మేం అధికారంలోకి వస్తామన్న ఆందోళనతోనే విభజన ప్రకటన
పార్టీలో నామాటే వేదం.. అందరూ నా వెనుక నడవాల్సిందే
మంగళవారం చంద్రబాబు తన నివాసంలో సుమారు గంటకు పైగా విలేకరులనుద్దేశించి ప్రసంగించారు. యథావిధిగా ‘సాక్షి’ దినపత్రిక, చానల్పై తన అక్కసును వెళ్లగక్కారు. తాము తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ నేతలు, దిగ్విజయ్సింగ్, ముఖ్యమంత్రి పూటకోమాట మాట్లాడుతూ ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారని చెప్పారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కాంగ్రెస్ పార్టీనే కారణమని చంద్రబాబు ఆరోపించారు.
ఈ ప్రశ్నలకు బదులేది?
ఈ విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ ప్రతినిధిని అనుమతించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ‘సాక్షి’ ఈ వార్త ప్రచురిస్తోంది. మీడియా సమావేశానికి అనుమతించి ఉంటే చంద్రబాబును ‘సాక్షి’ ఈ ప్రశ్నలు అడిగేది..
- టీడీపీ అధికారంలోకి రాకుండా చేసేందుకే కాంగ్రెస్ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని అంటున్నారు కదా, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది మీరు కాదా? ఆ తర్వాత తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చమని, అఖిల పక్ష సమావేశం పెట్టాలని ప్రధానికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా?
- జగన్మోహన్రెడ్డి నివాసానికి, సీడబ్ల్యూసీకి మధ్య హాట్లైన్ ఉందని ఆరోపిస్తున్నారు కదా, సీడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ముందు కాంగ్రెస్ హైకమాండ్లోని కీలకమైన ముగ్గురు నేతలతో మీరు ఫోన్లో మాట్లాడిన అంశం హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. అంటే కాంగ్రెస్ నేతలు మీతో టచ్లో ఉన్నారని భావించాలా? లేక జగన్తోనా?
- ‘మీ పార్టీ నాయకుడు (చంద్రబాబు) నన్ను కలిశారని’ స్వయంగా కేంద్ర మంత్రి చిదంబరం పార్లమెంట్ వేదికగా మీ పార్టీ ఎంపీలకు చెప్పారు కదా. అంటే కాంగ్రెస్ నేతలు ఎవరితో టచ్లో ఉన్నారంటారు?
- నా రాజకీయ జీవితంలో ఇంత చెత్త నీచమైన ప్రభుత్వాన్ని చూడలేదంటున్న మీరు ఎఫ్డీఐలకు సంబంధించిన బిల్లు రాజ్యసభలోకి వచ్చినప్పుడు ఆ బిల్లు ఆమోదం పొందేలా స్వయంగా టీడీపీ ఎంపీలు సభ నుంచి గైర్హాజరై పరోక్షంగా బిల్లు నెగ్గడానికి ఉపయోగపడలేదా?
- రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రతిపక్షాలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే దానికి మద్దతివ్వకుండా ప్రభుత్వాన్ని కాపాడిన మీరే కాంగ్రెస్పై నిందలు వేయడంలో ఆంతర్యమేంటి?
- విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించగానే సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని కేంద్రాన్ని కోరింది మీరు కాదా? ఇప్పుడేమో హైదరాబాద్లో నివసించే ఇతర ప్రాంతాల వారికి ఇబ్బందులుండవని చెబుతున్నారు కదా.. అలాంటప్పుడు ఆత్మగౌరవ యాత్ర ఎందుకు చేపట్టాలనుకుంటున్నారు?
0 comments:
Post a Comment