విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీవీసీ, సీబీఐలకు మరోసారి నోటీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీవీసీ, సీబీఐలకు మరోసారి నోటీసులు

విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీవీసీ, సీబీఐలకు మరోసారి నోటీసులు

Written By news on Thursday, July 19, 2012 | 7/19/2012

- కేంద్రం, సీవీసీ, సీబీఐలకు ఢిల్లీ హైకోర్టు మరోసారి నోటీసులు
- వచ్చేవారానికి పూర్తిస్థాయి కౌంటర్ల దాఖలుకు ఆదేశం 

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించడంతో పాటు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కిందకి తేవాలంటూ ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీవీసీ, సీబీఐలకు మరోసారి నోటీసులు జారీ చేసింది. వచ్చే బుధవారానికి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అర్జున్ కుమార్, న్యాయమూర్తి రాజీవ్ సహాయ్ ఎండ్లాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ పూర్తిగా రాజకీయ ప్రలోభాలతో పనిచేస్తోందని, దానికి స్వయంప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉందని ఆడిటర్ విజయసాయిరెడ్డి గత ఏడాది ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

మొదట దీనిని విచారించిన ఢిల్లీ హైకోర్టు, ప్రస్తుతం జారీ చేసిన విధంగానే సీబీఐ, సీవీసీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. పలుమార్లు కౌంటర్ల దాఖలుకు గడువునిచ్చింది. చివరకు ప్రతివాదుల తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టులో ఇప్పటికే ఇటువంటి వ్యాజ్యాన్ని డాక్టర్ సుబ్రహ్మణ్యం దాఖలు చేశారని, దానిని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిందంటూ అందుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీని కోర్టుకు అందచేశారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం, ఈ వ్యాజ్యంలో విచారణను ముగిస్తున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. తరువాత సాయిరెడ్డి మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. 

సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యంస్వామి దాఖలు చేసిన కేసుకు, తాను దాఖలు చేసిన పిటిషన్‌కు ఎటువంటి సంబంధం లేదని, తన అభ్యర్థన పూర్తిగా వేరని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో అనుబంధ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం సాయిరెడ్డి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటూ తిరిగి విచారణ ప్రారంభించింది. ‘‘ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ సెక్షన్ (4), సెక్షన్ (5)కింద సీబీఐ ఏర్పాటైంది. దీని ప్రకారం సీబీఐ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. వారు ఏది చెబితే సీబీఐ అది వింటుంది. అలా కాకుండా సీబీఐకి స్వతంత్రాధికారం ఉండాలంటే సీబీఐని సీవీసీ కిందకు తేవాలి. సీబీఐకి పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే ది కూడా కేంద్ర ప్రభుత్వమే. అంటే వారు ఏది చెప్పినా కేంద్రం చెప్పినట్లే అవుతుంది. 

అలా ఉండటం సరికాదు. సీబీఐకి స్వయంప్రతిపత్తి ఉండాలంటే ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లోని సెక్షన్(4), సెక్షన్ (5)లను తొలగించాలి. సీబీఐ అధికారుల నియామకాలు కేంద్ర పరిధిలో కాకుండా వేరుగా ఉండాలి’’ అని సాయిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది అమర్‌లేఖి కోర్టుకు నివేదించారు. సుబ్రమణ్యస్వామి కేవలం సెక్షన్(4), సెక్షన్ (5)లను మాత్రమే తొలగించాలని కోరగా, తాము సీబీఐని సీవీసీ కిందకు తెచ్చి స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరడంతోపాటు సీబీఐ అధికారుల నియామకాలు కేంద్ర పరిధిలో జరుగకుండా చూడాలని సైతం కోరుతున్నట్లు విన్నవించారు. వాదనలు విన్న ధర్మాసనం, తిరిగి కేంద్రం, సీవీసీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. వచ్చే బుధవారానికల్లా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. 

‘31 వరకు ఢిల్లీలో ఉంటా’
హైదరాబాద్, న్యూస్‌లైన్: సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో ఉన్న కేసులపై సీనియర్ న్యాయవాదులతో చర్చించేందుకు ఈనెల 20న ఢిల్లీ వెళ్తున్నానని.. 31వ తేదీ వరకు అక్కడే ఉంటానని విజయసాయిరెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈమేరకు తన ఢిల్లీ పర్యటన వివరాలను సీబీఐకి కూడా అందజేశారు. సాయిరెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించిన సీబీఐ కోర్టు.. పర్యటన వివరాలను 2 రోజుల ముందే అందజేయాలని షరతు విధించిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: