రూ.5 వేల కోట్లిస్తే తప్పుకుంటాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూ.5 వేల కోట్లిస్తే తప్పుకుంటాం

రూ.5 వేల కోట్లిస్తే తప్పుకుంటాం

Written By news on Tuesday, July 17, 2012 | 7/17/2012

రస్‌అల్‌ఖైమా, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది 
‘రాక్’ భారత భాగస్వామిగా వాన్‌పిక్ చేరింది
ప్రసాద్ రూ.900 కోట్లు పెట్టుబడి పెట్టారు
అభివృద్ధి పరచి వ్యాపారం చేసుకోవాలనేది ఒప్పందం: సీబీఐ
దానికి విరుద్ధంగా నవయుగకు 65% వాటాలు కట్టబెట్టారు
బెయిల్ పిటిషన్‌పై వాదనలు మంగళవారానికి వాయిదా

హైదరాబాద్, న్యూస్‌లైన్: వాన్‌పిక్ ప్రాజెక్టులో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులకుగాను రూ.5 వేల కోట్లను తిరిగి ఇచ్చేస్తే... ప్రాజెక్టు నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తరఫున న్యాయవాది ప్రత్యేక కోర్టుకు నివేదించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ నిమ్మగడ్డ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్ రావు సోమవారం మరోసారి విచారించారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధికి ఇప్పటి వరకు రూ. 900 కోట్లు పెట్టుబడిగా పెట్టారని నిమ్మగడ్డ తరఫున న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపించారు. వ్యాపారిగా లాభాలు పొందేందుకు ప్రభుత్వాలను అనేక రాయితీలు కోరతామని, ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుం దని నివేదించారు. 

రస్‌అల్‌ఖైమా (రాక్) భారత భాగస్వామిగా వాన్‌పిక్ చేరిందని... ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే నిమ్మగడ్డ పెట్టుబడులకు గాను రూ. 5 వేల కోట్లు ఇచ్చేయాలని కోరారు. వాన్‌పిక్‌కు కేటాయించిన భూములను రియల్ ఎస్టేట్‌కు విక్రయించారని సీబీఐ ఆరోపిస్తోందని... అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ వారు చూపడం లేదని తెలిపారు. పారిశ్రామికవాడలో షరతులకు లోబడి వినియోగించుకునేందుకు కొందరికి భూమి కేటాయించారని, ఇది నిబంధనల మేరకే జరిగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ పొంతనలేని వాదనలు చేస్తోందని, రికార్డులో, కౌంటర్‌లో లేని అంశాలను కోర్టులో ప్రస్తావిస్తోందని ఆరోపించారు. సాక్షులను బెదిరించి, ఆధారాలను మాయం చేస్తారనే ఆరోపణలతో మే 14న సీబీఐ చట్టవిరుద్ధంగా నిమ్మగడ్డను అరెస్టు చేసిం దని తెలిపారు. అయితే మే 14 వరకు సీబీఐ ఇటువంటి ఆరోపణ ఒక్కరోజూ చేయలేదని, గత 9 నెలలుగా ఆయన సీబీఐ విచారణకు సహకరిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. 

ప్రసాద్ పెట్టుబడి రూ.25 కోట్లే: సీబీఐ

వాన్‌పిక్ ప్రాజెక్టు భూసేకరణకు రూ.450 కోట్లు చెల్లించినట్లు నిమ్మగడ్డ ప్రసాద్ రికార్డుల్లో చూపారని, అయితే రూ.150 కోట్లు మాత్రమే పరిహారంగా చెల్లించారని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ వాదనలు వినిపించారు. లెక్కల్లో చూపని రూ.300 కోట్లలో రూ.140 కోట్లు జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారని ఆరోపించారు. వాన్‌పిక్ ప్రాజెక్టులో నిమ్మగడ్డ కేవలం రూ.25 కోట్లు మాత్రమే పెట్టుబడిగా పెట్టారని, భూసేకరణ కోసం రాక్ నుంచి రూ.450 కోట్లు పొందారని తెలిపారు. ఇందులో కొంత మొత్తాన్ని అటూఇటూ తిప్పుతూ వ్యాపారం చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టులో రాక్ తనకున్న 51 శాతంలో 25 శాతాన్ని, వాన్‌పిక్ తనకున్న 49 శాతంలో 40 శాతాన్ని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి విక్రయించారని పేర్కొన్నారు. బహిరంగ వేలం, టెండర్లు లేకుండానే అత్యధికంగా 65 శాతం వాటాను దక్కించుకున్న నవయుగ కంపెనీ అంతిమ లబ్ధిదారుగా మిగిలిందన్నారు. ప్రాజెక్టును అభివృద్ధి చేసి వ్యాపారం నిర్వహించుకోవాలనేది ఒప్పందమని, అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు అధిక మొత్తం వాటా కట్టబెట్టారని ఆరోపించారు. ఓ ప్రభుత్వ అధికారి ద్వారా ఈ నిజాన్ని రాబట్టామని, ప్రభుత్వానికి ఇప్పటికీ ఈ విషయం తెలియదని నివేదించారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు మంగళవారం కూడా కొనసాగుతాయి.
Share this article :

0 comments: