అనుమానాలే కానీ.. ఆధారాల్లేవు. సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయలేం: హైకోర్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అనుమానాలే కానీ.. ఆధారాల్లేవు. సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయలేం: హైకోర్టు

అనుమానాలే కానీ.. ఆధారాల్లేవు. సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయలేం: హైకోర్టు

Written By news on Thursday, June 14, 2012 | 6/14/2012

* సీబీఐ, ఏసీబీ లాంటి సంస్థలు స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి
* అన్ని అంశాలనూ పరిశీలించే సాయిరెడ్డికి కింది కోర్టు బెయిల్ ఇచ్చింది 
* సాక్షుల్ని బెదిరిస్తారనేందుకు సీబీఐ ఎటువంటి ఆధారాలూ చూపలేదు 
* సాయిరెడ్డి ప్రొఫెషనల్ ఆడిటర్.. క్రిమినల్ కాదు
* సీబీఐ బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్

హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ, ఏసీబీ లాంటి దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా దర్యాప్తును కొనసాగిస్తూ ఉత్తమ దర్యాప్తు సంస్థలుగా నిరూపించుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో నిందితుడిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. సాయిరెడ్డి వృత్తిపరంగా ఆడిటర్ మాత్రమేనని, ఆయన క్రిమినల్ కాదన్న వాస్తవాన్ని గుర్తించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ పేర్కొన్నారు. కింది కోర్టు నేర తీవ్రతతో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేసిందని స్పష్టం చేశారు. 

ఆయన కేసు దర్యాప్తును అడ్డుకుంటారనేందుకు కానీ, సాక్షుల్ని ప్రభావితం చేస్తారనేందుకు కానీ, ఆధారాల్ని మాయం చేస్తారనేందుకు కానీ సీబీఐ నిర్దిష్టమైన ఆరోపణలు చేయలేదని, ఒక్క ఆధారాన్నీ చూపలేదని తేల్చిచెప్పారు. బెయిల్‌పై విడుదలైతే సాక్ష్యాలు తారు మారుచేయొచ్చన్న ఆరోపణ, అనుమానం మాత్రమే సరిపోవ న్నారు. అయితే సీబీఐ దర్యాప్తుకు సాయిరెడ్డి సహకరించాలని, ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరుకావాలని ఆదేశించారు. సాయిరెడ్డి సాక్షులను ప్రభావితం చేసినా, ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించినా.. బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ సీబీఐకి ఉందని సూచించారు. జస్టిస్ చంద్రకుమార్ తీర్పులోని ముఖ్యాంశాలు....

*‘‘స్వతంత్ర న్యాయవ్యవస్థ మన రాజ్యాంగానికి వెన్నెముక. వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని రక్షించటం, ఇతర సంస్థలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేలా మార్గనిర్దేశనం చేయటం స్వతంత్ర న్యాయవ్యవస్థ మాత్రమే చేయగలదు. ఈ స్వతంత్రతతోనే భారత న్యాయవ్యవస్థ వెలుగొందుతోంది. రాజ్యాంగ సిద్ధాంతం, విలువలను, న్యాయ సూత్రాలను న్యాయమూర్తులు అనుసరించినంత కాలం.. న్యాయ వ్యవస్థ ముఖ్యమైన, స్వతంత్ర పాత్రను పోషిస్తూనే ఉంటుంది. 

* న్యాయమూర్తి కూడా ఒక మనిషే. మానవుడు సంఘజీవి. న్యాయమూర్తి సైతం పూర్తి ఒంటరి జీవితాన్ని గడపటం అసాధ్యం. అయినప్పటికీ.. న్యాయమూర్తి సాంఘిక సంబంధాలను కొనసాగిస్తూనే.. స్వతంత్రంగా ఉండాలి. భయం, పక్షపాతం లేకుండా వ్యవహరించాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వచ్చే అసంబద్ధ కథనాలతో సహా ఎలాంటి ప్రభావానికీ లోనుకాకూడదు. 

* ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు తెలిసిన వ్యక్తులను.. ఆ వాస్తవాలు బయటపెట్టకుండా ప్రలోభపెడుతున్నారని, బెదిరిస్తున్నారని; సాక్ష్యాలను మాయం చేసేందుకు, తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీబీఐ ఆరోపించినప్పటికీ.. దానికి సంబంధించి సీబీఐ ఎలాంటి నిర్దిష్టమైన ఆరోపణలూ చేయలేదు. కేవలం ఆరోపణ మాత్రమే సరిపోదు. ప్రతివాదిని బెయిల్‌పై విడుదల చేస్తే అతడు సాక్ష్యాలను తారుమారు చేయవచ్చన్న అనుమానం మాత్రమే సరిపోదు. 

* నేర తీవ్రత, బెయిల్ మంజూరు చేయటానికి అసంబద్ధమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే, సాక్షులను బెదిరించటానికి, ప్రభావితం చేయటానికి గల అవకాశాలు, చట్టం నుంచి తప్పించుకుపోవటానికి గల అవకాశం.. ఇవి బెయిల్ మంజూరు చేయటానికి కానీ, రద్దు చేయటానికి కానీ పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితుల్లో కొన్ని. 

* ఈ కేసులో.. ప్రతివాదిని చూస్తేనే సాక్షుల మనసుల్లో భయాందోళనలు పుట్టే అవకాశం ఉందనేందుకు సీబీఐ ఎలాంటి ఆధారాలూ చూపలేదు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులు, పట్టపగలు హత్యలు చేసిన హంతకుల విషయం వేరే. వారిని చూస్తేనే సాక్షుల్లో భయం పుడుతుంది. ఆ కేసులతో ప్రతివాది కేసును పోల్చిచూడలేం. అదీగాక.. దర్యాప్తు సంస్థ అనుమానాలకు ఏదైనా కొంత ప్రాతిపదిక ఉండాలి. 

* ఈ కేసుకు సంబంధించి అక్రమ లావాదేవీల్లోనూ, జగతి పబ్లికేషన్స్ షేర్ విలువను పెంచి చూపటంలోనూ సాయిరెడ్డి కీలకపాత్ర పోషించారని చెప్తున్న సీబీఐ ఆరోపణలు స్వభావరీత్యా తీవ్రమైనవనే విషయంలో సందేహం లేదు. ఆర్థిక నేరాల తీవ్రతను విస్మరించరాదనటంలోనూ ఎలాంటి సందేహం లేదు. వృత్తి నిపుణులుగా సేవలు అందించే విద్యాధికులు.. తమ క్లయింట్లకు సేవలు అందించేటపుడు, సలహాలు ఇచ్చేటపుడు తమ వృత్తికి సంబంధించిన నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి. వారు నేరపూరిత చర్యల్లో పాలుపంచుకోకూడదు. దురదృష్టవశాత్తూ.. వృత్తి నిపుణుల అనుభవం, ప్రతిభాపాటవాలు మార్కెట్‌లో వస్తువులా అమ్ముడుపోతున్నాయి. దేశ ప్రగతికి ఉపయోగపడగల ఇలాంటి ఉత్తమ వృత్తి నిపుణుల సేవలను ధనబలం ఉన్న వారు పొందగలుగుతున్నారు. 

* ప్రతివాది చట్టం నుంచి తప్పించుకు పోతారనే ఆరోపణ ఏదీ లేదు. సీబీఐ ఎప్పుడు విచారణకు పిలిచినా సాయిరెడ్డి హాజరయ్యారు. బెయిల్ మంజూరు చేయటంలో పరిగణనలోకి తీసుకునే ప్రాతిపదికల్లో నేర తీవ్రత ఒకటి.. బెయిల్‌ను రద్దు చేయాలన్న వినతిని పరిశీలించేటపుడూ పరిగణనలోకి తీసుకునే ముఖ్యమైన అంశాల్లో కూడా అది ఒకటి. కానీ.. ప్రకాష్ కదమ్ వర్సెస్ రామ్‌ప్రసాద్ విశ్వనాథ్ గుప్తా అండ్ అనదర్ (2011) కేసులో.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ప్రతివాదికి బెయిల్ మంజూరు చేసిన కోర్టునే.. అంటే విచారణ కోర్టునే.. ఆ (నేర తీవ్రత) ప్రాతిపదిక మీద బెయిల్ రద్దును కోరుతూ దర్యాప్తు సంస్థ ఆశ్రయించాల్సి ఉంటుంది. 

* కింది కోర్టు అసంబద్ధమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసినట్లయితే.. ఆ బెయిల్‌ను రద్దు చేయవచ్చు. ఎ-1ను అరెస్ట్ చేయకపోవటం, దర్యాప్తు పూర్తికావటం వంటి అసంబద్ధంగా తోచే అంశాలను (సీబీఐ కోర్టు) ప్రత్యేక న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారని, ఇది సరికాదని సీబీఐ తరఫు న్యాయవాది చేసిన వాదనలో కొంత బలం ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ.. ఆ ప్రాతిపదక మీద బెయిల్‌ను రద్దు చేయజాలమని నేను భావిస్తున్నా. 

ఈ నేపథ్యంలో కింది మార్గదర్శకాలు జారీ చేస్తున్నాం... 
* దర్యాప్తు కోసం సీబీఐ ప్రతివాదిని ఎప్పుడు అవసరమైనా విచారణకు పిలవవచ్చు. ప్రతివాది.. మౌనం వహించేందుకు చట్టబద్ధమైన హక్కుకు లోబడి.. సీబీఐకి సహకరించాలి. 

* ప్రతివాది ఏ సాక్షినైనా బెదిరించేందుకు, ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినట్లయితే.. దానికి సంబంధించిన ఆధారాలతో సీబీఐ అతడి బెయిల్‌ను రద్దు చేయాలని కోరవచ్చు. 

* సాక్ష్యాలను చెరిపివేసేందుకు, తారుమారు చేసేందుకు ప్రయత్నించినా, ఆ విషయంలో ఇతర నిందితులకు సహకరించినా, మరేదైనా నేరంలో పాలుపంచుకున్నా.. అతడి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ ఈ కోర్టును ఆశ్రయించవచ్చు. 

* కింది కోర్టు విధించిన ఇతర షరతులను పాటించాలి. బెయిల్ రద్దును కోరుతూ సీబీఐ ప్రత్యేక కోర్టును సీబీఐ ఆశ్రయించిన పక్షంలో ఈ ఉత్తర్వులు అందుకు అవరోధం కాబోవు. 

* సీబీఐ, ఏసీబీ వంటి సంస్థలు స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి. నేరాల్లో ప్రమేయమున్న వారందరినీ.. వారి అధికారం, హోదా, ప్రభావం వంటి వాటితో సంబంధం లేకుండా అరెస్ట్ చేయాలి. తమను తాము ఉత్తమ స్వతంత్ర దర్యాప్తు సంస్థలుగా నిరూపించుకోవాలి. 
పై పరిశీలనలకు లోబడి.. క్రిమినల్ పిటిషన్‌ను కొట్టివేయటమైనది’’.
Share this article :

0 comments: