విగ్రహాల్లో కాదు.. జనం గుండెల్లో ఉన్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విగ్రహాల్లో కాదు.. జనం గుండెల్లో ఉన్నారు

విగ్రహాల్లో కాదు.. జనం గుండెల్లో ఉన్నారు

Written By news on Saturday, December 8, 2012 | 12/08/2012


‘‘గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. వైఎస్సార్ విగ్రహాల గురించి చులకనగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. వైఎస్సార్ విగ్రహాలను పల్లెల్లో కాదు.. ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ప్రజా సమస్యలు పట్టని రాష్ట్ర సర్కారు, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 51వ రోజు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో సాగింది. కేశంపేట మండల కేంద్రంలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘‘ప్రజలు వైఎస్సార్ విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటున్నారో చంద్రబాబునాయుడుకు ఇంకా తెలిసి రావడం లేదు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పరిపాలనలో గ్రామాలను శ్మశానాలుగా మారిస్తే.. కొన ఊపిరితో ఉన్న ఆ పల్లెలకు ఊపిరి పోసిన మహానేత వైఎస్సార్. వైఎస్సార్ విగ్రహాన్ని చూసినప్పుడు రైతులకు ఉచిత విద్యుత్తు గుర్తుకు వస్తుంది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం గుర్తుకు వస్తుంది. మహిళలకు ఆత్మ గౌరవంగా బతకడం కోసం రాజన్న ఇచ్చిన పావలా వడ్డీ పథకం గుర్తుకు వస్తుంది. అవే పల్లెల్లో అక్కడక్కడా ఎన్టీర్ విగ్రహలు కూడా కన్పిస్తాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసినప్పుడు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గుర్తుకు వస్తారు. వైశ్రాయి హోటల్లో ఎమ్మెల్యేలను బంధించి డబ్బు పంచి అధికారం లాక్కున్న విషయం గుర్తొస్తుంది. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబు సంగతి గుర్తుకు వస్తుంది. సంతోషంగా ఉన్న ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారణమైన విషయం గుర్తుకు వస్తుంది..’’ అని మండిపడ్డారు.

కేసీఆర్‌కు ప్రజా సమస్యలు పట్టవు..

‘‘కేసీఆర్‌గారు మహబూబ్‌నగర్ జిల్లాకు ఎంపీ. టీఆర్‌ఎస్ పార్టీకి అధ్యక్షుడు కూడా.. కానీ ఆయనకు ఏనాడు కూడా ప్రజా సమస్యలు పట్టవు. ఇవాళ ఈ జిల్లాలో నీటి సమస్య ఉంది.. కరెంటు సమస్యతో పంటలన్నీ ఎండిపోయాయి. ఈ సమస్యలేవీ ఆయన కంటికి కనిపించవు. కాలేజీకి వెళ్లాల్సిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం సరిగా అందక చదువు మానేసి కూలి పనులకు పోతున్నారు. ఇది మీకు, మన రాష్ట్రానికి అవమానంగా అనిపించడం లేదా కేసీఆర్ గారు అని అడుగుతున్నా..’’ అని షర్మిల ప్రశ్నించారు.


మా ఒక్క గ్రామానికే వైఎస్ కోటి ఇచ్చారు

‘‘మా ఒక్క గ్రామానికే వైఎస్సార్ రూ కోటి ఇచ్చారు. బీటీరోడ్లు.. పైపులైన్లు.. మరుగుదొడ్లు.. మురికి కాల్వలు పల్లెకు అవసరం ఉన్న ప్రతి ఒక్కటీ చేయించారు. ఆయన వెళ్లిపోయిన మూడేళ్ల నుంచి ఒక్క లక్ష కూడా రాలేదు. వైఎస్ స్పూర్తితోనే రాజకీయాలకు వచ్చాను. సర్పంచ్‌గా గెలిచాను. ఆయన ఉన్నంత కాలం నా గ్రామాన్ని బాగుచేసుకున్నా. ఇప్పుడు ఏమి పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’’ అని కాకునూరు గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ చంద్రకళ రచ్చబండ కార్యక్రమంలో షర్మిలతో ఇలా తన ఆవేదన వ్యక్తం చేశారు. 51వ రోజు పాదయాత్ర కొండేడు నుంచి ప్రారంభమై పెద్ద ఆదిరాల, ఎక్వాయిపల్లి, తొమ్మిది రేకుల, కాకునూరు గ్రామాల మీదుగా కేశంపేట చేరుకుంది. జనం 3 కిలోమీటర్ల మేర షర్మిలపై పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. కేశంపేటలో వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల సమక్షంలో టీఆర్‌ఎస్ నాయకుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు కేశంపేట సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. గురువారం మొత్తం 19 కి.మీ. దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 724.30 కి.మీ. యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నాయకులు కె.కె.మహేందర్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, బాలమణెమ్మ, రాజ్ ఠాకూర్, ఎడ్మ కిష్టారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ప్రసాదరాజు, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: