దీక్షా స్థలంగా మంగళగిరి వై జంక్షన్ ప్రాంతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దీక్షా స్థలంగా మంగళగిరి వై జంక్షన్ ప్రాంతం

దీక్షా స్థలంగా మంగళగిరి వై జంక్షన్ ప్రాంతం

Written By news on Friday, May 22, 2015 | 5/22/2015


మంగళగిరి వేదికగా జగన్ సమర దీక్ష
బాబు మోసాలు ఎండగట్టేందుకే ఈ దీక్ష: ఉమ్మారెడ్డి
మొత్తం ఐదంశాలపై జగన్ తన దీక్షలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని స్పష్టీకరణ
బాబు ఏడాది పాలన ప్రజల పాలిట మోసాలపుట్టగా మారిందని విమర్శ


హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమరదీక్ష చేపట్టనున్నట్టు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. చంద్రబాబు ఏడాది పాలన రాష్ట్ర ప్రజల పాలిట మోసాల పుట్టగా, వంచనల చిట్టాగా మారిందని దుయ్యబట్టారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టేందుకు జూన్ 3, 4 తేదీల్లో రెండు రోజులపాటు వైఎస్ జగన్ తలపెట్టిన సమర దీక్ష(నిరాహార దీక్ష)కు మంగళగిరిని వేదికగా ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.


ఎన్నికలపుడు చంద్రబాబు చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయని మోసపూరిత వైఖరి వల్ల ఏడాదిలోనే ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోందని ఆయన అన్నారు. టీడీపీ తన మేనిఫెస్టోలో చేసిన వందలాది హామీల మాట అటుంచితే ప్రధానమైన రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో ఆ వర్గాల్ని నిలువునా దగా చేసిందన్నారు. బాబొస్తే జాబొస్తుందని ప్రచారం చేసుకున్న చంద్రబాబు గద్దె నెక్కాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదన్నారు. ఉద్యోగం ఇవ్వకుంటే రూ.2000 నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారన్నారు. విభజన హామీల్లో ఒకటైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు మోసపూరిత వైఖరిని అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా నిరసిస్తోందని ఉమ్మారెడ్డి అన్నారు. ప్రధానంగా ఈ ఐదంశాలపైనే జగన్ తన దీక్ష సందర్భంగా ప్రశ్నిస్తారన్నారు.


బలవంతంగా భూములు లాక్కోవడాన్నే వ్యతిరేకిస్తున్నాం..
పచ్చటి పొలాలను తీసుకోవద్దని తమ పార్టీ చెబుతూంటే టీడీపీ కావాలని పథకం ప్రకారం రాజధాని నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమని ప్రచారం చేస్తోందని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి తమ పార్టీ ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మాణం చేస్తామని అసెంబ్లీలో ప్రకటించినరోజే తమ నేత జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతించారని గుర్తుచేశారు. టీడీపీలో ఉన్న చెవిటివారు తమ వైఖరిని స్పష్టంగా వినాలన్నారు.

రాజధాని పేరుతో రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పచ్చని పొలాలకు బదులుగా బీడు భూముల్ని తీసుకుని రాజధాని నిర్మాణం చేయాలని చెబుతున్నామన్నారు. రాజధాని పేరుమీద టీడీపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, కేంద్రం భూసేకరణకు సంబంధించి 2013లో ఇచ్చిన జీవోనూ ఖాతరు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. భూసేకరణ చట్టానికి కేంద్రం చేయదల్చుకున్న సవరణలు ఇంకా రాజ్యసభలో ఆమోదం పొందకున్నా,  ఆర్డినెన్స్ స్థాయిలోనే ఉన్నా 166 నంబరు జీవోలో రాష్ట్రప్రభుత్వం చట్టంలోని 2,3 అనుబంధాలను తొలగిస్తూ జారీ చేయడం దారుణమన్నారు.

దీక్షా స్థలంగా మంగళగిరి వై జంక్షన్ ప్రాంతం
ఏర్పాట్లపై నేతలతో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల సమీక్ష
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు సీఎం చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న రెండు రోజుల సమరదీక్షకు మంగళగిరి ప్రాంతాన్ని గురువారం ఆ పార్టీ నేతలు ఖరారు చేశారు. దీక్షకు అనువైన స్థలాన్ని గుర్తించేందుకోసం వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ గురువారం గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, అర్బన్ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మహ్మద్ ముస్తాఫా, స్థానిక నేతలతో కలసి మంగళగిరి ప్రాంతంలో పర్యటించారు.మంగళగిరి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న నాలుగు ప్రాంతాల్లో పర్యటించిన తలశిల బృందం చివరకు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వై జంక్షన్ ప్రాంతం అనువుగా ఉంటుందని నిర్ణయించింది. ఈ సందర్బంగా సమరదీక్ష ఏర్పాట్లపై తలశిల గుంటూరు జిల్లా ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లపై చర్చించారు.
Share this article :

0 comments: