బిల్లుపై చర్చ సందర్భంగా 9072 సవరణలు వచ్చాయని స్పీకర్ తెలిపారు. ఈ రికార్డులను భారత ప్రభుత్వానికి, రాష్ట్రపతికి పంపుతామన్నారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభ వాయిదా పడగానే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర నినాదాలు చేసుకుంటూ సభ నుంచి బయటకు వచ్చారు.
కాగా, బిల్లు గురించి కేవలం 86 మంది సభ్యులు మాత్రమే సభలో మాట్లాడగలిగారు. చివరి మూడు రోజులు తీవ్రమైన గందరగోళం తప్ప సభ కొద్దిసేపు కూడా సజావుగా సాగలేదు. 150 మంది సభ్యులు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను స్పీకర్ కు ఇచ్చారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపుతామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పార్టీలకు అతీతంగా ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేలు చీలిపోయారు. ఒక్క ఎమ్మెల్యే కూడా కుర్చీలలో కూర్చోలేదు. అంతా లేచి స్పీకర్ పోడియం వద్ద చేరుకున్నారు.
తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరగలేదని...బిల్లు ఓడిపోలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన తీర్మానంపై మాత్రమే ఓటింగ్ జరిగిందని... దాన్ని అందరూ గమనించాలని ఆయన గురువారమిక్కడ అన్నారు. విభజన బిల్లుపై ఫైటింగ్ జరగలేదని... సభ అభిప్రాయం కోసమే బిల్లు పంపామన్నారు. అసెంబ్లీలో రాజ్యాంగ ప్రక్రియ ముగిసిందని అన్నారు.
దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఓ కీలక ఘట్టం ముగిసిందని దిగ్విజయ్ అన్నారు. కేంద్ర కేబినెట్ లో చర్చ అనంతరం పార్లమెంట్ లో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఆర్టికల్-3 ప్రకారమే ముందుకు వెళతామన్నారు. అసెంబ్లీ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిందన్నారు.
ఇరు ప్రాంతాల కాంగ్రెస్ సభ్యుల్లో పరస్పర అభిప్రాయాలు ఉన్నందున... సభలో వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా వెలువరించేందుకు పార్టీ అవకాశం కల్పించిందన్నారు. వచ్చిన సవరణల్లో ఆమోదయోగ్యంగా ఉన్నవాటిని బిల్లులో చేర్చే విషయాన్ని కేబినెట్ చూసుకుంటుందన్నారు. పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తామన్న నమ్మకం ఉందని దిగ్విజయ్ ఆశాభావం వక్యతం చేశారు.
0 comments:
Post a Comment