, అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, బి.జనక్‌ప్రసాద్, హెచ్.ఎ.రెహ్మాన్, గట్టు రామచంద్రరావు సమావేశంలో పాల్గొన్నారు.

source:sakshi
Share this article :

0 comments: