ఒప్పందం మేరకే ఒడ్డుకు చేర్చారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒప్పందం మేరకే ఒడ్డుకు చేర్చారు

ఒప్పందం మేరకే ఒడ్డుకు చేర్చారు

Written By news on Sunday, December 9, 2012 | 12/09/2012

 ఎంపీలను ‘ఎన్ని లారీల వంద నోట్ల కట్టలకు..’ అమ్ముకున్నారో చెప్పాలి
* కాంగ్రెస్, బాబుల మధ్య సుజనాచౌదరి రాయబారం

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజ్యసభలో ఓటింగ్‌కు డుమ్మా కొట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. చంద్రబాబు చీకటి ఒప్పందంలో భాగంగానే రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలపై వారు కాంగ్రెస్‌కు మద్దతునిచ్చి ప్రభుత్వాన్ని ఒడ్డుకు చేర్చారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గట్టు మాట్లాడారు. కాంగ్రెస్ కూటమిలో చంద్రబాబు ఒక భాగస్వామిగా చేరిపోయారన్నారు. 

‘‘ఎఫ్‌డీఐలపై చర్చ జరిగేటప్పుడు సభలోనే ఉన్న టీడీపీ సభ్యులు ఓటింగ్ సమయానికి గైర్హాజరవడంలో ఆంతర్యమేమిటి? చంద్రబాబుకు ఆత్మగా వ్యవహరించే సుజనాచౌదరి ఎందుకు డుమ్మా కొట్టారు. ఆత్మ.. చంద్రబాబుకు తెలియకుండా అమ్ముడుపోయిందా! లేక చంద్రబాబే ఆత్మను అమ్ముకున్నారా’’ అని నిలదీశారు. చంద్రబాబు ఆ ముగ్గురు ఎంపీలను ‘ఎన్ని లారీల వందనోట్ల కట్టలకు’ అమ్ముకున్నారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు బినామీగా పేరొందిన సుజనాచౌదరి ఆయనకు తెలియకుండా ఏపనీ చేయరని, ఎంపీ అయిననాటి నుంచి ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి చంద్రబాబుకు మధ్య రాయబారం నడుపుతున్నారని తెలిపారు.

హెరిటేజ్‌తో మొదలుకొని కోకాపేట భూముల దాకా సుజనాచౌదరి చంద్రబాబుకు బినామీగా, నమ్మినబంటుగా ఉంటూ ఆర్థికంగా సహాయ సహకారాలందిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబుకు తెలిసే తాము డుమ్మా కొట్టామని ఎంపీ దేవేందర్‌గౌడ్ స్పష్టంగా చెప్పారని.. కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కుకు ఇంతకన్నా మరేం నిదర్శనం కావాలని గట్టు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నందువల్లే చంద్రబాబుపై కేసులు ఉండవు, సీబీఐ విచారణా జరపరని, ఇది రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న ‘క్విడ్ ప్రో కో’ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీకి అధ్యక్షుడిగా ఉండి.. అదే పార్టీతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని బాహాటంగా అంటకాగుతూ ఎన్టీఆర్ అభిమానులను చంద్రబాబు క్షోభకు గురిచేశారన్నారు. 

ఒక వర్గం మీడియా, కొందరు టీడీపీ నేతలు చంద్రబాబును రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బాబు వ్యూహం మేరకే వారీ కొత్త ప్రచారానికి తెరదీశారని దుయ్యబట్టారు. ‘ఒక పక్క ఆ ఎంపీలు రాజీనామా చేయాలని టీడీపీ నేతలే అంటారు... మరోపక్క ఆ ఎంపీలు చంద్రబాబుకు చెప్పే గైర్హాజరయ్యామంటారు.. ఆ విధంగా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు...’ అని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలు పన్నడంలో చంద్రబాబును మించిన వ్యక్తి ప్రపంచంలోనే లేరని గతంలో ఒక బ్రిటన్ సంస్థ వెల్లడించిన విషయాన్ని గట్టు ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

హెరిటేజ్‌తో లబ్ధి పొందేందుకు కుట్ర
రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐల బిల్లుకు ఆమోదం పొందేలా చేసిన చంద్రబాబు.. 16 కోట్ల మంది చిల్లర వర్తకులు రోడ్డున పడేలా చేశారని గట్టు మండిపడ్డారు. ‘చిల్లర వర్తకంలో హెరిటేజ్ సంస్థను భాగస్వామిగా చేర్చేందుకే ఆయన ఈ రకంగా వ్యవహరించారా?’ అని నిలదీశారు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతున్న ఒక దినపత్రిక ఈ విషయమై ఈనెల 6వ తేదీన ఒక కథనం వెల్లడించిందని తెలిపారు. విదేశీ పెట్టుబడులు రాగానే హెరిటేజ్‌ను ఒక అనుబంధ సంస్థగా చేర్చి లబ్ధిపొందేందుకు బాబు కుట్ర పన్నారని గట్టు తెలిపారు.

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు
‘‘ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా రాజ్యసభలో విపక్షాలు ప్రవేశ పెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు గైర్హాజరయ్యేలా కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కైంది. ఎఫ్‌డీఐల వల్ల దేశంలో రైతుల దగ్గర నుంచి చిల్లర వర్తకుల వరకు తీవ్రంగా నష్టపోతారు. దీన్ని గ్రహించే వైఎస్సార్‌సీపీ ప్రజాభీష్టానికి అనుగుణంగా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఎఫ్‌డీఐలను ఒకవైపు టీడీపీ వ్యతిరేకిస్తూనే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు తమ ఎంపీలను డుమ్మాకొట్టేలా వ్యవహరించింది. చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. 

తొమ్మిదేళ్లు రాష్ట్రానికి సీఎంగా పనిచేసి ప్రజాభిమానాన్ని కోల్పోయి, తిరిగి అధికారంకోసం పాదయాత్ర చేపట్టారు. ఆయన ఎన్ని ప్రయాసలు పడినా అధికారం దక్కించుకోవడం కల్ల. చంద్రబాబు లోక్‌సభలో ఒక విధంగా, రాజ్యసభలో మరోలా వ్యవహరించి ద్వంద్వ నీతిని మరోసారి చాటుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అధికార, విపక్షాలు కుట్రలుపన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైలులోనే ఉంచేందుకు పడుతున్న ప్రయాసలు ఎక్కువ రోజులు కొనసాగవు.’’ 
- నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

చిదంబరంతో బాబు చీకటి ఒప్పందం
‘‘కేంద్ర హోంమంత్రి చిదంబరంతో చంద్రబాబు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నందు వల్లనే టీడీపీ ఎంపీలు రాజ్యసభలో ఎఫ్‌డీఐపై ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. చంద్రబాబు ఆదేశం మేరకే వారు ఓటింగ్‌కు రాకుండా కాంగ్రెస్ సర్కారును కాపాడారు. ప్రతి చిన్నదానికి విప్‌లు జారీ చేసే చంద్రబాబు ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌కు విప్ జారీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విదేశీ కంపెనీలు హెరిటేజ్‌తో చేసుకున్న చీకటి ఒప్పందాల కారణంగా చంద్రబాబు చేసిన సూచనలతోనే టీడీపీ ఎంపీలు ఓటింగ్‌కు రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాపాడుతున్న టీడీపీ ఇప్పడు కాంగ్రెస్ పార్టీకి అసలైన పిల్ల కాంగ్రెస్‌గా మారింది. చంద్రబాబు రాజ్యసభ సీట్లు అమ్ముకుంటే, ఎంపీలు తమ ఓట్లను అమ్ముకున్నారు.’’ 
-టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు
Share this article :

0 comments: