ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై వైఎస్సార్ సీఎల్పీ డిమాండ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై వైఎస్సార్ సీఎల్పీ డిమాండ్

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై వైఎస్సార్ సీఎల్పీ డిమాండ్

Written By news on Friday, November 30, 2012 | 11/30/2012

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులకు చట్ట బద్ధత కల్పిస్తే సరిపోదని, ఆ వర్గాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం డిమాండ్ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్షం నాయకురాలు వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును సీఎల్పీ సమావేశం ఆహ్వానించింది. సమావేశం వివరాలను శాసన సభాపక్ష ఉప నాయకులు భూమా శోభా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని కోరిన విజయమ్మ

శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏర్పాటు చేసిన బీఏసీ(సభా కార్యక్రమాల సలహా మండలి) భేటీలో విజయమ్మ పాల్గొన్నారని, సబ్‌ప్లాన్ బిల్లుపై చర్చకు ఈ సమయం చాలదని, కనీసం మరో రెండు రోజులు పొడిగించాలని కోరారని తెలిపారు. అన్ని పక్షాలు కోరిన మీదట మరో రోజు అసెంబ్లీని పొడిగించారని వెల్లడించారు. గతంలో ఏ పార్టీ గాని, ఏ ముఖ్యమంత్రి గానీ చేయని విధంగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించారని, గత 20 ఏళ్ల వివరాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని శోభా నాగిరెడ్డి అన్నారు. ఆయన పాలనలోనే ఆ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా బలపడ్డాయని, అందుకే వైఎస్సార్ కాంగ్రెస్‌కు వారంతా మద్దతుగా నిలిచారన్నారు. ఈ బిల్లుపై తమ పార్టీ ఎమ్మెల్యేలు చురుగ్గా చర్చలో పాల్గొని నిర్మాణాత్మక సూచనలు చేస్తారని చెప్పారు. 

కాగితాలకే పరిమితం చేయొద్దు..

శ్రీనివాసులు మాట్లాడుతూ.. చట్టబద్ధత కల్పించే ప్రయత్నాన్ని తాము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని, అయితే దీనిని కాగితాలకే పరిమితం చేయరాదని కోరారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధుల వ్యయానికి సంబంధించి ఏ విధమైన చట్టబద్ధత ఇస్తారనే విషయంలో స్పష్టత లేదన్నారు. శాసనసభాపక్షం సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ముఖ్య నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, ఎస్.రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, తెల్లం బాలరాజు, భూమన కరుణాకర్‌రెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు.
Share this article :

0 comments: