చంద్రబాబు కుమ్మక్కు డ్రామాపై టీడీపీ శ్రేణుల్లో అంతర్మథనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు కుమ్మక్కు డ్రామాపై టీడీపీ శ్రేణుల్లో అంతర్మథనం

చంద్రబాబు కుమ్మక్కు డ్రామాపై టీడీపీ శ్రేణుల్లో అంతర్మథనం

Written By news on Sunday, December 9, 2012 | 12/09/2012

 బయట పడేందుకు ‘దేశం’ అధినేత మల్లగుల్లాలు
* అందులో భాగంగానే ఆ ముగ్గురు ఎంపీలపై పార్టీ నేతలు, ఎల్లోమీడియాతో విమర్శల దాడి
* తూతూ మంత్రపు చర్యలకు బాబు ప్రణాళిక
* ఓటింగ్‌కు డుమ్మా కొట్టిన ముగ్గురు ఎంపీలకు షోకాజు నోటీసు?
* ఎలాగోలా పరువు దక్కించుకునే మార్గాల వెదుకులాటలో అధినేత
* నిజానికి ముందస్తు ప్రణాళిక ప్రకారమే చంద్రబాబు ‘రాజీ’
* కేంద్ర మంత్రితో కొంతకాలంగా సన్నిహిత సంబంధాలు
* ఆయన చీకటి భేటీని గతంలో లోక్‌సభలోనే వెల్లడించిన చిదంబరం

హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్‌తో కొన్నేళ్లుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్న చీకటి కుమ్మక్కు కాస్తా తాజాగా పెద్దల సభ సాక్షిగా పట్టపగలే అడ్డంగా బట్టబయలైన వైనం టీడీపీలో ఇప్పుడు గగ్గోలు పుట్టిస్తోంది. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల అంశంపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారుకు బాబు బాసట ఆ రెండు పార్టీల మధ్య క్విడ్ ప్రొ కొ (నీకిది, నాకది) ప్రణాళికలో భాగంగానే జరిగిందన్న మాట టీడీపీలో రాష్ట్ర స్థాయి నేతల నుంచి సామాన్య కార్యకర్తల దాకా అందరి నోటా విన్పిస్తోంది! మూడేళ్లుగా ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్‌కు బాబు ‘అండ’గా నిలుస్తూ, అందుకు ప్రతిగా ఏఐసీసీ పెద్దల నుంచి ‘అన్నివిధాలా’ సహాయ, సహకారాలు అందుకుంటూ వస్తున్నారని రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారంటూ వారు వాపోతున్నారు. 

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. రాజీ లేని పోరాటం చేయాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీతో ఇటు రాష్ట్రంలోనూ, అటు హస్తిన స్థాయిలోనూ స్వయానా అధినేతే ఇలా అడ్డంగా రాజీ పడిపోతున్న వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అంతర్మథనం మొదలైంది. ఇంతకాలం కాంగ్రెస్-టీడీపీ మధ్య అనేకసార్లు మ్యాచ్‌ఫిక్సింగ్‌లు జరిగినా తేలికగా తీసుకుంటూ వచ్చిన టీడీపీ ముఖ్య నేతలను కూడా ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌కు ముగ్గురు సొంత ఎంపీలతో బాబు డుమ్మా కొట్టించిన వైనం తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. అసలేం జరిగిందంటూ ఆరా తీయడంతో పాటు, దీని పరిణామాలపై కూడా వారి మధ్య తీవ్ర చర్చోపచర్చలు సాగుతున్నాయి. 

‘‘ఏకంగా ముగ్గురు సభ్యులు సరిగ్గా ఓటింగ్ సమయంలోనే గైర్హాజరు కావడం యాదృచ్ఛికం కానేకాదు. కొద్ది రోజుల పాటు పక్కాగా రచించిన ప్రణాళికలో భాగమే. ఓటింగ్‌కు ముందురోజు దాకా అందుబాటులో ఉన్న దేవేందర్‌గౌడ్, గుండు సుధారాణి ఉన్నట్టుండి సరిగ్గా సమయానికి మాయం కావడం, ఓటింగ్ రోజున కూడా పార్లమెంట్ హాలులో అందరితో కలిసి తిరిగిన సుజనా చౌదరి తీరా ఓటింగ్ జరిగేటప్పుడు పత్తా లేకుండా పోవడం వెనక పెద్ద కథే నడిచింది’’ అంటూ టీడీపీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. అంతా ముందుగా అనుకున్నట్టుగానే చేసిన పార్టీ నాయకత్వం, ఇప్పుడు దాన్నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తోందని టీడీపీ ముఖ్యులు బాహాటంగానే చెబుతున్నారు.

అసలేం జరిగింది...
ఎఫ్‌డీఐలపై శుక్రవారం ఓటింగ్ జరుగుతుందనేది జగమెరిగిన సత్యం. అసలే రాజ్యసభలో మెజారిటీ లేని నేపథ్యంలో, ఓటింగ్ సమయంలో ప్రతి ఓటూ అధికార పక్షానికి కీలకమే. విపక్షం నుంచి ఎంతమంది గైర్హాజరైతే అధికార పక్షానికి అంత ప్రయోజనం. అందుకే చిన్నాచితకా పార్టీలను సైతం కాంగ్రెస్ వదల్లేదు. అందులో భాగంగానే కొన్నేళ్లుగా అండగా నిలుస్తున్న బాబును కాంగ్రెస్ పెద్దలు ఎంచుకున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ సూచన మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్ రంగంలోకి దిగారు. ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్రలో ఉన్న బాబును ఫోన్లో సంప్రదించారు. కాంగ్రెస్ పెద్దల ఆదేశాల మేరకు రిలయన్స్‌కు చెందిన ఒక వ్యక్తి కూడా వెంటనే రంగంలోకి దిగి బాబుతో మాట్లాడించారు. 

నిజానికి శుక్రవారం మధ్యాహ్నం పాదయాత్ర సందర్భంగా ప్రత్యేకంగా ఆహ్వానించిన అతిథులకు బాబు ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేయించారు. కానీ ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో వారిని గంటకు పైగా బయటే వేచి ఉండేలా చేశారు! సరిగ్గా మధ్యాహ్నం 2 నుంచి 3.30 దాకా ఎవరినీ తన వాహనంలోకి అనుమతించరాదని, ఎవరూ తనను డిస్టర్బ్ చేయరాదని బాబు ఆదేశించారు. రాజ్యసభ భోజన విరామం కోసం వాయిదా పడింది కూడా అదే సమయంలో! అంతేగాక.. ఢిల్లీ పెద్దలతో బాబు మాటామంతీ కూడా సరిగ్గా అదే సమయంలో కొనసాగిందని తెలిసింది. తాను ప్రత్యేకంగా పిలిపించుకున్న అతిథులతో ఆ తర్వాతే మాట్లాడి పంపించారాయన. 

రాజ్యసభలో ఓటింగ్ కోసమని శుక్రవారం ఉదయాన్నే హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్న బాబు కోటరీ ముఖ్యుడు సుజనా చౌదరి.. సభ వాయిదాపడగానే భోజనానికంటూ సన్నిహితులతో కలిసి బయటికెళ్లారు. ఆయన సభలోకి తిరిగి వచ్చేటప్పటికి ఓటింగ్ పూర్తయింది! ఇక శుక్రవారం మధ్యాహ్నం దాకా సభలోనే ఉన్న దేవేందర్ కూడా ఓటింగ్‌కు బైటికెళ్లారు. ఇక గుండు సుధారాణి అయితే గురువారం రాత్రి హైదరాబాద్ వచ్చి, మళ్లీ ఢిల్లీ వెళ్లే ప్రయత్నమే చేయలేదు!

వ్యూహాత్మకంగా రమేశ్ హాజరు
నిజానికి కాంగ్రెస్ పెద్దల కోరిక మేరకు మొత్తం ఐదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులనూ ఓటింగ్‌కు దూరం పెట్టాలని బాబు ముందుగా భావించినట్టు వినిపిస్తోంది. కానీ అలా అయితే కాంగ్రెస్‌కు మొత్తంగా సరెండర్ అయ్యారన్న అపవాదు వస్తుందని, ఆపై పార్టీకి భవిష్యత్తే ఉండదన్న భావనతో ‘ఇద్దరు ఓటు, ముగ్గురు ఔటు’ వ్యూహాన్ని అమలు చేసినట్టు టీడీపీ నేతలు పలువురు అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నారు. తన అత్యంత సన్నిహితుడైన సీఎం రమేశ్ టీడీపీ తరఫున తీర్మానాన్ని ప్రతిపాదించిన కారణంగా బాబు ఆయనను బయటకు పంపలేదు!

‘గట్టి’ ఒప్పందమే కుదిరింది
కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా పుట్టుకొచ్చిన టీడీపీ, ఏకంగా ఆ పార్టీకి ఈ స్థాయిలో బాహాటంగా మేలు చేసిందంటే, దాని వెనుక ‘పెద్ద’ ఒప్పందమే కుదిరిందన్న మాట చాలా గట్టిగా వినిపిస్తోంది! ఎమ్మార్ సంస్థకు బాబు జరిపిన భూ కేటాయింపులు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఐఎంజీ భారత్‌కు ఆయన భూములు కట్టబెట్టడం వంటి అనేక అంశాల్లో ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. వాటన్నింటిపైనా న్యాయ విచారణను తప్పించుకునేందుకు బాబు చేసుకుంటున్న తెరచాటు ప్రయత్నాలు కూడా బహిరంగ రహస్యమే. వాటిలో భాగంగానే ఇలా కాంగ్రెస్‌తో ఆయన అంటకాగుతున్నారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. దానికి తోడు నానాటికీ తీసికట్టుగా మారుతున్న టీడీపీ పరిస్థితి కూడా అందుకు మరో కారణమంటున్నారు. మూడేళ్లుగా కాంగ్రెస్‌తో అన్ని విషయాల్లోనూ బాబు కుమ్మక్కవుతుండటం తెలిసిందే. 

రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టబోమని, ప్రభుత్వం పడిపోకుండా చూస్తామని.. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనానికి ముందు ఢిల్లీ పెద్ద ఒకరికి బాబు హామీ ఇచ్చినట్టు వచ్చిన వార్తలు టీడీపీలో తీవ్ర దుమారం సృష్టించాయి. పలు దఫాలుగా ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ పెద్దలతో బాబు రహస్యంగా భేటీ అవుతున్నారంటూ పార్టీ వర్గాలే కథలు కథలుగా చెప్పుకున్నాయి. అవి వాస్తవమేనని స్వయానా అప్పటి కేంద్ర హోం మంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రి చిదంబరం ఏకంగా లోక్‌సభలోనే బయటపెట్టారు. టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు వ్యాఖ్యలకు బదులిస్తూ, ‘మీ నేత (చంద్రబాబు) నన్ను కలిశారు’ అని చిదంబరం చాలా స్పష్టంగా చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌తో పూర్తి స్థాయిలో జతకట్టిన బాబు... వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై కేసుల దర్యాప్తు విషయంలో కూడా అధికార పార్టీ నేతలతో కలిసి కేసులు వేశారు. 

రాజకీయంగా రాష్ట్రంలో టీడీపీ పూర్తి బలహీన స్థితికి చేరుకున్నందునే ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఆయన ఇలా కాంగ్రెస్‌తో చేతులు కలిపారన్న వాదన టీడీపీలోనే బలంగా వినిపిస్తోంది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఒకరు మాత్రం, ‘‘శత్రువుకు శత్రువు మిత్రుడన్న సూత్రంతోనే కాంగ్రెస్‌తో బాబు చేతులు కలిపారు. రాజకీయ ఎత్తుగడలో ఇలాంటివి సర్వ సాధారణం’’ అంటూ విషయాన్ని తేలికగా తీసుకున్నారు! అయితే.. రాజ్యసభలో ఓటింగ్ ఉదంతం పార్టీకి తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినప్పటికీ తమకది ఒకరకంగా ‘తప్పని పరిస్థితి’ అంటూ లోగుట్టును ఆయనే నర్మగర్భంగా బయట పెట్టారు కూడా!!

బయటపడటం ఎలా?
కాంగ్రెస్‌తో తమ కుమ్మక్కు మరీ అడ్డంగా బయట పడటంతో పరువు కాపాడుకునేందుకు టీడీపీ నాయకత్వం మార్గాంతరాల అన్వేషణలో పడ్డట్టు తెలిసింది. రాజ్యసభలో ఓటింగ్‌నకు గైర్హాజరైన ముగ్గురు ఎంపీలకు తొలుత షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని అది తమకు సంతృప్తి కలిగించలేదంటూ మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేసినట్టు ఒక నాయకుడు చెప్పారు. అంతా చంద్రబాబు ఆదేశాల మేరకే జరిగినప్పటికీ పార్టీకి నష్టం జరక్కుండా ఉండేందుకు కొంతకాలం ఆ ముగ్గురిని ఇబ్బందులకు గురిచేయకతప్పదని ఆయన అన్నారు. సస్పెన్షన్ గడువు ముగిసే నాటికి అంతా సర్దుకుంటుందని, తర్వాత తిరిగి వారిని పార్టీలోకి తీసుకుంటారన్న ఆలోచన చేసినట్టు తెలిపారు. అయితే ఇది ప్రాథమిక స్థాయిలోనే ఉందన్నారు. 

ఇదిలా ఉంటే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన తాము నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నామని ఒకటి రెండు రోజుల్లో ఈ ఎంపీలు ప్రకటించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. వీరి రాజీనామాల వ్యవహారంపై కొద్ది రోజుల హడావుడి నడిచిన తరువాత పొలిట్‌బ్యూరో లేదా ముఖ్య నేతల సమావేశం నిర్వహించి వాటిని ఆమోదించటం లేదని చంద్రబాబు ప్రకటిస్తారని ఆ వర్గాల సమాచారం.

కుమ్మక్కే ఎంపీల పాలిట శాపమైంది: సన్నిహితులు
చంద్రబాబునాయుడు కుమ్కక్కు రాజకీయమే ఆ ముగ్గురు ఎంపీల పాలిట శాపంగా మారిందని వారి అనుచరులే అంటున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చిన ముందస్తు హామీ ప్రకారం తమ ఎంపీలను సభ నుంచి బైటకు పంపిన చంద్రబాబు ఇపుడు పార్టీ కార్యకర్తలు, ప్రజల దృష్టిలో ఆ ముగ్గురిని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం ఎంపిక చేసిన నేత లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఎంపీలను తన వద్దకు రావాల్సిందిగా కోరారు. ఆ మేరకు సుజనా చౌదరి, గుండు సుధారాణి బాబును కలిసి వివరణ ఇచ్చారు. దేవేందర్ మాత్రం వెళ్లలేదు.

హరికృష్ణ మండిపాటు!
మరో ఎంపీ నందమూరి హరికృష్ణ విషయంలో బాబు చాలాసేపు తర్జనభర్జన పడ్డారని, ఆయనకు లోగుట్టు తెలియకుండానే కథ నడిపించాలని చివరికి నిర్ణయించారని తెలిసింది. కానీ శుక్రవారం రాజ్యసభ వాయిదా పడిన తర్వాత అసలు విషయం అర్థమైన హరికృష్ణ.. టీడీపీకి చెందిన ఒక లోక్‌సభ సభ్యుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘నేను పార్టీ భేటీలకు, పార్లమెంటు సమావేశాలకు రాకపోతే అనుకూల పత్రికలకు లీకుల మీద లీకులిచ్చి మరీ నాపై వార్తలు రాయించే మీరు ఇవాళ పార్టీ భవిష్యత్తునే పణంగా పెట్టారు’ అంటూ ధ్వజమెత్తినట్టు ఆ సమయంలో అక్కడున్న మిగతా ఎంపీలు చెప్పారు. 

‘‘నామీద, నా కుమారుడి (సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్) మీద లేనిపోనివి లీక్ చేయించి వార్తలు రాయిస్తారు కదా! ఇప్పుడు కూడా ఆ పనే చేయండి. కానీ ఎప్పటికైనా పార్టీ కోసం నిలబడేది మేమే’’ అంటూ హరికృష్ణ ఆగ్రహంతో వెళ్లిపోయినట్టు తెలిసింది. రాజ్యసభలో ఓటింగ్ పూర్తయి, గండం నుంచి కాంగ్రెస్ గట్టెక్కిన తర్వాత జాతీయ మీడియాలో సైతం... శివసేన, జేఎంఎం, జేడీ (యూ)లతో పాటు చంద్రబాబును కూడా కాంగ్రెస్ ఫ్లోర్ మేనేజర్లు బాగా ‘మేనేజ్’ చేశారంటూ వార్తలు, విశ్లేషణలు వచ్చాయి!

గైర్హాజరు గురించి చంద్రబాబుకు తెలుసు
‘‘రాజ్యసభకు నేను హాజరుకావడం లేదన్న విషయం చంద్రబాబుకు ముందే తెలుసు. నన్ను డబ్బులిచ్చి కొనే మగాళ్లెవరూ లేరు. అనారోగ్యం వల్ల అమెరికా వెళ్లడం, మళ్లీ డాక్టర్లతో అపాయింట్‌మెంట్ ఉండటంతో సభకు వెళ్లలేకపోయా. ఈ సంగతి చంద్రబాబుకూ తెలుసు. నా గైర్హాజరీపై అనవసర రాద్ధాంతం చేయొద్దని పార్టీ నేతలు, మీడియాను కోరుతున్నా. రాజ్యసభ సభ్యత్వం పెద్ద పదవి కాదు. నేను రాష్ట్రంలో పదవులు, అధికారం అనుభవించాను. ఎఫ్‌డీఐపై ఓటింగ్ సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని బీఎస్పీ, సభ నుంచి వాకౌట్ చేస్తామని ఎస్పీ ప్రకటించడంతో ఫలితమేంటో ముందే తెలిసింది. టీడీపీ కూడా అదేవిధంగా ఆలోచించింది’’ 
-టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ‘తాకట్టు’
‘‘ఎఫ్‌డీఐలపై ఓటింగ్ సందర్భంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయపార్టీలు దేశ ప్రయోజనాలను తాకట్టుపెట్టాయి. పార్లమెంట్‌లో యూపీఏ-2 గెలిచి ఓడింది. మెజార్టీ పార్లమెంట్ సభ్యులు బిల్లును వ్యతిరేకించినా అది ఎలా పాస్ అయిందో అందరికీ తెలుసు. కనికట్టుతో లోపల ఒకటి బయటొకటి అవలంబించి బెదిరించి ఓట్లు వేయించుకొన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేసి పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు అపకీర్తిని తెచ్చింది’’ 
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ

కాల్‌డేటాతో బాబు అసలు రూపం బయటపడుతుంది
‘ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌కు ముగ్గురు టీడీపీ ఎంపీలు డుమ్మా కొట్టేలా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. బాబు 15 రోజుల కాల్‌డేటాను పరిశీలిస్తే రహస్య మంతనాల విషయం తెలిసిపోతుంది, అసలు రూపం బయటపడుతుంది. టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ ఏజెంట్లుగా మారిపోయారు. కాంగ్రెస్‌కు టీడీపీని హోల్‌సేల్‌గా అమ్మేశారు. బాబు ఢిల్లీ పెద్దలతో కుమ్మక్కై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరోక్షంగా కాపాడుతున్నారు. గతంలో ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన టీడీపీ ప్రస్తుతం దానికి మద్దతు పలికేలా ఓటింగ్‌కు గైర్హాజరుకావడం కాంగ్రెస్, టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు నిదర్శనం కాదా? చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. ఎన్టీఆర్ పాలనలో నాయకులు టీడీపీని నమ్ముకుంటే, ప్రస్తుత నాయకులు పార్టీని అమ్ముకుంటున్నారు..’ 
-ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

కుమ్మక్కు కుట్రలు బయటపడ్డాయి
‘తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, అధికార పార్టీ కాంగ్రెస్‌ల కుమ్మక్కు కుట్రలు పార్లమెంటు సాక్షిగా బయటపడ్డాయి. రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగిన ఓటింగ్‌తో వారి అనైతిక బంధం గురించి తెలిసిపోయింది. ఒకవైపు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నానని గొప్పలు చెప్పే చంద్రబాబు ఇప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సోనియాగాంధీ వద్ద తాకట్టు పెట్టారు. తమ ఎంపీలు సభకు గైర్హాజరైతే చర్యలకు ఆయన వెనుకాడుతున్నారెందుకు? వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిసిన రెండు నిమిషాల్లోనే నన్ను సస్పెండ్ చేశారు. నేను కోట్ల రూపాయలకు అమ్ముడుపోయానని టీడీపీ నాయకులు విమర్శించారు. మరి ఇప్పుడు చంద్రబాబు ఎన్ని కోట్లకు అమ్ముడుపోయారో చెప్పాలి... చంద్రబాబు ఎన్ని కోట్లు తీసుకుని సోనియాగాంధీకి దేశ ప్రయోజనాలను అమ్మేశారో చెప్పాలి. చంద్రబాబుకు స్వార్థ రాజకీయాలు, వ్యక్తిగత స్వార్థం ముఖ్యం. చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, తగిన సమయంలో వారు బుద్ధి చెబుతారు...’
-ఎమ్మెల్యే కొడాలి నాని

ఆ ముగ్గురిని సస్పెండ్ చేయాలి: తలసాని
ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌కు గైర్హాజరైన ముగ్గురు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, దేవేందర్‌గౌడ్, సుధారాణిలపై పార్టీ అధినేత చంద్రబాబు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంచేశారు. వారు ఎలాంటి వివరణను ఇచ్చినా వినకూడదని, ఇది కార్యకర్తల మనోభావాలకు సంబంధించిన విషయమన్నారు. వారి తీరు పార్టీని తలదించుకునేలా చేసిందని, ముగ్గురు పోతే 30 లక్షల మంది పార్టీలోకి వస్తారన్నారు. ఇదిలాఉండగా, ఆ ముగ్గురు ఎంపీలూ చంద్రబాబు అనుమతితోనే గైర్హాజరై ఉంటే అది నిజంగా ఆత్మహత్యాసదృశమేనని పార్టీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి అన్నారు. ఓటింగ్‌కు హాజరుకాకపోవడం క్షమించరానిదని, వారు పశ్చాత్తాపం ప్రకటించి, క్షమాపణలు చెప్పాలని పార్టీ నేత పయ్యావుల కేశవ్ సూచించారు. తమ ఎంపీల గైర్హాజరు దురదృష్టకరమని, సీబీఐని అడ్డం పెట్టుకుని ములాయం, మాయావతిని యూపీఏ ప్రభావితం చేసిందంటూ టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: