వైఎస్ హయాంలోనే ఐటీ అభివృద్ధి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ హయాంలోనే ఐటీ అభివృద్ధి..

వైఎస్ హయాంలోనే ఐటీ అభివృద్ధి..

Written By news on Thursday, November 29, 2012 | 11/29/2012

అధికారంలోకి రావడానికి చేసిన వాగ్దానాలను బాబు తుంగలో తొక్కారు: విజయమ్మ
ఇప్పుడు మళ్లీ కొత్త వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు
ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమంటే డొంక తిరుగుడు వ్యాఖ్యలు చేస్తున్నారు
చంద్రబాబు హయాంలో ఐటీ రంగంలో హైదరాబాద్ దిగజారిపోయింది
వైఎస్సార్ సీపీలో చేరిన ఖనిజాభివృద్ధి సంస్థ 
మాజీ చైర్మన్ వడ్డేపల్లి.. కూకట్‌పల్లిలో భారీ సభ

హైదరాబాద్, న్యూస్‌లైన్: అబద్ధాలను పదే పదే ప్రచారం చేసి నిజమని నమ్మించేందుకు గోబెల్స్ అనే మంత్రిని ప్రత్యేకంగా నియమించుకున్న హిట్లర్ జన్మదినం.. రాష్ట్రంలో అదేపనిగా అబద్ధాలాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు ఒకటేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఇద్దరూ 4వ నెల 20వ తేదీన పుట్టారని, 4, 20లను కలిపితే వచ్చే 420 చంద్రబాబుకు బాగా సరిపోతుందని ఆమె ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి, విశ్వసనీయత లేదని విమర్శించారు. ఆయనకు మాటమీద నిలబడే మనస్తత్వంలేదని తూర్పారబట్టారు. 1994లో టీడీపీ అధికారంలోకి రావడానికి చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కి మళ్లీ ఇప్పుడు ప్రజల్ని మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వడ్డేపల్లి నర్సింగరావు పార్టీలో చేరుతున్న సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ విజయమ్మ పై వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఈ సభలో నర్సింగరావుతో పాటు అతని అనుచరులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు.

వైఎస్ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారు..

సభలో విజయమ్మ మాట్లాడుతూ.. ‘‘రాజశేఖరరెడ్డి 5 సంవత్సరాల మూడునెలల పాలనలో ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ పరిపాలన సాగించారు. వైఎస్ హయాంలో ప్రజలపై ఒక్క రూపాయి కూడా పన్ను వేయకపోగా ఎన్నో సంక్షేమ పథకాలను దిగ్విజయంగా కొనసాగిస్తూ.. నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. ఇవాళ రాష్ట్రాన్ని చూస్తుంటే ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వమే ఈరోజు ఆయన పథకాలన్నింటికీ తూట్లు పొడుస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అచ్చం చంద్రబాబు మాదిరిగా ఖజానా నింపుకోవడంపైనే దృష్టి పెడుతోంది’’ అని మండిపడ్డారు. వైఎస్ మరణించాక ఈ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్‌కార్డు ఇవ్వలేదు. ఇళ్లు కట్టించలేదు. పెన్షన్‌లు ఇచ్చిన దాఖలాలు లేవు సరికదా ఉన్న వాటికి కోత విధిస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందితే దాన్ని నిలదీయడానికి ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబుకు మనసురావడంలేదని అన్నారు. ‘‘గతంలో జరిగిన 5 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చించే తీరిక చంద్రబాబుకు లేదు. అవిశ్వాసం పెట్టమంటే డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేస్తారు’’ అని విమర్శించారు. 

హైదరాబాద్‌కు చంద్రబాబు చేసిందేంటి?

‘‘రాష్ట్రంలో పనిచేసిన ముఖ్యమంత్రులందరికంటే కూడా హైదరాబాద్‌ను తానొక్కడినే అభివృద్ధి చేశానంటారు చంద్రబాబు. పల్లెగా ఉన్నదాన్ని హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలబెట్టానంటారు. సైబరాబాద్‌ను సిటీగా రూపకల్పన చేశానంటారు. అసలు చంద్రబాబు ఏ పరిస్థితిలో ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడంలేదు కానీ 1956 నుంచే అంటే ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడినప్పుడే హైదరాబాద్ దేశంలో 5వ అతిపెద్ద నగరం. ప్రస్తుతం 2012 సంవత్సరంలో కూడా హైదరాబాద్ అదే స్థానంలో ఉంది. ఉస్మానియా యూనివర్సిటికీ వందేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. హెచ్‌సీయూ(హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) నాలుగు దశాబ్దాల కిందటి నుంచే ఉంది. హైదరాబాద్‌కు చాలా సంస్థలను కేంద్రమే తెచ్చింది. అందులో కొన్ని చూస్తే బీహెచ్‌ఈఎల్, హెచ్‌సీఎల్, బీఈఎల్, ఐడీపీఎల్, ఎన్‌ఆర్‌ఎస్‌ఐ, ఎన్‌జేపీ, ఎన్‌పీసీ, ఈసీఐఎల్, ఎన్‌ఎండీసీ, హిందూస్థాన్, ఎస్‌టీపీ, ఎన్‌ఈడీబీ, రక్షణరంగ సంస్థలైన డీఆర్‌డీఓ, డీఆర్‌డీఎల్‌లతో పాటు మిధాని, ఏఐసీటీ లాంటివున్నాయి. బాబు చదువుకునే రోజుల్లోనే ఇవ న్నీ వచ్చాయి. మరి ఆయనిప్పుడు ఏ పరిస్థితిలో మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు’’ అని అన్నారు.

వైఎస్ హయాంలోనే ఐటీ అభివృద్ధి..

చంద్రబాబు పాలనలో కన్నా రాజశేఖరరెడ్డి హయాంలోనే ఐటీ అభివృద్ధి చెందిందని విజయమ్మ వివరించారు. 1995లో ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో 3వ స్థానంలో ఉంటే 2004 సంవత్సరానికి అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి 5వ స్థానానికి దిగజారిందని తెలిపారు. అయితే ఆయన మాత్రం మీడియాను మేనేజ్ చేసుకొని దేశంలోనే హైదరాబాద్ ఐటీ రంగానికి క్యాపిటల్ అని రాయించుకున్నారని విమర్శించారు. రాజశేఖరరెడ్డి పల్లెల్ని, ఐటీని సమానంగా అభివృద్ధి చేశారన్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన ఐఎస్‌బీ(ఇండియన్ బిజినెస్ స్కూల్) వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుందని విజయమ్మ ప్రశ్నించారు. కానీ వైఎస్ ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఐఐఐటీలు తీసుకొచ్చి, గ్రామీణ విద్యార్థులు, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల్లో వెలుగులు నింపాల నే ఆలోచన చేశారన్నారు. వైఎస్ ఒక్క ఐఐఐటీలనే కాదు, జిల్లాకొక యూనివర్సిటీ, హైదరాబాద్‌కు బిట్స్‌పిలానీ ఇలా ఎన్నో చేసిన ప్పటికీ చంద్రబాబు మాదిరిగా ఏనాడూ డప్పుకొట్టుకోలేదని చురకంటి ంచారు. ‘‘చంద్రబాబు హైదరాబాద్ నడిబొడ్డున ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచిపెట్టారు. ఐఎంజీ భారత అనే సంస్థకు 850 ఎకరాలను ఎకరా రూ.50 వేలకే కట్టబెట్టారు. ఎమ్మార్ అనే సంస్థకు 520 ఎకరాలు, రహేజాకు 110 ఎకరాలు పంచిపెట్టారు. ఇదేమని ప్రశ్నిస్తే అభివృద్ధి కోసమంటారు. అదే ఇతరులు చేస్తే దోపిడీ అంటారు’’ అని ధ్వజమెత్తారు.

ఆరు నెలలైనా బెయిల్‌కు అడ్డుపడుతున్నారు..

‘‘కాంగ్రెస్, చంద్రబాబు కలసి వైఎస్ హయాంలో వెలువడిన 26 జీవోల మీద కోర్టుకెళ్లారు. వీటిపై సమాధానం చెప్పాలని నిలదీస్తే ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించింది. దీనిపై కోర్టు విచారణకు ఆదేశించినప్పుడు కేసులో జగన్‌బాబు 52వ ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత సీబీఐ.. ప్రభుత్వం అనే పదాన్ని తప్పించి రాజశేఖరరెడ్డిని చేర్చింది. ఇప్పుడిక జగన్‌బాబు అరెస్టయి ఆరు నెలలవుతున్నా బెయిల్ రాకుండా కాంగ్రెస్, చంద్రబాబు, సీబీఐలు కుట్రలు చేస్తున్నాయి. బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ చార్జిషీట్లు, అనుబంధ చార్జిషీట్లు, ఆస్తుల అటాచ్‌మెంట్ అంటూ జడ్జిలను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారు’’ అని విజయమ్మ విమర్శించారు. దివంగత వైఎస్ అందించిన సువర్ణయుగాన్ని.. జగన్‌బాబు నేతృత్వంలో మళ్లీ తీసుకొద్దామని విజయమ్మ ప్రజలకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కన్వీనర్ బి.జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, నేతలు వై.వి.సుబ్బారెడ్డి, డి.రవీంద్రనాయక్, సంకినేని వెంకటేశ్వరరావు, జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, నల్లా సూర్యప్రకాష్, రహమాన్, జిట్టా బాలకృష్ణారెడ్డి, రాజ్‌ఠాకూర్, విజయారెడ్డి, కొటింరెడ్డి వినయ్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: