ఐదేళ్లలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు రెట్టింపు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఐదేళ్లలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు రెట్టింపు!

ఐదేళ్లలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు రెట్టింపు!

Written By news on Tuesday, July 24, 2012 | 7/24/2012

ఐదేళ్లలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు రెట్టింపు!
పెరిగిపోతున్న వాహనాలూ, ఇంధనంలో కల్తీ 
రోజుకు నగరంలో తయారవుతున్న 4 వేల 
టన్నుల చెత్త.. విషవాయువులను చిమ్ముతోంది
ప్రమాదకరంగా మారిన పంజగుట్ట, చార్మినార్, 
లంగర్‌హౌస్, నాచారం, ప్యారడైజ్, కూకట్‌పల్లి చౌరస్తాలు

హైదరాబాద్‌లో అన్నీ దొరుకుతాయి.. స్వచ్ఛమైన గాలి తప్ప.. నిజం.. ట్రై చేసి చూడండి.. ఎక్కడైనా దొరుకుతుందేమో..ఇటు పంజగుట్టకు పోయినా... అటు చార్మినార్ చుట్టొచ్చినా.. కూకట్‌పల్లి మొత్తం కలియదిరిగినా.. ప్చ్.. చాన్సే లేదు.. ఎందుకంటే ఇక్కడ నో ఆక్సిజన్.. అంతా కార్బన్ డయాక్సైడే ఈ నగరంలో పీల్చే గాలి విషం.. తాగే నీరు కాలుష్యమయం..

హైదరాబాద్, న్యూస్‌లైన్:హైదరాబాద్‌లో మోటర్‌సైకిల్‌పై ఓ అయిదు కిలోమీటర్లు తిరిగి చూడండి.. ఈ నగరపు కాలుష్యం ఎంతో మీకే తెలుస్తుంది. జుట్టు కాపాడుకోవాలని తలకు చుట్టుకునే రుమాలును దులిపి చూడండి... ఇక్కడి గాల్లో ఎంత విషం నిండి ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఆఫీసు నుంచి తిరిగొచ్చాక ముఖంపై చిలకరించుకునే నీళ్ల రంగు నల్లగా మారిపోతూంటే అబ్బో ఎంత మురికో అని ఆశ్చర్యపోతూంటాం గానీ... ఈ గాలి కాలుష్యం మన శరీరానికి చేస్తున్న చేటు ఎంతన్నది మాత్రం మరచిపోతూంటాం. అందుకే ఈ అభాగ్య నగరిలో ఏటికేడాదీ శ్వా సకోశ సంబంధ వ్యాధులు పెరిగిపోతున్నాయి... నిద్రలేమి, తర చూ నిస్సత్తువ... భగభగ మండే కళ్లు నిత్యకృత్యమవుతున్నాయి!

ప్రమాదం ముంచుకొస్తోంది...: నగరంలోని ప్రధాన కూడళ్లలో వాహన కాలుష్యం విపరీతంగా ఉందన్నది నిష్టుర సత్యం. వాయు కాలుష్యాన్ని లెక్క వేసేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నగరంలోని 24 కూడళ్లలో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా సేకరించిన సమాచారాన్ని చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. వాహనాలు వదిలే పొగ, పరిశ్రమల నుంచి వెలువడే వాయువులు ఇతర మార్గాల ద్వారా గాల్లో కలుస్తున్న సూక్ష్మాతిసూక్ష్మమైన పదార్థాలు నిర్ణీత మోతాదుకు కనీసం 50 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ గణాంకాలే చెబుతున్నాయి. రెస్పిరెబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ (ఆర్‌ఎస్‌పీఎం) అని పిలిచే ఈ పదార్థాలు ఒక ఘనపు మీటర్‌కు 60 మైక్రోగ్రాముల వరకూ ఉన్నా ఇబ్బంది ఉండదు. కానీ నగరంలోని కొన్ని కూడళ్లలో ఇది 90 మైక్రోగ్రాములు మించిపోతోంది. ఇది నగరం మొత్తమ్మీద ఒక ఏడాది సగటు.. రోజువారీ లెక్కలు తీస్తే కూకట్‌పల్లి, బాలానగర్, ఉప్పల్ చార్మినార్, లంగర్‌హౌస్ వంటి ప్రాంతాల్లో ఈ సంఖ్య వందకంటే ఎక్కువగా ఉందని అంచనా. పది మైక్రోమీటర్ల కంటే తక్కువ సైజున్న ఆర్‌ఎస్‌పీఎం నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుకుని శ్వాసకోశ సంబంధ వ్యాధులకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తూండటం ఇక్కడ గమనార్హం.

ఎక్కడిదీ కాలుష్యం!

దేశంలోనే అత్యధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలున్న నగరంగా హైదరాబాద్‌కు ఒక రికార్డు ఉంది. ఇక్కడే వస్తోంది చిక్కంతా. రెండేళ్ల క్రితం అంటే 2010 మార్చి 31 నాటికి ఈ రాష్ట్రంలోని మొత్తం వాహనాల సంఖ్య దాదాపు 92 లక్షలు! వీటిలో దాదాపు 14 లక్షలు ప్రజా రవాణా కోసం ఉపయోగించేవి కాగా... వ్యక్తిగత అవసరాల కోసం వాడేవి (కార్లు, మోటర్‌బైక్‌లు, ట్రాక్టర్లు వంటివి) 78 లక్షల వరకూ ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వాహనాల సంఖ్య కోటి దాటి ఉంటుందని, ఒక్క భాగ్య నగరంలోనే 30 లక్షల వాహనాలు నిత్యం తిరుగాడుతూ ఉంటాయని అంచనా. నగరంలో వాయు కాలుష్యం పెరిగిపోయేందుకు ఏటా పెరిగిపోతున్న వాహనాల సంఖ్య ఒక కారణమైతే... చాలావరకూ వాహనాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం మరో కారణం. హైదరాబాద్‌లో తిరుగాడుతున్న వాటిల్లో కాలం చెల్లినవి, నిర్వహణ సక్రమంగా లేనివి కనీసం 25 శాతం అంటే దాదాపు 7.5 లక్షల వరకూ ఉంటాయి. 

వీటిల్లో ఇంధనం సక్రమంగా మండదు. ఫలితంగా కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, పాలీసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్లు, సల్ఫేట్లు, నైట్రేట్లు వంటి విష వాయువులు ఎక్కువ మోతాదులో గాల్లో కలుస్తూంటాయి. కాలుష్యం పెరుగుదలకు వాహనాల నిర్వహణ లేమి ఒక కారణమైతే... ఇంధన కల్తీ మరో కారణం. ఆటోవాలాలు, లారీ డ్రైవర్లు తక్కువ ధరకు వచ్చే సబ్సిడీ కిరోసిన్‌ను పెట్రోలు, డీజిళ్లతో కలిపి వాడుతూండటం వల్ల ఈ వాహనాల నుంచి వెలువడే పొగలో సీసం ఎక్కువ మోతాదులో ఉంటోంది. పెట్రోలు, డీజిళ్లలో సీసం మోతాదును గణనీయంగా తగ్గించి విక్రయిస్తున్నప్పటికీ వీటిని నేరుగా వాడక పోవడం వల్ల సమస్య ఎదురవుతోంది. 

చెత్తతోనూ చిక్కులే!

ఏ నగరం చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం... నగరవాసి జీవితం సమస్తం చెత్తతో అస్తవ్యస్తం! మహాకవి శ్రీశ్రీ కవితకు పేరడీగా అనిపించవచ్చుగానీ... నగరంలోని ఏ వీధిని చూసినా కనిపించే చెత్తా చెదారం ఇది వాస్తవమేనని స్పష్టం చేస్తుంది. నగరం మొత్తమ్మీద రోజుకు కనీసం నాలుగు వేల టన్నుల చెత్త విడుదల అవుతోందని అంచనా. ఇందులో డంపింగ్ యార్డుల్లోకి చేరేది కొంతే. మిగిలిన దాంట్లోని సేంద్రీయ పదార్థాలు వీధుల్లో కుళ్లిపోయి కార్బన్‌డయాక్సైడ్, మీథేన్ వంటి ప్రమాదకరమైన వాయువులను వెదజల్లుతున్నాయి. ప్లాస్టిక్, వాడేసిన బ్యాటరీలు, గాజు, లోహపు ముక్కల కారణంగా మరింత ప్రమాదమేర్పడుతోంది. చెత్తను వదిలించుకునే క్రమంలో పది నుంచి 20 శాతం మోతాదును నిర్ణీత పద్ధతిలో మండించకపోవడం వల్ల విష వాయువులు మరింత ఎక్కువ అవుతున్నాయి. 

ఈ ప్రాంతాల్లో మహా డేంజర్!

ప్రధానంగా పంజగుట్ట, చార్మినార్, లంగర్‌హౌస్, నాచారం, ప్యారడైజ్, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ ప్రాంతాల్లో హానిపూరిత వాయువుల విడుదల ఎక్కువగా ఉన్నట్లు ఆయా స్టేషన్ల నుంచి సేకరించిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అత్యంత రద్దీగా ఈ ప్రాంతాలు కావడం, తరచూ ట్రాఫిక్‌జామ్‌లు కావడంతో కాలుష్యం మోతాదు ఎక్కువవుతోంది. విచ్చలవిడిగా జరిగే భవన నిర్మాణాలు, వాటి వ్యర్థాలు, చెత్తను తగలబెడుతుండడం వంటివి గాలి స్వచ్ఛతపై ప్రభావం చూపుతున్నాయి. జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడల నుంచి వెలువడే ఉద్గారాలు కాలుష్యం ముప్పు పెరిగేందుకు దోహదపడుతున్నాయి. 

బూరేలాల్ కమిటీ నివేదికలు బుట్టదాఖలు...

హైదరాబాద్‌తోపాటు దేశంలోని మహానగరాల్లో వాయుకాలుష్యాన్ని అధ్యయనం చేసేందుకు 2006లో సుప్రీంకోర్టు పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణ అథారిటీ అధ్యక్షుడు డాక్టర్ బూరేలాల్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ హైదరాబాద్‌లో అధ్యయనం జరిపి కాలుష్యానికిగల కారణాలను వివరిస్తూనే పరిష్కార మార్గాలను సూచించింది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, సీఎన్‌జీ వాహనాల సంఖ్యను పెంచ డం, ట్రాఫిక్ జామ్ చిక్కుల్ని తగ్గించడం ద్వారా వాయు కాలుష్యా న్ని నియంత్రించవచ్చునని సూచించింది. అయితే ఈ సిఫారసుల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం దురదృష్టకరం. ఎన్నో ఒడిదుడుకుల తరువాత పట్టాలెక్కిన మెట్రో రైల్ వ్యవస్థ వాస్తవరూపం దాల్చేందుకు మరో ఐదేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో అప్పటివరకూ నగరవాసి కాలుష్యం కాటుకు బలవుతూ ఉండాల్సిందే!

‘‘హైదరాబాద్ నగరంలో శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఏటికేడాది పెరిగిపోతున్నాయి. వాయు కాలుష్యం కారణంగా వచ్చే ఈ రకమైన వ్యాధులు గత ఐదేళ్లలో దాదాపు రెట్టింపు అయ్యాయి. వాహనాల పొగ ద్వారా గాల్లో కలుస్తున్న పార్టిక్యులేట్ మ్యాటర్ ముక్కు, గొంతుల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరడం దీనికి కారణం. వాయు కాలుష్యం వల్ల అలర్జీలు, ఉబ్బసం వ్యాధులు కూడా వచ్చే అవకాశముందని ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.’’
- జి.సురేశ్ బాబు, నీలోఫర్ ఆసుపత్రి వైద్యుడు

కార్బన్‌మోనాక్సైడ్: శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ అందించే పనిని కష్టం చేస్తుంది. సాధారణంగా దీని మోతాదు నాలుగు పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) అంటే పదిలక్షల గాలికణాల్లో నాలుగు కార్బన్ మోనాక్సైడ్ కణాలు ఉన్నా ప్రమాదం ఉండదు. ఇంతకంటే ఎక్కువైతే మాత్రం శరీరంలో ఆక్సిజన్ మోతాదు తగ్గి నిస్సత్తువ ఆవరిస్తుంది.

కార్బన్‌డయాక్సైడ్: బొగ్గుపులుసు వాయువని పిలుస్తాం. వాహనాలతోపాటు సిమెంట్ ఉత్పత్తి, మన ఊపిరి ద్వారా కూడా గాల్లో కలుస్తూంటుంది. ప్రస్తుతం గాల్లోని బొగ్గుపులుసు వాయువు మోతాదు సగటున 390 పీపీఎంగా ఉన్నట్లు అంచనా. 

సల్ఫర్ ఆక్సైడ్లు: పెట్రోలు, డీజిళ్లలో కొంతమోతాదులో సల్ఫర్ (గంధకం) ఉంటుంది. వాహనాల్లో మండినప్పుడు ఇది సల్ఫర్ డయాక్సైడ్‌గా మారుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్‌ల సమక్షంలో మరింత ఆక్సిజన్ చేరినప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారుతుంది. గాల్లోని సల్ఫర్ ఆక్సైడ్ల మోతాదు ఘనపు మీటర్‌కు 80 మైక్రోగ్రాములు వరకూ ఉండవచ్చు. 

నైట్రోజన్ ఆక్సైడ్లు: అత్యధిక ఉష్ణోగ్రతల్లో జరిగే దహన ప్రక్రియ ద్వారా వెలువడతాయి. గాల్లో సగటున రోజుకు ఘనపుమీటర్‌లో 80 మైక్రోగ్రాముల వరకూ ఉండవచ్చు.

సీసం: నాడీ వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. కల్తీ ఇంధనాలతోపాటు వాడి పడేసిన బ్యాటరీల ద్వారా వాతావరణంలోకి కలుస్తుంది. దీర్ఘకాలం పాటు ఈ వాయువును పీలిస్తే మధ్యవయస్కుల్లో రక్తపోటు, రక్తహీనత వచ్చే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భిణులు ఈ వాయువును ఎక్కువగా పీలిస్తే గర్భస్రావమయ్యే అవకాశముంది. 

అస్థిర సేంద్రీయ సమ్మేళనాలు: ప్రధానంగా చెత్తాచెదారం కుళ్లిపోయే క్రమంలో వెలువడే వాయువులు ఇవి. వీటిల్లో రెండు వర్గాలు ఉన్నాయి. మీథేన్ సంబంధిత సమ్మేళనాలు ఒక వర్గమైతే, బెంజీన్, టౌలీన్, జైలీన్ వంటి మీథేనేతర వాయువులు రెండో వర్గం. రెండో వర్గం వాయువులను పీల్చడం వల్ల దీర్ఘకాలంలో కేన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది. 

పార్టిక్యులేట్ మ్యాటర్: గాల్లో తేలియాడే సూక్ష్మమైన ఘన, ద్రవ పదార్థాలను పార్టిక్యులేట్ మ్యాటర్ అంటారు. గాల్లో వీటి మోతాదు ఎక్కువైతే గుండె సంబధిత వ్యాధులు వచ్చే అవకాశముంటుంది. ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపడంతోపాటు కొన్నిసార్లు కేన్సర్‌కూ కారణమవుతాయి. 

ఇవే కాకుండా... సీసం, కాడ్మియం, రాగి వంటి లోహాలు, వాహన కాలుష్యం ద్వారా వెలువడే ఓజోన్, రిఫ్రిజరేటర్ల ద్వారా విడుదలయ్యే క్లోరోఫ్లూరో కార్బన్స్ కూడా వాయు కాలుష్యం పెరిగిపోయేందుకు కారణమవుతున్నాయి!
Share this article :

0 comments: