ప్రజలకు ధైర్యం చెబుతూ.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలకు ధైర్యం చెబుతూ..

ప్రజలకు ధైర్యం చెబుతూ..

Written By news on Tuesday, November 27, 2012 | 11/27/2012

కరెంటు ఉండదు.. అయినా భారీగా బిల్లు వస్తుంది
తాగడానికి నీళ్లు లేవని.. పింఛను ఇవ్వట్లేదని ఆవేదన
సాగు చేయడం కంటే చావడమే మేలంటున్న రైతన్నలు
ఉపాధి కూలీ రూ.30 కూడా రావట్లేదంటున్న కూలీలు
అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్న షర్మిల
జగనన్న వచ్చాక రాజన్న రాజ్యం తెస్తాడంటూ భరోసా
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’సోమవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 40, కిలోమీటర్లు: 539.10

‘‘నాకు నాలుగెకరాలు ఉంది. ఇంకో రెండు ఎకరాలు గుత్తకు తీసుకున్నా.. ఇంత పత్తి, ఇంత మేరప(మిరప), ఇంత శనగ ఏసినా.. ఇప్పటి వరకు లచ్చ(లక్ష) ఖర్చు పెట్టినా.. కరెంటు లేక పంట మొత్తం పోయింది. ఎకరానికి మూడు క్వింటాళ్ల పత్తి ఎల్లింది(దిగుబడి). సేటుకు అమ్మితే క్వింటాల్‌కు రూ.3000 కూడా పడలేదు. దాంట్లోనే పురుగు మందులు, ఎరువుల దుడ్లు సేటు తీసుకునేడు. ఈ సాగు చేసి నేను ఎట్టా బతకాలక్కా! చెప్పు.. ఏం ఫాయిదా లేదు. ఇంత పురుగుల మందు తాగి సచ్చిందే మేలు.’’
- కలుకుంట్లకు చెందిన రైతు ఉరుకుందయ్య కన్నీళ్లు..

‘‘పొద్దంతా సేను చెలకల్లో కాయ కష్టం చేసుకుంటాం.. ఒళ్లు అలసి ఇంటికి వస్తే కరెంటే ఉండదు. చీకట్లనే ఎట్లోగట్టా ఒండుకొని తిని పడుకోబోతే కరెంటు లేక ఫ్యాను తిరగదు. దోమలు సూదులుగుచ్చినట్లు పీక్క తింటాయి. కరెంటు బిల్లు జూద్దామంటే రూ.400, రూ.500కు తక్కువ రాదు. అదీ.. ఇదీ అని లేదు అన్ని రేట్లూ పెంచిండ్రు. ఇక ఎట్టా బతకాలే. ఇదేమన్నా సర్కారేనా?’’
- బింగిదొడ్డి గ్రామానికి చెందిన కూలీ భారతమ్మ ఆవేదన..

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మహబూబ్‌నగర్ జిల్లాలో చేస్తున్న పాదయాత్రలో సోమవారం ఆమె వద్ద గోడు వెళ్లబోసుకున్న వారిలో కేవలం ఇద్దరి ఆవేదన ఇది. జిల్లాలో పాదయాత్ర సాగుతున్న దారిపొడవునా ఇలా ఎందరో వచ్చి ఆమెకు తమ కష్టాలు చెప్పుకొంటున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక్క పాలమూరు జిల్లానే కాదు.. ఇంతకుముందు పాదయాత్ర సాగిన వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. రైతు కావచ్చు, కూలీ కావచ్చు, చేనేత కార్మికుడు కావచ్చు... అందరిదీ ఒకటే ప్రశ్న.. ‘ఈ సర్కారు కాల్చుకుతింటుంటే ఎలా బతకాలి?’ అన్నదే వారి ఆవేదన. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’లో వీరంతా ఆమెను కలిసి తమ గోడు చెప్పుకొంటున్నారు.

తాగడానికి నీరు లేదు.. పింఛన్ రావట్లేదు..


ఇంతవరకు షర్మిల నడిచిన 539 కిలోమీటర్ల యాత్రలో 4 జిల్లాల ప్రజలను పలకరించారు. సగటున 170కిపైగా పల్లెలు 6 మున్సిపాల్టీలు, రెండు కార్పొరేషన్లను చుట్టి ప్రజల గుండె చప్పుడు విన్నారు. లక్షలాది మంది ప్రజలతో మాట్లాడారు. ప్రతి గ్రామంలో షర్మిల రచ్చబండ కార్యక్రమంలో మహిళల కన్నీళ్లు, కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆమెతో మాట్లాడిన ప్రతి 10 మందిలో ఏడుగురు రోజుకు రెండు మూడు గంటలకు మించి కరెంటు రావడం లేదని, బిల్లు మాత్రం రూ.400 తగ్గడం లేదని, రేషన్‌కార్డు మీద ఇస్తున్న 16 కిలోల బియ్యం సరిపోవడం లేదని, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని చెప్పుకొచ్చారు. మరికొందరు తమకు వైఎస్సార్ ఉన్నప్పుడు పింఛన్ వచ్చిందని, ఇప్పుడు రావటం లేదని, తమకు ఇళ్లు రాలేదని ఫిర్యాదు చేశారు. ఆమెతో మాట్లాడిన రైతుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ మూడేళ్లలో సాగు చేసి తాము బాగుడ్డామని చెప్పిన వాళ్లు లేరు.

వైఎస్‌తోనే ఫీజుల పథకం పోయింది: షర్మిల విద్యార్థులను కలిసినపుడు ప్రధానంగా వారు ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందట్లేదని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లా తిమ్మాపురం గ్రామంలో ఇంటర్మీడియట్ పాసైనా ఫీజుల పథకం అందక, పేదరికంతో డిగ్రీ చదవలేక చంద్రకళ అనే బాలిక కూలి పనులకు వెళ్తోంది. ఈమె పత్తి చేలో పత్తి తీస్తున్నప్పుడు షర్మిల పలకరించారు. వైఎస్సార్ బతికుంటే ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం కూడా బతికే ఉండేదని, అప్పుడు తాను ధైర్యంగా డిగ్రీ చదివేదానినని చంద్రకళ చెప్పింది. ఇక అనంతపురం జిల్లా ధర్మవరంలో విశ్వనాథ్, వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో విజితలదీ ఇదే మాట.

ఉపాధి పనులకు పోతే రూ. 30 ఇస్తున్నారు: ఇక కర్నూలు జిల్లా బిణిగేరలో జయమ్మ, మల్లీశ్వరీ, భారతీ అనే మహిళలు.. షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘మాకు ఉపాధి కూలి రూ. 20 ఇస్తున్నారమ్మా.. ఈ డబ్బులతో ఎట్లా బతకాలి? అదే రాజన్న ఉన్నప్పుడు రూ. 80 నుంచి 120 వరకూ వచ్చేది’’ అంటూ గోడు చెప్పుకొన్నారు. ఇడుపులపాయ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా నడిగడ్డ వరకు ప్రతి గ్రామంలోనూ ఉపాధి కూలీ రూ.30 లోపే పడుతున్నాయని చెప్పారు. కర్నూలు జిల్లా జులకల్‌లోనైతే రూ.18 మాత్రమే కూలీ పడిందని చెప్పారు. తమకు పావలా వడ్డీ అందడం లేదని మహబూబ్‌నగర్ జిల్లా ఐజకు చెందిన ఫకీరమ్మ, మస్తానమ్మ షర్మిలకు మొరపెట్టుకున్నారు. ఇదే జిల్లాలో మూడేళ్ల కిందట వచ్చిన కృష్ణా వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజలు తమకు ఇప్పటికీ సాయం అందలేదని షర్మిలకు ఫిర్యాదు చేశారు.

ప్రజలకు ధైర్యం చెబుతూ: ఇన్ని కష్టాలు, సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు షర్మిల ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తాడని, రాజన్న రాజ్యం తెస్తాడని, వైఎస్ అమలు చేసిన పథకాలను తాను కూడా అమలు చేస్తాడంటూ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు. 


బాబు యాత్రలో చిత్తశుద్ధి ఏది?: షర్మిల

బలమున్నా అవిశ్వాసం పెట్టరేమని నిలదీత

‘‘ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది. నిలదీయాల్సిన చంద్రబాబు ప్రభుత్వాన్ని కాపాడుతూ పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేంత ఎమ్మెల్యేల బలం ఆయనకు ఉన్నా అవిశ్వాసం మాత్రం పెట్టరట. ఇదీ చంద్రబాబు గారి పాదయాత్రలో ఉన్న చిత్తశుద్ధి’’ అని షర్మిల టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగారు. పాదయాత్ర 40వ రోజు సోమవారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజా సమస్యలు తెలుసుకుని మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక రోజు వస్తుంది.

ఉద యించే సూర్యుడిని ఎలాగైతే ఆపలేమో..! జగనన్నను కూడా అలాగే ఎవరూ ఆపలేరు. ఆ రోజున అన్న బయటకు వస్తాడు. మనందరినీ రాజన్న రాజ్యంవైపు తీసుకెళతాడు. రాజన్న రాజ్యం స్థాపిస్తాడు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాడు. ప్రతి మహిళా తన పిల్లలను బడికి పంపేందుకు వీలుగా ‘అమ్మ ఒడి’ ద్వారా అమ్మ బ్యాంకు ఖాతాలో పదో తరగతి వరకు రూ. 500, ఇంటరైతే రూ. 700, డిగ్రీ అయితే రూ. 1000 వేస్తాడు. వృద్ధులకు, వితంతువులకు రూ. 700, వికలాంగులకు రూ. 1000 పెన్షన్ ఇస్తాడు’’ అని హామీ ఇచ్చారు.

పాదయాత్ర 40వ రోజు సోమవారం బింగిదొడ్డి నుంచి ప్రారంభమైంది. తాటికుంట్ల, శేశంపల్లి మీదుగా మల్దకల్ చేరుకుంది. అక్కడి నుంచి అమరవాయి మీదుగా బూడిదపాడు శివారులో ఏర్పాటు చేసిన బసకు షర్మిల చేరుకున్నారు. పలు గ్రామాల్లో షర్మిల రచ్చబండ నిర్వహించారు. సోమవారం యాత్ర 16.20 కిలోమీటర్లు సాగింది. ఇప్పటి వరకు మొత్తం 539.10 కిలో మీటర్ల యాత్ర పూర్తయింది.

నేతల సంఘీభావం

యాత్రలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు మైసూరా రెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, బాలమణెమ్మ, వాసిరెడ్డి పద్మ, ఎడ్మ కిష్టారెడ్డి, గౌరు వెంకటరెడ్డి, తలశిల రఘురాం, చల్లా వెంకట్రామిరెడ్డి, కాపు భారతి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: