టీడీపీ బాటలోనే రాధాకృష్ణ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ బాటలోనే రాధాకృష్ణ!

టీడీపీ బాటలోనే రాధాకృష్ణ!

Written By news on Wednesday, November 28, 2012 | 11/28/2012

కోర్టు ధిక్కరణ కేసులో ‘నాట్ బిఫోర్’ నాటకంపై ఆగ్రహం
కేసు విచారణ నుంచి వైదొలగిన జస్టిస్ రామ్మోహనరావు

కోర్టు ధిక్కరణ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ వేమూరి రాధాకృష్ణ అనుసరించిన తీరును హైకోర్టు ఎండగట్టింది. కేసును వినకుండా చేసేందుకు ‘నాట్‌బిఫోర్’ నాటకానికి తెరలేపడంపై మండిపడింది. నీతిబాహ్యమైన ఇలాంటి పనులెందుకంటూ మంగళవారం నిలదీసింది. ‘నాట్‌బిఫోర్’లతో వ్యవస్థను ఎక్కడికి తీసుకెళుతున్నారంటూ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు తీవ్ర ఆవేదనతో ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు వ్యవస్థకు ఎంత మాత్రం మేలు చేసేవి కావని వ్యాఖ్యానించారు. అంతేకాక రాధాకృష్ణ ‘నాట్‌బిఫోర్’ నాటకంలో పాలుపంచుకున్న, ఒకప్పుడు తన వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేసిన ఎం.కృష్ణారావుపై కూడా న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదేనా నువ్వు నేర్చుకున్నదంటూ అసహనం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం కోర్టు ధిక్కరణ కేసును తానే విచారించాల్సి ఉన్నప్పటికీ.. రాధాకృష్ణ తరఫున తన వద్ద జూనియర్‌గా పనిచేసిన న్యాయవాది వకాలత్ దాఖలు చేయడంతో నైతిక విలువలకు పెద్దపీట వేస్తూ ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ రామ్మోహనరావు తప్పుకున్నారు. ఈ కేసును మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా సంబంధిత రికార్డులన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాల్సిందిగా రిజిస్ట్రీని ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

కేబుల్ టీవీ నెట్‌వర్క్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలతో కుమ్మక్కై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న ఆ చానెల్‌పై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గత ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రతిష్టను దెబ్బతిసే విధంగా ఎటువంటి కథనాలు ప్రసారం చేయకుండా ఏబీఎన్ చానెల్‌ను ఆదేశించాలని కోరారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఎటువంటి కథనాలు ప్రసారం చేయవద్దని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇటీవల ఆ చానెల్ తమ పార్టీతో పాటు, పార్టీ నాయకుల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తోందని, ఇది కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని, అందువల్ల ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ అంబటి రాంబాబు ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ రామ్మోహనరావు ఇటీవల ఈ వ్యాజ్యాన్ని విచారించారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఎటువంటి కథనాలు ప్రసారం చేయవద్దన్న ఆదేశాలను ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలంటూ రాధాకృష్ణకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. దీంతో మంగళవారం కేసు విచారణకు వచ్చింది. అయితే న్యాయమూర్తి... తను న్యాయవాదిగా ఉన్న సమయంలో తన వద్ద జూనియర్‌గా పనిచేసిన ఎం.కృష్ణారావు.. రాధాకృష్ణ తరఫున వకాలత్ దాఖలు చేసిన విషయాన్ని గమనించారు. ఈ కేసును తాను విచారించకుండా చేసేందుకే రాధాకృష్ణ ఈ ‘నాట్‌బిఫోర్’ నాటకానికి తెరలేపారన్న విషయం ఆయనకు అర్థమైంది. కేసును వినకుండా చేసేందుకు ఇటువంటి చౌకబారుపనులకు పాల్పడాల్సిన అవసరం ఏముందని అటు కృష్ణారావును, ఇటు రాధాకృష్ణను సూటిగా ప్రశ్నించారు.‘ నీ చేత ఈ వకాలత్ దాఖలు చేయించిన ఆ వ్యక్తికి నేను బాగా తెలుసు. 

ఈ కేసు నేను వినడం వల్ల తనకు ఇబ్బందులు వస్తాయని ఆ వ్యక్తి భావించి ఉంటే, నేరుగా కోర్టుకు వచ్చి ధైర్యంగా ఆ విషయాన్ని నాకే చెప్పి ఉండాల్సింది. అలా ధైర్యంగా చెప్పి ఉంటే ఈ కేసు విచారణ నుంచి నేను తప్పుకుని ఉండేవాడిని. కానీ ఇలాంటి నీతిబాహ్యమైన, చౌకబారు పనులకు పాల్పడాల్సిన అవసరం లేదు’ అంటూ న్యాయమూర్తి మండిపడ్డారు. 

టీడీపీ బాటలోనే రాధాకృష్ణ!: ‘నాట్‌బిఫోర్’ అనే మాటకు వాస్తవంగా ఇటీవలి కాలం వరకు చాలామందికి అర్థం తెలియదు. అలాంటి పదాన్ని సామాన్యులకు సైతం పరిచయం చేసిన ఘనత టీడీపీ నాయకులకు దక్కుతుంది. ప్రతి న్యాయమూర్తి.. తాను న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, నైతిక విలువల్లో భాగంగా తన వద్ద జూనియర్‌గా పనిచేసిన న్యాయవాదుల కేసులను తన ముందు విచారణకు వేయవద్దంటూ.. సంబంధిత జూనియర్ న్యాయవాదుల జాబితాను రిజిస్ట్రీకి ఇస్తారు. ఆ జాబితాను నాట్ బిఫోర్ లిస్ట్ అంటారు. ఆ జాబితాలోని న్యాయవాదులు దాఖలు చేసే కేసులు.. సంబంధిత న్యాయమూర్తి ముందుకు రాకుండా రిజిస్ట్రీ చర్యలు తీసుకుంటుంది. 

కాగా కొద్దికాలం క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆయన బినామీల అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన అప్పటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గులాం మహ్మద్, జస్టిస్ నూతి రామ్మోహనరావులతో కూడిన ధర్మాసనం.. సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామంతో కంగుతిన్న టీడీపీ నాయకులు నాట్ బిఫోర్ నాటకాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసును తిరిగి హైకోర్టు విచారణకు చేపట్టినప్పుడు.. కేసు తిరిగి జస్టిస్ రామ్మోహనరావు సభ్యుడిగా ఉన్న ధర్మాసనం ముందుకు రాకుండా ఉండేందుకు, ఆయన వద్ద జూనియర్‌గా పనిచేసిన ఓ న్యాయవాది చేత వకాలత్ దాఖలు చేయించారు. తద్వారా ఆ కేసు ఆయన వద్దకు రాకుండా చేయడంలో విజయం సాధించారు. అదే విధంగా తమకు అనుకూలంగా లేని న్యాయమూర్తుల వద్ద నాట్ బిఫోర్ నాటకాన్ని అమలు చేశారు. దీంతో ఈ కేసు హైకోర్టులోని ధర్మాసనాలన్నింటినీ తప్పించుకుంది. చివరకు విచారణ నిమిత్తం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిని ప్రధాన న్యాయమూర్తికి కల్పించారు. ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తే, అందులో న్యాయమూర్తులుగా ఎవరుంటారనే విషయాన్ని ముందుగానే అంచనావేసి.. తదనుగుణంగా, వ్యూహాత్మకంగా అప్పట్లో నాట్ బిఫోర్ నాటకానికి తెరలేపారు. తద్వారా చంద్రబాబు అండ్ కో సీబీఐ దర్యాప్తు నుంచి తప్పించుకోగలిగారు. 

తాజాగా రాధాకృష్ణ కూడా టీడీపీ నేతల బాటలోనే నడిచారు. హైకోర్టు ఉత్తర్వులను స్పష్టంగా ఉల్లంఘించడంతో ఈ కేసులో కోర్టు ధిక్కరణ కింద తనకు ఇబ్బందులు తప్పవని ఆయనకు అర్థమైంది. దీంతో బాబుకూ, తనకూ న్యాయవాదిగా ఉన్న వ్యక్తితో సంప్రదింపులు జరిపారు. ఇబ్బందులు తప్పించుకోవాలంటే నాట్ బిఫోర్ నాటకం ఒక్కటే శరణ్యమని ఆ వ్యక్తి రాధాకృష్ణకు తెలిపారు. దీంతో ఆయన నాట్‌బిఫోర్ నాటకానికి తెరలేపారు. జస్టిస్ రామ్మోహనరావు రిజిస్ట్రీకి సమర్పించిన నాట్ బిఫోర్ జాబితాను తెప్పించుకుని అందులో ఉన్న పేర్లను పరిశీలించారు. ఆ జాబితాలోని ఓ న్యాయవాదిని ఇప్పటికే ఓసారి ఉపయోగించుకుని ఉండటంతో అతన్ని వదిలేసి, మరో న్యాయవాది అయిన కృష్ణారావును పట్టుకున్నారు. ఆయనను ఒప్పించి రాధాకృష్ణ తరఫున వకాలత్ దాఖలు చేయించారు. కేసును జస్టిస్ రామ్మోహనరావు వినకుండా చేశారు.

source:sakshi
Share this article :

0 comments: