అనంతపురం : పీజీ చేసినా తనకు నిరుద్యోగ భృతి మాత్రం అందడం లేదని సుధాకర్ అనే రైతు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వడ్డీతో కలిపి రూ. 47వేల రుణం ఉన్నా, రుణమాఫీ మాత్రం వర్తించలేదని కన్నీరు పెట్టుకున్నారు. మనోధైర్యంతో ఉండాలని సుధాకర్ కు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రైతు భరోసాయాత్రలో భాగంగా ఐదోరోజు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద ఆకులేడు రామచంద్రారెడ్డి అనే రైతు కూడా తన సమస్యను చెప్పుకొన్నాడు. రుణమాఫీ అనడం వల్లే చంద్రబాబుకు రైతులు మద్దతు తెలిపారని, ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి 10 మాసాలైనా రుణమాఫీ కాలేదని ఆవేదన చెందారు.
రుణాలు బాగా చెల్లించే రైతులకు 4 శాతం వడ్డీ మాఫీ అమలయ్యేదని, చంద్రబాబు హామీవల్లే రుణం కట్టకపోవడంతో ఇప్పుడు 14 శాతం వడ్డీ కట్టాలంటున్నారని చెప్పారు. తామేం చెయ్యాలంటూ వైఎస్ జగన్ వద్ద రైతు రామచంద్రారెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. రామరాజపల్లిలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పుల్లారెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. హిందూపురం, పుట్టపర్తి, ఉరవకొండ, శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఆయన గురువారం పర్యటించారు.
0 comments:
Post a Comment