హైదరాబాద్ : సోమవారం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. వరంగల్ లోక్ సభ నియోజక వర్గంలో పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించడంతో పాటు.. తొర్రూరు, పరకాల బహిరంగ సభల్లో పాల్గోనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రోజుల పాటు సాగే ప్రచార కార్యక్రమంలో తొలి రోజు 101 కిలోమీటర్లు, రెండో రోజు 140 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించనున్నారు.
ఎన్నికల ప్రచారం లో భాగంగా 16వ తేదీ సోమవారం ఉదయం 8గంటలకు హైదరాబాద్ లోని లోట్ పాండ్ నుంచి బయల్దేరనున్న వైఎస్స్ జగన్... జనగామ మీదుగా పాలకుర్తి చేరుకుంటారు. పాలకుర్తి, జఫర్ గఢ్, వర్ధన్న పేట, రాయపర్తి, తొర్రూరు, హన్మకొండ ల మీదుగా.. 101 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించ నున్నారు. సోమవారం సాయంత్రం తొర్రూరు లో బహిరంగ సభలో పాల్గొంటారు.
రెండో రోజు పర్యటనలో భాగంగా హన్మకొండ, ఆత్మకూరు, శాయంపేట, రేగొండ, భూపాలపల్లి, పరకాల, హన్మకొండ ల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈనెల 17న సాయంత్రం పరకాల లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
వరంగల్ లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయని వైఎస్సార్ సీపీ తెలంగాణ విభాగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
0 comments:
Post a Comment