సీఎం, మంత్రులు సొంత ఎజెండాతో ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారే తప్ప ప్రజాసమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కావడంలేదని విమర్శించారు. మహానేత వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ మొదలుకొని ప్రతీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని వివరించారు. పేదవాని ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీలో 132 జబ్బులను తగ్గించారని, దాదాపు 80 ఆసుపత్రులను ఆ పథకం నుంచి తొల గించారని తెలిపారు. ప్రధానంగా గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలను ఈ పథకం నుంచి దూరం చేశారని, అందుకే ఈ నెల 15 నుంచి చికిత్సలే జరగట్లేదని చెప్పారు. పెన్షన్ల విషయానికొస్తే అచ్చం చంద్రబాబు విధానాలనే అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు.
‘‘బాబు హయాంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు అందజేసే పెన్షన్ రూ.75 మాత్రమే ఉండేది. అది కూడా ప్రతీ 3 నెలలకొకసారి జన్మభూమి అంటూ అక్కడే ఇచ్చేవారు. లబ్ధిదారుల విషయానికొస్తే ఎవరైనా చనిపోతే తప్ప వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించేవారు కాదు’’ అని వివరించారు. మహానేత వైఎస్ హయాంలో పెన్షన్లను 18 లక్షల నుంచి 71లక్షలకు పెంచి, రూ.75 నుంచి 200లకు వృద్ధులకు, వికలాంగులకు రూ. 500 చేశారని గుర్తుచేశారు. బాబు బాటలో పయనిస్తున్న కిరణ్ పెన్షన్ల లబ్ధిదారులను ప్రతీ ఏటా కుదిస్తున్నారని తప్పుబట్టారు. వైఎస్ హయాంలో 71లక్షల మంది ఉండగా అనేక కొర్రీలు వేసి నాలుగు లక్షల మందిని తగ్గించారన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా... ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఆమె దారితప్పిన బిడ్డలాంటిది. అన్నగా వైఎస్సార్ను ఆరాధిస్తూ... అల్లుడిని అవమానించడం సరైందికాదు. ఆమె అంటే ఇప్పటికీ పార్టీలో చాలామందికి గౌరవం ఉంది. ఆ విమర్శలన్నీ ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాం’’ అని గట్టు బదులిచ్చారు.
0 comments:
Post a Comment