రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ గత ఐదు రోజులుగా చేస్తున్న దీక్షను భగ్నం చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైఎస్ విజయమ్మ కలుసుకున్నారు. గురువారం ఉదయం నిమ్స్ ఆస్పత్రికి విజయమ్మ చేరుకుని వైఎస్ జగన్ తో మాట్లాడారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని.. ఇంకా నీరసంగా ఉన్నారని తెలిసింది. గత నెలరోజుల్లో రెండు సార్లు నిరాహారదీక్ష చేపట్టడంతో వైఎస్ జగన్ ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు వెల్లడించారు.
బుధవారం రాత్రి నిమ్స్ వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. పోలీసులతో పాటు నర్సులు కూడా వైఎస్ జగన్ చేతిని గట్టిగా పట్టుకుని మరీ ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అంతకుముందు బుధవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు జగన్ మోహన్ రెడ్డిని బలవంతంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీక్ష ఐదో రోజుకు చేరుకోగా, జగన్ ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. వెంటనే ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచించినా, ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. నిమ్స్ ఆస్పత్రిలో వైఎస్ జగన్ ను కొణతాల రామకృష్ణ, వాసిరెడ్డి పద్మలతోపాటు పలువురు నేతలు కలిశారు.
0 comments:
Post a Comment