‘సాక్షి’ విలేకరిపై కుట్ర కేసు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘సాక్షి’ విలేకరిపై కుట్ర కేసు

‘సాక్షి’ విలేకరిపై కుట్ర కేసు

Written By news on Wednesday, June 27, 2012 | 6/27/2012

తన వ్యక్తిగత సమాచారమైన కాల్ లిస్టును బహిర్గతం చేశారంటూ వాసిరెడ్డి చంద్రబాల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ‘సాక్షి’ విలేకరి కె.యాదగిరిరెడ్డి, నాచారం ఇన్‌స్పెక్టర్ ఎం.శ్రీనివాసరావులపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. కుట్రతో పాటు మూడు చట్టాల్లోని ఏడు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తమ ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలంటూ పోలీసులు అనేక ఆరోపణల్ని అందులో పొందుపరిచారు. చంద్రబాల కాల్ లిస్ట్ కావాలంటూ ‘సాక్షి’ విలేకరి నాచారం ఇన్‌స్పెక్టర్‌ను కోరారని, ఆయన డీసీపీకి చెందిన మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఆయన క్యాంప్ క్లర్క్ (సీసీ) నుంచి తీసుకుని, వాటిని వినియోగించి ఎయిర్‌టెల్ నోడల్ ఆఫీసర్‌కు మెయిల్ పెట్టడం ద్వారా లిస్టును సంగ్రహించారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా సేకరించిన వివరాలను ఆయన తన పోలీసుస్టేషన్‌లో పని చేసే కానిస్టేబుల్ మెయిల్ ఐడీ నుంచి ‘సాక్షి’ విలేకరి మెయిల్ ఐడీకి పంపారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో యాదగిరిరెడ్డి, శ్రీనివాసరావులపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని 120 (బి), 505, 509 సెక్షన్లతో పాటు ఇన్ఫర్మేషనర్ టెక్నాలజీ యాక్ట్-2000లోని సెక్షన్ 66, 72, ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్-1885లోని సెక్షన్ 24, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్-1923లోని సెక్షన్ 5 కింద రిజిస్టర్ చేసిన కేసులో యాదగిరిరెడ్డిని ప్రధాన నిందితుడిగా, శ్రీనివాసరావును రెండో నిందితుడిగా చేర్చారు. మరికొందరి ప్రమేయమూ ఉందంటూ అనుమానిస్తున్న పోలీసులు.. వీరిద్దరితో పాటు తదితరులూ నిందితులనే వ్యాఖ్యను చేర్చారు.

సీబీఐ జేడీ ఫిర్యాదుతో ‘సాక్షి’పై కేసు..
సైబరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు ‘సాక్షి’ విలేకరిపై కేసు నమోదు చేసిన కొన్ని గంటల్లోనే సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ హైదరాబాద్ కమిషనర్ అనురాగ్ శర్మకు ‘సాక్షి’పై ఫిర్యాదు చేశారు. దీన్ని ఆధారంగా చేసుకున్న పోలీసులు మరో కుట్ర కేసు నమోదు చేశారు. తన కాల్స్ వివరాలు పత్రికలో ప్రచురణ కావడంతో పాటు టీవీలోనూ ప్రసారమయ్యాయని, ఇవెలా బయటకు వచ్చాయో దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐ జేడీ కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్.. ఫిర్యాదు సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దాంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు ‘సాక్షి’పై కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 120(బి), 166, 499, 500, 509, ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్‌లోని సెక్షన్లు 24, 25, 29, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్లు 66, 72తో పాటు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్‌లోని సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
Share this article :

0 comments: