రోడ్డు పక్కన పెద్ద లోయలా ఉంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రోడ్డు పక్కన పెద్ద లోయలా ఉంది

రోడ్డు పక్కన పెద్ద లోయలా ఉంది

Written By news on Thursday, January 8, 2015 | 1/08/2015


ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రమాదం: వైఎస్ జగన్
* ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టీకరణ
* పెనుకొండ వద్ద బస్సు దుర్ఘటన ప్రాంతం పరిశీలన
* మావటూరు, నాగలూరులో 8 కుటుంబాలకు పరామర్శ
* మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్  

పెనుకొండ నుంచి సాక్షి ప్రతినిధి: అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చిన ఆయన అక్కడినుండి రోడ్డు మార్గం ద్వారా పెనుకొండకు చేరుకున్నారు. దుర్ఘటన స్థలం వద్ద ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను స్థానికులు, వైఎస్సార్‌సీపీ నేతలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తీసుకెళ్లిన పుస్తకాల బ్యాగులు, భోజన క్యారియర్లు చూసి చలించిపోయారు. బస్సును క్షుణ్ణంగా పరిశీలించారు. ‘అసలే గుం తలమయమైన ఘాట్ రోడ్డు. పక్కనే రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.
 
ఒకేసారి ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే ముందుకు కదలలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రోడ్డు నిర్మాణం సాగుతోంది. రోడ్డు పక్కన పెద్ద లోయలా ఉంది. బారికేడ్లు ఏర్పాటు చేద్దాం. అడ్డంగా పెద్ద రాళ్లు పెడదాం.. అనే ఆలోచన నిర్మాణ సంస్థకానీ, ఆర్‌అండ్‌బీ అధికారులు కానీ చేయలేదు. బారికేడ్లు కట్టిఉంటే బస్సు ప్రమాదానికి గురయ్యేదే కాదు.  కానీ ఈ రోజు ప్రభుత్వ నిర్లక్ష్యంతో 15మంది బల య్యారు. వీరిలో ఎక్కువమంది విద్యార్థులే. వీరి ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా? తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది..’ అని జగన్ అన్నారు.
 
ప్రభుత్వమే బాధ్యత వహించాలి
‘ఈ ప్రమాదానికి కారణం తమ నిర్లక్ష్యమే అని ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. అందుకే రూ.5 లక్షల పరిహారం ఇస్తామంటున్నారు. ఈ కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇచ్చినా తక్కువే. తక్షణమే ప్రభుత్వం స్పందించి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. గాయపడిన వారికి రూ.5 లక్షలివ్వాలి. అదికూడా తక్కువే. కొంతమంది చేతులు పోగొట్టుకున్నారు. ఇంకొందరు కాళ్లు పోగొట్టుకున్నారు. కొందరి తలలు పగిలిపోయాయి. 60 మందికి పైగా గాయాలయ్యాయి. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే డ్రైవర్ మందు తాగాడు. అందుకే ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఉదయం 6-7 గంటలకే డ్రైవర్ మందు తాగుతాడా? తాము చేసిన తప్పును డ్రైవర్‌పైకి నె డతారా? దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి’ అని జగన్ స్పష్టం చేశారు.
 
 మృతుల కుటుంబాలకు పరామర్శ
 ఘటనాస్థలి నుంచి ఆయన నేరుగా మావటూరుకు చేరుకున్నారు. ఒకే గ్రామంలో ఆరుగురు చనిపోవడంతో పల్లె మొత్తం శోకసంద్రంలో నిండిపోయింది. గ్రామంలో చనిపోయిన అనిల్, దాసరి గంగాధర్, గంగాధర్, నరేంద్ర, అశోక్, నరసింహులు అనే ఇంటర్మీడియట్  విద్యార్థుల మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగలూరులో లక్ష్మీనారాయణ, శేఖర్ అనే విద్యార్థులు చనిపోయారు. ఈ కుటుంబాలను కూడా జగన్ పరామర్శించారు. జగన్ తమ ఇంటి వద్దకు రాగానే మృతుల తల్లిదండ్రులు, బంధువులు బోరున రోదించారు. ‘పొద్దున బడికి అని వెళ్లిన బిడ్డలు ఇంటికి రాకుండా శవాలై వచ్చారయ్యా..’ అంటూ విలపించారు. వారి ఆవేదన చూసి జగన్ చలించిపోయారు. చెమర్చిన కళ్లతో వారిని ఓదార్చారు.
 
  ‘ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మీ బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. కచ్చితంగా ప్రభుత్వం మీ కుటుంబాలను ఆదుకోవాలి. ఆదుకునేలా ఒత్తిడి తెస్తాం..’ అని భరోసా ఇచ్చారు. అక్కడి నుండి హిందూపురం ఆస్పత్రికి వెళ్లారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న 44 మందిని పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను ఆరా తీశారు. మంచి వైద్యం అందించాలని సూచించారు. క్షతగాత్రులందరినీ జగన్ పేరు పేరునా పరామర్శించారు. జగన్‌ను చూసి వారు సైతం రోదించారు. జగన్ వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా తదితరులున్నారు
Share this article :

0 comments: