జనంతో మమేకమవుతూ ముందుకు సాగిన వైఎస్ తనయ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనంతో మమేకమవుతూ ముందుకు సాగిన వైఎస్ తనయ

జనంతో మమేకమవుతూ ముందుకు సాగిన వైఎస్ తనయ

Written By news on Saturday, October 20, 2012 | 10/20/2012

కరెంటు ఇచ్చేంత ముందు చూపుకూడా లేదు 
రైతులకు న్యాయం చేయకుండా మొద్దునిద్ర పోతోంది
ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు 
రాజన్న రాజ్యం మళ్లీ రావాలి.. అది జగనన్నతోనే సాధ్యం
కుమ్మక్కు రాజకీయాలకు నిరసన తెలపండి 
పాదయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు
జనంతో మమేకమవుతూ ముందుకు సాగిన వైఎస్ తనయ

ఈ కన్నీళ్లు అబద్ధం చెబుతాయా?

కత్తులూరు పంచాయతీకి చెందిన మల్లకాని సిద్దయ్య కొడుకు శివ పాములూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాదయాత్ర సాగుతుండగా గొర్రెలు కాస్తూ కనిపించాడు. ఆ పిల్లాడితో షర్మిల సంభాషణ ఇదీ..

షర్మిల: ఏం చిన్నా.. గొర్రెలు కాస్తున్నావ్?

శివ (కన్నీళ్లతో): మా నాన్నకు బాగోలేకుంటే నేను కాపలాకు వచ్చా. స్కూలుకు వెళ్లాలని ఉన్నా వెళ్లలేని పరిస్థితి. ఇక్కడ తిండి లేదు. పశువులకు మేత కూడా లేదు. అమ్మకు చెవుడు. పెన్షన్ కూడా రాదు. నాన్నకు బీపీ, షుగర్. పనికి వెళ్లలేడు. అన్న జేసీబీ మీద పనిచేస్తాడు. నాన్న బ్యాంకుకు వెళితే కనీసం లోను కూడా ఇవ్వలేదు.

షర్మిల: చూశారుగా.. ఈ కన్నీళ్లు అబద్ధం చెబుతాయా? చిన్న పిల్లాడు. చదువుకోవాల్సిన వయసు. ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. జగనన్న ఇలాంటి పిల్లలు చదువుకోవాలన్న ఉద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకం తెస్తానని చెప్పాడు. పిల్లలను బడికి పంపితే తల్లులకు నెలకు రూ.500 చొప్పున సాయం చేసే పథకం అది. ఏ సాయం చేయని ఈ ప్రభుత్వం మనకు అవసరమా? 

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: పేదల గోడు పట్టని ప్రభుత్వంపై, ప్రజాసమస్యలను గాలికొదిలేసిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపై దివంగత మహానేత వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే ముందుచూపు కూడా లేదని, రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోయినా మొద్దు నిద్ర వీడడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలంటే మళ్లీ రాజన్న పాలన రావాలని, అది జగనన్నతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. రైతన్నలు, విద్యార్థులు, కార్మికులు, కూలీలు, మహిళలతో మమేకమవుతూ శుక్రవారం వైఎస్సార్ జిల్లాలో షర్మిల రెండోరోజు ‘మరో ప్రజాప్రస్థానం’ కొనసాగించారు. వెళ్లిన ప్రతిచోటా జనం షర్మిలతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. కరెంటు కష్టాలు.. పింఛను వెతలు.. ఫీజుల వేదన.. ఇలా అనేక సమస్యలను ఆమెతో పంచుకున్నారు. వైఎస్ ఉన్నప్పుడు, ఇప్పుడు తమ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఉదయం 9.50కి వేంపల్లి సమీపంలోని రాజీవ్‌నగర్ వద్ద పాదయాత్ర ప్రారంభమైంది.

యాత్ర ముందుకు సాగుతుండగా.. సయ్యద్ బీబీ అనే మహిళ తన బాధలు వివరించింది. వైఎస్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నానని, ఇప్పుడు నిలువ నీడైతే ఉంది గానీ కరెంటు బిల్లులతో, కరెంటు కోతలతో నిద్రే కరువైందని విలపించింది. ఇందుకు జగనన్న తొందర్లోనే మీ ముందుకు వస్తాడని, మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని చెబుతూ షర్మిల ఆమెను ఊరడించారు. అక్కడి నుంచి ముందుకు సాగుతుండగా వృద్ధ మహిళలు చాలామంది ఎదురొచ్చారు. రాజశేఖరరెడ్డి వల్లే తనకు పెన్షన్ వచ్చిందని ఒకరు.. మూడేళ్లుగా పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటూనే ఉన్నా ఇవ్వడం లేదని మరొకరు చెప్పారు. ‘‘చంద్రబాబు ఉన్నప్పుడు బియ్యం కార్డు ఉంటేనే సంఘంలో చేరనిచ్చేవారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చాక అందరం చేరాం. పావలా వడ్డీ పథకం అందింది. కానీ ఇప్పుడు మాతో బలవంతంగా వడ్డీ కట్టించుకుంటున్నారు..’’ అని మరికొందరు మహిళలు షర్మిల ముందు ఆవేదన వ్యక్తంచేశారు.

కార్మికులు, వారి కుటుంబాలు ఏం కావాలి?

మార్గమధ్యంలో కత్తులూరు పంచాయతీ మహిళలు షర్మిలకు ఎదురేగి స్వాగతం పలికారు. ‘‘మాకు సాగునీరు లేక పొలాలు ఎండుతున్నాయి. కనీసం తాగునీరు కూడా లేదు. కరెంటైతే అసలే ఉండడం లేదు..’’ అని వాపోయారు. ఈ సందర్భగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘కరెంటు ఎందుకు ఉండడం లేదో మీకు తెలుసా? ఈ ప్రభుత్వానికి ముందుచూపు లేదు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని తెలుసు. కరెంటు సమస్య ఉందనీ తెలుసు. మరి కరెంటు ఎందుకు కొనుగోలు చేయలేదు. 

పొరుగు రాష్ట్రాలు ముందే కొనుక్కుని అక్కడ పరిశ్రమల పరంగా ఎలాంటి నష్టం లేకుండా ముందుకు వెళుతుంటే.. పారిశ్రామికంగా దూసుకుపోతుంటే.. ఇక్కడ మన ముఖ్యమంత్రి పరిశ్రమలను నెలలో సగం రోజులు మూసేసుకోమంటున్నారు. అలా అయితే వాటిలో పనిచేసే కార్మికులు ఏం కావాలి? వారి కుటుంబాలు ఏం కావాలి? మీరే చెప్పండి.. ఏం చేద్దాం? వైఎస్ ఉన్నప్పుడు ముందుచూపుతో విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించాలని తలపెడితే.. ఇప్పుడేమో ఉన్న ప్రాజెక్టులకు గ్యాస్ కూడా తేలేని పరిస్థితిని తెచ్చింది ఈ ప్రభుత్వం.. ఈ పాలకులకు రైతులంటే ఎంత నిర్లక్ష్యమో తెలుస్తోంది.. వాళ్లకు కావాల్సింది సీఎం కుర్చీ. ఢిల్లీకి వెళ్లి రావడం. టీడీపీ, కాంగ్రెస్‌లను నమ్మొద్దు..’’ అని మండిపడ్డారు. వికలాంగుడైన తన మనవడికి పెన్షన్ ఇవ్వడం లేదని ఓ వృద్ధురాలు విలపించగా.. ‘‘జగనన్న సీఎం అయితే కనీసం రూ.600లకు తగ్గకుండా వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానన్నాడు.. అధైర్యపడకమ్మా.. మీకు ధైర్యం చెప్పేందుకే జగనన్న నన్ను పంపాడు..’ అని భరోసా ఇస్తూ షర్మిల ముందుకు కదిలారు.

మెస్ చార్జీలు రోజుకు రూ. 40 చొప్పున ఇవ్వాలి..

కత్తులూరు పంచాయతీ పరిధిలోని వేంపల్లి మైనారిటీ గర్ల్స్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యార్థులతో షర్మిల మాట్లాడారు. ‘కరెంటు లేదు. చదవుకోలేకపోతున్నాం. మెస్ చార్జీలు సరిపోవడం లేదు..’ అని వారు ఆందోళన వ్యక్తంచేయగా.. ‘‘మెస్ చార్జీలు రోజుకు రూ. 16.50 ఇస్తున్నారట. సబ్బులు, కాస్మొటిక్స్‌కు నెలకు రూ.50 ఇస్తున్నారట. మిగతావన్నీ దేవుడెరుగు. కనీసం తినడానికి రోజుకు రూ.40 చొప్పున మెస్ చార్జీలు చెల్లించాలని వైఎస్సార్‌సీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం..’’ అని షర్మిల అన్నారు.

రోడ్డుపై కూర్చొని.. మహిళతో మాట్లాడి..

నందిపల్లి సమీపంలో భారీ సంఖ్యలో మహిళలు ఎదురేగి రోడ్డుపై కూర్చోవడంతో షర్మిల అక్కడే కూర్చుని వారితో ముచ్చటించారు. వృద్దురాలు లేచి ‘‘నాకు మోకాళ్ల నొప్పులు ఉన్నాయి. ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఆరోగ్యశ్రీ కిందికి రాదట’’ అని చెప్పింది. ‘ఈ ప్రభుత్వానికి ప్రాణాలంటేనే లెక్కలేదు. 108నే ఆపేశారు. జగనన్న రాగానే ప్రతి పేదవాడి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటాడు’’ అంటూ షర్మిల ఆమెకు భరోసానిచ్చారు. నందిపల్లి సమీపంలో పులివెందుల జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ.. ‘‘ఒక్క ప్లేస్‌మెంట్ కూడా దొరకని పరిస్థితి. ఈ కళాశాల వైఎస్ మానస పుత్రికగా పేరుగాంచింది. అలాంటిది అభివృద్ధికి నోచుకోకుండా పోయింది..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీ తరపున పోరాడుతాం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడతాం’’ అని షర్మిల వారికి హామీనిచ్చారు. తాళ్లపల్లి సమీపంలోని వేరుశనగ రైతుల వద్దకు వెళ్లిన షర్మిల వారి గోడు విని చలించిపోయారు. ‘‘కౌలు రైతులకు రుణాలు రావు. పంట నష్టపోతే పరిహారం అందదు. కనీసం ఎంత నష్టం వచ్చిందో కనుక్కునేందుకు అధికారులు రారు.. ఇలాంటి ప్రభుత్వం మనకు వద్దు. వైఎస్ ఉంటే ఈ నష్టాన్ని భర్తీ చేసేవారు’’ అని అన్నారు.

వైఎస్ వల్లే బతికిబట్టకట్టా..

దుగ్గన్నగారిపల్లి వద్ద నర్సింహారెడ్డి అనే విద్యార్థి షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. ఫస్టియర్ చదువుతున్నప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది. ప్రాణాలు పోయే పరిస్థితి. కానీ 108 వల్ల సకాలంలో ఆసుపత్రికి చేరుకున్నా. చాలా ఖర్చయింది. సీఎం రిలీఫ్‌ఫండ్ కింద ఆ ఖర్చులన్నీ వైఎస్ భరించారు. వైఎస్ వల్లే బతికిబట్టకట్టా’’ అని చెప్పారు. 

రైతులపై కేసులు పెట్టిన ఘనత బాబుది..

పాదయాత్ర రాత్రికి వేములకు చేరుకుంది. అక్కడ భారీ జన సమూహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. తాను చూసిన వేరుశనగ రైతుల కష్టాలపై ఆవేదన చె ందానని, ఈ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా, జగనన్నపై కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి తనతోపాటు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. ‘‘చంద్రబాబు సీఎం అయితే ఇక ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భయపడుతున్నారు. కరెంటు చార్జీలు పెంచొద్దంటే రైతులను కాల్చిచంపిన ఘనత బాబుది. రైతు కుటుంబాలను పరామర్శించకుండా పోలీసులను పరామర్శించిన ఘనత ఆయనది. కరెంటు చార్జీల వసూళ్ల పేరుతో కేసులు పెట్టి రైతులను జైలులో పెట్టిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపినట్టుగానే.. ఇప్పుడు క రెంటు కూడా ఇవ్వకుండా చార్జీలు భారీగా పెంచిన ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపాలి..’’ అని పిలుపునిచ్చారు. వేముల సమీపంలో ఏర్పాటు చేసిన బస స్థలానికి రాత్రి 7.50కి షర్మిల చేరుకున్నారు. రెండోరోజు మొత్తం 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.

షర్మిలతో పాటు నడచిన విజయమ్మ..

వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రెండోరోజు కూడా పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మధ్యాహ్న విరామ సమయానికి కొద్దిగా ముందు పాదయాత్ర నుంచి పక్కకు వచ్చిన విజయమ్మ.. తిరిగి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6.30 వరకు పాదయాత్రలో నడిచారు. ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఆరోగ్యం దెబ్బతింటుందని, కారులో రావాలని సూచించగా వేముల వరకు కారులో వచ్చారు. వేముల బహిరంగ సభలో విజయమ్మ కూడా పాల్గొన్నారు.
Share this article :

0 comments: