ఫీజుపై విజయమ్మ పోరు. 6, 7 తేదీల్లో నిరాహార దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫీజుపై విజయమ్మ పోరు. 6, 7 తేదీల్లో నిరాహార దీక్ష

ఫీజుపై విజయమ్మ పోరు. 6, 7 తేదీల్లో నిరాహార దీక్ష

Written By news on Sunday, September 2, 2012 | 9/02/2012

రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్నందుకు నిరసన
బీసీలు, నిరుపేదలను అడ్డుకునేందుకే ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ మండిపాటు.. శాచ్యురేషన్ స్థాయిలో అమలుకు డిమాండ్
ఫీజులపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విజయమ్మ దీక్ష చేయడం ఇది రెండోసారి

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలపై పోరాటాల పరంపరలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి పాలకుల కళ్లు తెరిపించేందుకు సిద్ధమైంది. విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నందుకు నిరసనగా పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షను చేపడుతున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 6, 7 తేదీల్లో రెండ్రోజులపాటు ఆమె నిరాహార దీక్ష చేయాలని సంకల్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన ఒక్కో పథకాన్ని ప్రభుత్వం కుంటిసాకులతో నీరుగారుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలినుంచి చెబుతోంది. బీసీలు, నిరుపేదలను ఉన్నత విద్యకు దూరం చేసేలా ప్రభుత్వం తాజాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పలు నిబంధనలు పెట్టి అడ్డుకుంటున్నందుకు నిరసనగా ఈ దీక్ష చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. శాచ్యురేషన్ (సంతృప్తస్థాయిలో) స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ విజయమ్మ దీక్ష చేపట్టడం ఇది రెండోసారి. ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర వృత్తి విద్యాకోర్సులు చదవాలనుకుంటున్న విద్యార్థులకు ఫీజుల ఖరారులో జాప్యాన్ని నిరసిస్తూ ఏలూరులో ఆమె ఆగస్టు 13, 14 తేదీల్లో నిరాహార దీక్ష చేశారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఈ పథకం కింద లబ్ధి పొందే విద్యార్థుల విషయంలో పరిమితులను విధించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గత ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 24వ తేదీ వరకూ ఏడు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఫీజు పోరు పేరుతో నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే.

పాలకులు ఇప్పటికైనా నిద్ర లేవాలి

ఫీజుల పథకంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా విజయమ్మ చేస్తున్న దీక్షతోనైనా పాలకులు మేల్కొనాలని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పేద విద్యార్థుల చదువుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలన్న సదుద్దేశంతో వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రస్తుత పాలకుల చేతకానితనం కారణంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిర్వీర్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా ఫీజుల పథకాన్ని శాచ్యురేషన్ పద్ధతిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు
Share this article :

0 comments: