ఆ సమయంలో చంద్రబాబు ఎక్కుడున్నారు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ సమయంలో చంద్రబాబు ఎక్కుడున్నారు..

ఆ సమయంలో చంద్రబాబు ఎక్కుడున్నారు..

Written By news on Saturday, December 1, 2012 | 12/01/2012


Unmasking Chandrababu Naidu Contributions
హైదరాబాద్‌ను తానే అభివృద్ది చేశానని, ప్రపంచంలో హైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చానని, తాను ఐటి విప్లవానికి నాంది పలికానని, సెల్ ఫోన్ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తెచ్చానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారు. చంద్రబాబు మాటలనే ఆయన అనుచరులు నమ్మి ప్రచారం చేస్తుంటారు. చంద్రబాబు మాటల్లో ఏ మాత్రం నిజం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాత్రమే తప్ప మరేమీ కాదు.
హైదరాబాద్ 1956లో ఐదో పెద్ద నగరంగా ఉండేది. 2004లో, 2012లో కూడా ఐదో స్థానంలోనే ఉంది. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్దం క్రితానిది. అప్పటికే ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలను హైదరాబాదులో స్థాపించింది. బిహెచ్ఇఎల్, హెచ్ఎంటి, హెచ్ఎఎల్, బిఇఎల్, హిందూస్తాన్ కేబుల్స్, ఐడిపియల్, ఎన్ఆర్ఎస్ఎ, న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్, ఇసిఐఎల్, ఎన్ఎండిసి, ఎస్టీపి, సిఎంసి, ఎన్ఎఫ్డిబి వచ్చాయి.
వాటికి తోడు, పౌర, రక్షణ రంగాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ లాబోరేటరీలు హైదరాబాదులో వెలిశాయి. డిఎంఆర్ఎల్, డిఆర్‌డిఎల్, డిఎల్ఆర్ఎల్, డిఆర్‌డివో, ఐఐసిటి, సిసిఎంబి వంటి వచ్చాయి. మిగతా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యూనిట్లు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తే మన రాష్ట్రంలో మాత్రం హైదరాబాద్, దాని పరిసరాల్లోనే కేంద్రీకరించారు. ఇందుకు గల కారణమేమిటో తెలియదు. ప్రభుత్వ రంగ సంస్థలకు అనుబంధంగా వచ్చిన ప్రైవేట్ సంస్థలు సహజంగానే వాటికి సమీపంగా వెలిశాయి.
ఐడిపియల్ కారణంగానే హైదరాబాద్ భారత బల్క్ డ్రగ్ రాజధానిగా రూపుదిద్దుకుంది. 90 శాతానికి పైగా ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు హైదరాబాదులోని వచ్చాయి. ఈ అభివృద్ధి అంతా చంద్రబాబు నాయుడు హైస్కూల్లో ఉన్నప్పుడే జరిగింది. పిచ్చి వాళ్ల స్వర్గంలో ఉన్నవారు మాత్రమే హైదరాబాద్ అభివృద్ధి తమదని చెప్పుకుంటారు.
దేశంలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ విస్తృతికి దోహదం చేసిన ఇసిఐఎల్, కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పోరేషన్ (సిఎంసి) కేంద్ర కార్యాలయాలు హైదరాబాదులో ఉన్నాయి. దానివల్లనే పివి నరసింహారావు ప్రభుత్వం దేశంలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమను అభివృద్ధి చేయవచ్చునని భావించి, 1991లో ఆరు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులను (ఎస్టిపిలను) ఏర్పాటు చేసింది. మొదటి ఎస్టీపి హైదరాబాదుకు వచ్చింది. చెన్నైకి ఇటీవల దాకా అది రాలేదు. ప్రపంచంలో నాలుగో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ సత్యం కంప్యూటర్స్ 1990 ప్రారంభంలో ఏర్పడింది. ఆ సమయంలో చంద్రబాబు ఎక్కుడున్నారు.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి తానే కర్తనని చెప్పుకునే హక్కు చంద్రబాబుకు లేదు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వై2కెలో పాశ్చాత్య దేశాల్లో భారత సాఫ్ట్‌వేర్ నిపుణులకు మంచి అవకాశాలు లభించాయి. చంద్రబాబుకు అవకాశాన్ని అందిపుచ్చుకునే సమర్థత ఉంటే, బల్క్ డ్రగ్స్‌లో మాదిరిగా దేశంలో అతి పెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతి కేంద్రంగా రాష్ట్రాని తీర్చిదిద్ది ఉండేవారు. అది జరగలేదు. పైగా 1995లో సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో రాష్ట్రం మూడో స్థానాన్ని పొందింది. అది కాస్తా 2004 నాటికి ఐదో స్థానానికి పడిపోయింది.
సాఫ్ట్‌వేర్ ఎగుమతుల విలువ బెంగళూర్, హైదరాబాద్ మధ్య అంతరం 1995 - 96లో 250 కోట్ల రూపాయలు ఉండేది, అది 2003 - 2004 నాటికి 2,500 కోట్ల రూపాయలకు పెరిగింది. చంద్రబాబు అధికారం కోల్పోయేనాటికి పరిస్థితి అది. భారత సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 9 శాతం మాత్రమే కాగా, కర్ణాటక వాటా 38 శాతం. హైదరాబాద్ భారత ఐటి రాజధానిగా రూపుదిద్దుకుందని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. దాన్ని మీడియా ఊదరగొట్టింది. కర్ణాటక, తమిళనాడు సాఫ్ట్‌వేర్ రంగంలో అద్భుతమైన కృషి చేశాయి. ఆ రాష్ట్రాలు ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు. సాఫ్ట్‌వేర్ ఎగుమతులు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 9 శాతం నుంచి 2008 - 2009 నాటికి 14 శాతానికి పెరిగాయి. దాన్ని వైయస్ ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు.
చంద్రబాబు చెప్పుకునేదొకటే, తాను ఐసిబి (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)ని హైదరాబాద్‌కు తెచ్చానని. ఐసిబి వల్ల ఆర్థికంగా, సామాజికంగా రాష్ట్రానికి, పోనీ హైదరాబాదుకు ఏమైనా ప్రయోజనం కలిగిందా, దానితో ప్రయోజనం పొందింది ఎవరు అనేది ప్రశ్న. చంద్రబాబు మాదిరిగా కాకుండా వైయస్ రాజశేఖర రెడ్డి ఐఐటిలను ప్రోత్సహించారు. 18 కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఆ క్రెడిట్ అంతా పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, ఐటి శాఖకు చెందుతుందని వైయస్ చెప్పేవారు. ఈ అభివృద్ధి అంతా రాజకీయ నాయకుల వల్ల జరగలేదని, పిల్లలూ వారి తల్లిదండ్రులు చెమటోడుస్తున్నారని, ప్రభుత్వం వారికి సౌకర్యాలు, వెసులుబాటు కల్పిస్తోందని అనేవారు. చంద్రబాబుకు, వైయస్‌కు మధ్య ఉన్న పెద్ద తేడా అదే.
చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ మఖ్యమంత్రిగా ఉండి చిత్తూరు జిల్లాకు చెందిన తన సన్నిహిత మిత్రుడు బిల్లీరావుకు 2500 కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన హైదరాబాదులోని అత్యంత ముఖ్యమైన 850 ఎకరాల భూమిని 400 కోట్ల రూపాయలకే కట్టబెట్టారు. అలాగే, 535 ఎకరాల భూమిని మార్కెట్ విలువ ఎకరానికి 3 కోట్ల రూపాయలు ఉండగా 29 లక్షల రూపాయల ధరకే ఎమ్మార్‌కు ఇచ్చారు.
ఆల్విన్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతకు చంద్రబాబు నాయుడే బాధ్యుడు. వాటిని చాలా వరకు తనకు అత్యంత సన్నిహితులైనవారికే కట్టబెట్టారు.
- డి.ఎ సోమయాజులు (వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యవహారాల, కేంద్ర పాలక మండలి సభ్యుడు)గురువారెడ్డి (అట్లాంటా). సివిఆర్ మూర్తి (హైదరాబాద్)లతో కలిసి.
Share this article :

0 comments: