తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సమైక్య ఉద్యమ బస్సు యాత్ర ప్రారంభిస్తున్న తొలి మహాసభ తిరుపతిలో జరుగుతుందని పార్టీ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్క్లబ్లో వారు విలేకరులతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి రోజున యూత్ర ప్రారంభిస్తున్న షర్మిల తొలి బహిరంగ సభ తిరుపతిలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతుందని తెలిపారు. రాత్రి తిరుపతిలోనే షర్మిల బస చేస్తారని, మంగళవారం ఉదయం 11 గంటలకు చిత్తూరులో, సాయంత్రం నాలుగు గంటలకు మదనపల్లెలో బహిరంగ సభలు జరుగుతాయన్నారు. ఈ సభలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. సమైక్య ఉద్యమానికి సంబంధించిన బస్సు యాత్ర కావడంతో సమైక్య జేఏసీ నేతలు కూడా ఈసభకు హాజరు కావాలని కోరారు.
తిరుపతిలో ప్రారంభమయ్యే బస్సు యాత్ర 13 జిల్లాల్లో పర్యటిస్తుందని తెలిపారు. తిరుపతిలో తిరుమల బైపాస్ రోడ్డులోని లీలా మహల్ సెంటర్ వద్ద బహిరంగ సభ జరుగుతుందన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినట్లు నాటకాలు అడుతున్నారే తప్ప ఇంత వరకు స్పీకర్ ఫార్మట్లో రాజీనామా చేయలేదని తెలిపారు. తమ రాజీనామాలను ముఖ్యమంత్రికి ఇచ్చామని, పీసీసీ అధ్యక్షుడికి ఇచ్చామని కాంగ్రెసు ప్రజాప్రతినిధులు అంటుంటే, తెలుగు దేశం ప్రజాప్రతినిధులు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇచ్చినట్లు పేర్కొంటూ నాటకాలు ఆడుతున్నారని తెలిపారు.
0 comments:
Post a Comment