మానవత్వం లేని ప్రభుత్వం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మానవత్వం లేని ప్రభుత్వం

మానవత్వం లేని ప్రభుత్వం

Written By news on Thursday, October 31, 2013 | 10/31/2013

* ముందస్తు చర్యలు చేపడితే ఇంతనష్టం జరిగేది కాదు
* బాధితులకు సాయం అందించడంలో విఫలం
* ఇళ్లు కూలిపోయిన వారికి ప్రభుత్వమే ఇళ్లు కట్టించాలి
* కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పేదలు, రైతులను ఆదుకుంటాం
 
సాక్షి, శ్రీకాకుళం, విజయనగరం: ‘రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. కోస్తా జిల్లాలు అతలాకుతలమయ్యాయి.  53 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికీ కొన్ని కాలనీలు నీటి ముంపులోనే ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు.  అధికారులు నష్టాల వివరాలు సేకరించలేదు. భారీ వర్షాలు వచ్చిన వారం రోజుల తరువాత ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చారు. కనీసం ఏరియల్ సర్వే కూడా చేయలేదు. బాధితులకు తక్షణ సాయం అందించాలని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు.

బుధవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించిన విజయమ్మ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరుసగా వచ్చిన నాలుగు తుపాన్లతో అన్ని వర్గాల వారు నష్టపోయారని, నీలం తుపాను బాధితులకు ఇంతవరకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పర్యటన సందర్భంగా పలువురు రైతులు ఈ విషయాన్ని తనదృష్టికి తీసుకొచ్చారన్నారు. గతంలో వచ్చిన లైలా, జల్, నీలం తుపానుల కంటే ఇప్పటి పై-లీన్ తుపాన్, భారీ వర్షాలతో నష్టం తీవ్రంగా ఉందన్నారు.
వైఎస్ హయాంలో తుపానులు వస్తున్నాయంటేనే ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారని, దీనివల్ల ఆస్తి, ప్రాణనష్టం అంతగా జరిగేది కాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోగా, బాధితులకు పరిహారం అందజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వారు కనీసం పరామర్శలకు కూడా నోచుకోవడం లేదని ఆరోపించారు. ఎంత నష్టం జరిగిందో కూడా అధికారులు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు, కనీసం మత్స్యకారులు, ఇళ్లు కూలిపోయినవారికి కిరోసిన్, 20 కిలోల బియ్యం ఇచ్చే సంప్రదాయాన్ని కూడా పాటించలేదు.

ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదో అర్థం కావడం లేదన్నారు. హుడా కమిటీ చెప్పినట్టు ఎకరాకు 10 వేలు పరిహారం, తిరిగి పంటలు వేసుకోడానికి ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఇళ్లు, సామాన్లు కోల్పోయిన వారి పిల్లల స్కూల్ ఫీజులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. వరదలు, కరువు వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ 6 వేలు ఉత్పాదక రాయితీ అందించాలన్నారు. వైఎస్సార్ సీపీ రైతుపక్షాన పోరాడి రుణమాఫీ చేయించేలా పోరాడుతుందని చెప్పారు.

ప్రభుత్వానికి న ష్టాల నివేదిక
భారీ వర్షాల కారణంగా ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందనే వివరాలతో రాష్ర్ట ప్రభుత్వంతోపాటు, ప్రధాని, కేంద్రవ్యవసాయమంత్రికి కూడా నివేదిక అందజేస్తామని విజయమ్మ పేర్కొన్నారు. బాధిత రైతుల కష్టనష్టాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం, వారికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. ‘జగన్‌బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అందర్నీ ఆదుకుంటారు. వైఎస్సార్ మాదిరిగా  రైతులకు మేలు చేస్తారని చెప్పారు. కోర్టు షరతుల కారణంగా రాలేకపోయారు.

కష్టాల్లో ఉన్న ప్రజల్ని పరామర్శించి, ధైర్యం నింపాలని నన్ను ఇక్కడికి పంపించారు. అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. కష్టాల్లో, బాధల్లో జగనెప్పుడూ అండగా ఉంటారు.  మీ కోసమే ఆలోచన చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తారు’ అని ప్రజలకు  భరోసా ఇచ్చారు. విజయమ్మ పర్యటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ కొణతాల రామకృష్ణ, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయకృష్ణ రంగారావు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కన్వీనర్లు ధర్మాన కృష్ణదాస్, పెనుమత్స సాంబశివరాజు, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యులు కణితి విశ్వనాథం, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.

బస్సు ప్రమాద ఘటనపై సంతాపం
బస్సు దగ్ధమై 45 మంది సజీవ దహనమైన ఘోర దుర్ఘటనపై విజయమ్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న వోల్వో బస్సు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట వద్ద కాలిపోయిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
Share this article :

0 comments: