హాస్టల్ విద్యార్థుల వెతలపై షర్మిల ఆవేదన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హాస్టల్ విద్యార్థుల వెతలపై షర్మిల ఆవేదన

హాస్టల్ విద్యార్థుల వెతలపై షర్మిల ఆవేదన

Written By news on Friday, November 16, 2012 | 11/16/2012

జైల్లో ఖైదీలకు కూడా రోజుకు రూ. 45 ఇస్తున్నారు
హాస్టల్‌లో ఏడాదికి 216 సిలిండర్లు వినియోగమవుతాయి
అందులో 6 మాత్రమే సబ్సిడీ మీద ఇస్తారట..
మిగతావన్నీ రూ.1,250 పెట్టి కొనుక్కోవాలట..
గ్యాస్ మీద భారం మోపి పిల్లల కడుపు కొడుతోందీ ప్రభుత్వం
సీఎం ఇంటికి ఎన్ని సిలిండర్లు వెళుతున్నాయో లెక్క తీయాలి
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 29, కిలోమీటర్లు: 375.90

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘హాస్టల్లో నెలకు 18 చొప్పున ఏడాదికి 216 సిలిండర్లు దాకా వాడాల్సిన అవసరముంటే.. వాటిలో ఆరు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తుందట. మిగిలినవి ఒక్కో సిలిండరూ రూ.1,250 పెట్టి కొనుక్కోవాలట. గ్యాస్ మీద భారం మోపి ఈ ప్రభుత్వం పిల్లల కడుపుమీద కొడుతోంది. అసలే పిల్లలకు రోజుకు రూ.17 మాత్రమే భోజనానికి వెచ్చిస్తుంటే.. ఇప్పుడు గ్యాస్ పేరుతో ఆ భోజనంలో కూడా కోత పెట్టే పరిస్థితి. రూ. 17తో అసలు పిల్లలకు రెండు పూటలా భోజనం ఎలా సరిపోతుంది? జైల్లో ఖైదీలకు కూడా రూ. 45 వెచ్చిస్తుంటే.. పిల్లలకు రూ. 17 మాత్రమేనా? ఇది అన్యాయం కాదా? అసలు కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటికి ఎన్ని సిలిండర్లు వెళుతున్నాయో కనుక్కోవాలి..’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల మండిపడ్డారు. ప్రజల శ్రేయస్సును గాలికి వదిలేసి కుమ్మక్కైన కాంగ్రెస్, టీడీపీల కుట్ర రాజకీయాలకు నిరసనగా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆమె చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ 29వ రోజు గురువారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో సాగింది. 

పెద్దకడబూరు దాటాక క స్తూర్బా బాలికల విద్యాలయంలో షర్మిల విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కరెంటు ఉండడం లేదని, కాంపౌండ్ వాల్ లేదని, ప్లేగ్రౌండ్ లేదని, గ్యాస్ ధర పెరిగిందంటూ మెనూలో కోతపెడుతున్నారంటూ విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన షర్మిల గ్యాస్ పేరుతో పిల్లల పొట్ట మీద కొట్టడం అమానవీయమని అన్నారు. పాలు, గుడ్లు, అల్పాహారం అందుతున్నాయా? అని అడగడంతో పాలు ఇవ్వరని, గుడ్లు వారానికి మూడు ఇస్తారని విద్యార్థినులు తెలిపారు. పదో తరగతితో ఆపకుండా పెద్ద చదువులు చదవాలని, జగనన్న సీఎం అయ్యాక ఎంత పెద్ద చదువైనా ఉచితంగా చదివిస్తాడని షర్మిల వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కలెక్టర్‌తో మాట్లాడి క్రీడామైదానం వచ్చేలా చూస్తారని షర్మిల హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌కు టీడీపీ మిత్రపక్షం: టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా కాకుండా కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా వ్యవహరిస్తోందని షర్మిల దుయ్యబట్టారు. మధ్యాహ్నం మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ‘చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి మళ్లీ అక్కడికే వెళ్లి నాకో అవకాశం ఇవ్వాలంటూ మొసలికన్నీళ్లు కార్చుతున్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని కూల్చకుండా నిలబెడుతున్నారు. ఇప్పుడాయన ప్రతిపక్షం కాదు. టీడీపీ కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా మారింది. రెండూ కలిసి ఒక్కటై నీచమైన రాజకీయాలకు దిగాయి. అధికారం ఉందని సీబీఐని వాడుకుని జగనన్నను జైలుకు పంపాయి. జగనన్న బయట ఉంటే ఆ రెండు పార్టీలకు మనుగడ ఉండదని ఈ కుట్రపన్నాయి..’ అని ధ్వజమెత్తారు.

జనమే జనం: 29వ రోజు గురువారం యాత్రలో ఉదయం రంగాపురం శివారులో బయలుదేరిన షర్మిలకు మంత్రాలయం నియోజకవర్గ ప్రజానీకం అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది. మధ్యాహ్నం పెద్దకడబూరు చేరేవరకు వేలాది మంది జనం షర్మిలతోపాటు కాలు కలిపి కదం తొక్కారు. యాత్ర సాగిన దారంతా మట్టిరోడ్డు కావడం, షర్మిల వెంట వేలాది మంది కదలి రావడంతో రోడ్డంతా తీవ్రమైన దుమ్ము, ధూళి రేగింది. మధ్యాహ్నం జరిగిన బహిరంగ సభ జనంతో కిక్కిరిసిపోయింది. తరువాత దొడ్డిమేకల మీదుగా రాత్రి హెచ్.మోరవాణి సమీపంలో ఏర్పాటుచేసిన రాత్రి బసకు 7.50కి షర్మిల చేరుకున్నారు. గురువారం 14.6 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తం 375.90 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

రాజన్న ఉన్నప్పుడు రూ.120.. ఇప్పుడు 30

షర్మిల గురువారం సాయంత్రం దొడ్డిమేకల ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామస్తులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. వారంతా తమకు కరువు పనికింద రూ. 30 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారి కష్టాలు విన్న షర్మిల.. ఇది శ్రమదోపిడీ అని, రాబందుల రాజ్యమని, ఈ ప్రభుత్వం మహిళలను హింసిస్తోందని మండిపడ్డారు. వారితో సంభాషణ ఇలా సాగింది..

షర్మిల: కరువు పని దొరుకుతోందా?

మహిళలు: కొద్దిరోజులే దొరుకుతుంది. దొరికినా రూ. 30 మాత్రమేకూలి ఇస్తున్నారు. పనులు లేక వలసలు పోవాల్సి వస్తోంది.

షర్మిల: రాజన్న ఉన్నప్పుడు రూ. 120 వరకూ వచ్చేది. ఇప్పుడు రూ. 30 మాత్రమే ఇస్తున్నారు. దీన్నే శ్రమదోపిడీ అంటారు. రాబందుల రాజ్యం ఇది. మహిళలను హింసిస్తోంది ఈ ప్రభుత్వం. కరువు పనులు ఇవ్వరు. రుణాలు ఇవ్వరు. పైగా వడ్డీ లేని రుణాలంటారు. 

మహిళలు: మాకు పావలా వడ్డీ కింద రుణాలు రావడం తక్కువే. వచ్చినా మేం కట్టేది రూ.2 వడ్డీ పడుతోంది. బయట తెచ్చుకోవాలంటే రూ.5 వడ్డీ పడుతోంది.

మరో మహిళ: నా భర్త కరెంట్ షాక్‌తో చనిపోయి ఆరు నెలలైంది. ప్రమాదవశాత్తూ చనిపోతే రూ. 50 వేలు వస్తాయన్నారు. అవి రావడానికి రూ.10 వేల వరకు ఖర్చు చేసినా ఇంతవరకు ఆ డబ్బులే రాలేదు. వితంతు పెన్షన్ కూడా రావడం లేదు.

షర్మిల: బాధపడకమ్మా.. జగనన్న సీఎం అయ్యాక వృద్ధులు, వితంతువులకు రూ. 700, వికలాంగులకు రూ. 1,000 పెన్షన్ ఇస్తాడు. పిల్లలను చదివిస్తే పదో తరగతి వరకు రూ.500, ఇంటర్ అయితే రూ. 700, డిగ్రీ అయితే రూ. 1,000 చొప్పున తల్లి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. పిల్లలను చదివించడం మాత్రం ఆపొద్దు. మీ కుటుంబాలు బాగుపడాలంటే పిల్లలను చదివించాలి.

మహిళలు: ఈ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం సరిగ్గా ఉండడం లేదు. పురుగులు వస్తున్నాయి. దాదాపు 200 మంది పిల్లలు వేరే ఊళ్లకు వెళ్లి చదువుకుంటున్నారు. వారికి బస్సులు లేవు. 

షర్మిల: ఎమ్మెల్యే ఈ విషయం మాట్లాడి భోజనం సరిగ్గా ఉండేలా చూస్తారు. బస్సుల గురించి ఎమ్మెల్యే ఇప్పటికే మాట్లాడారట. కానీ ఈ సర్కారు సామాన్యుడి సంగతి పట్టించుకునే పరిస్థితి లేదు. కరెంటు పరిస్థితి ఎలా ఉంది?

మహిళ: బిల్లులెక్కువ. కరెంటు తక్కువ.
షర్మిల: ఎంతొస్తుంది బిల్లు.. కరెంటు ఎంతసేపు వస్తోంది?
మహిళ: బిల్లు రూ. 200 వస్తుంది. కరెంటు మాత్రం నాలుగు గంటలు కూడా ఉండదు.
షర్మిల: పంటల పరిస్థితి ఏంటి?
మహిళ: మీ నాయన ఉన్నప్పుడు వానలు బాగా పడేవి. పంటలు బాగా పండేవి. ఇప్పుడు పంటలు లేవు. తినడానికి తిండి లేదు. వానలు లేక బుడ్లు(వేరుశనగ) ఎండిపోయాయి. పత్తి ఎండిపోయింది.
షర్మిల: రాజు మంచోడైతే దేవుడు కూడా దీవిస్తాడు. వర్షాలు కూడా బాగా పడతాయి.
Share this article :

0 comments: