‘మరో ప్రజా ప్రస్థానంలో’ షర్మిలతో అన్నదాత ఆవేదన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘మరో ప్రజా ప్రస్థానంలో’ షర్మిలతో అన్నదాత ఆవేదన

‘మరో ప్రజా ప్రస్థానంలో’ షర్మిలతో అన్నదాత ఆవేదన

Written By news on Sunday, November 11, 2012 | 11/11/2012

అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం
పరిస్థితులు ఇలాగే ఉంటే బతకలేం
రైతు పరిస్థితి చూసి షర్మిల కంట తడి
మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని భరోసా
ప్రభుత్వంతో కుమ్మక్కై బాబు అవిశ్వాసం పెట్టడం లేదంటూ ధ్వజం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’శనివారం యాత్ర ముగిసేనాటికి..రోజులు: 24, కిలోమీటర్లు: 310

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘పది ఎకరాలు గుత్తకు తీసుకుని పప్పు శనగ పంట వేశానమ్మా... గుత్త కోసం ఎకరాకు రూ. 8 వేలు ఇవ్వాలి. పెట్టుబడి ఎకరాకు రూ.7,200 చొప్పున పెట్టాను. ఈ ఏడాది సబ్సిడీ కింద రావాల్సిన శనగలు 20 రోజులు ఆలస్యంగా పంపిణీ చేశారు. దీంతో ఎక్కువ ధరతో ముందే కొనాల్సి వచ్చింది. దళారులకు అమ్ముకోవడం కోసమే వీళ్లు ఆలస్యంగా తెస్తున్నారు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రూ. 400గా ఉన్న ఎరువుల బస్తా ఇప్పుడు రూ. 1,200 అయ్యింది. విత్తనాలు మూడు రెట్లు పెరిగాయి. ఇంత పెట్టుబడి పెడితే.. ఆ డబ్బు కూడా రావట్లేదు. వర్షాలు లేక రెండేళ్లుగా పంట చేతికి అందలేదు. అప్పులు మాత్రం ఏటా పెరిగి మా బతుకులు బజారున పడ్డాయి. మళ్లీ బాగా బతుకుతామన్న భరోసా లేదు. ఇక ఆత్మహత్యలే గతి. చావడం తప్ప ఇంకో పరిష్కారం లేదనిపిస్తోంది’’ అని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని రాతన గ్రామ రైతు నాగరాజు.. వైఎస్సార్ సీపీ నేత షర్మిల ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కుమ్మక్కయిన కాంగ్రెస్, టీడీపీల రాజకీయాలకు నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా ఆమె 24వ రోజు శనివారం రాతన గ్రామం మీదుగా వెళ్లారు. 

అక్కడ చేలో పనిచేసుకుంటున్న రైతు నాగరాజు చూసి ఆమె వద్దకు వచ్చి తన బాధలు చెప్పుకొన్నారు. అతడు చావు తప్ప మరో పరిష్కారం లేదనడంతో షర్మిల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఉబికి వచ్చిన కన్నీరును ఆపుకొంటూ.. ‘వద్దన్నా.. ఆ మాట అనొద్దు.. ’ అని ఆమె ఓదారుస్తుండగా.. ‘అప్పు కడతారా? ఇల్లు రాసిస్తారా? అని అప్పు తీసుకున్నచోట అడుగుతున్నారమ్మా..’ అంటూ నాగరాజు ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల స్పందిస్తూ ‘రాజన్న కొడుకున్నాడని మరచిపోకన్నా.. మళ్లీ రాజన్న రాజ్యం తెస్తాడు. అంతవరకు ధైర్యంగా ఉండాలన్నా. రైతులందరికీ నాదొక్కటే మనవి. ప్రాణాలు చాలా విలువైనవి. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మంచికాలం మళ్లీ వస్తుంది. రాజన్న ఉన్నప్పుడు రైతుకు ఎంత చేసినా తక్కువే అని ఆలోచించేవాడు. జగనన్న కూడా రైతు క్షేమమే తలుస్తున్నాడు..’ అని భరోసా ఇచ్చారు.

పత్తికొండ జనసంద్రం: పత్తికొండ జనసంద్రంగా మారింది. సాయంత్రం బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. రాత్రి 7.20కి పత్తికొండ శివారులో ఏర్పాటుచేసిన రాత్రి బసకు షర్మిల చేరుకున్నారు. శనివారం పాదయాత్ర 13.2 కి.మీ.మేర సాగింది. ఇప్పటివరకు 310 కి.మీ. పాదయాత్ర పూర్తయింది. కాగా వైఎస్ అభిమాని ఒ.ఎస్.ఆర్.కుమార్ రచించి, రూపొందించిన ఆడియో సీడీని షర్మిల ఆవిష్కరించారు. ఈ గీతాన్ని సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ ఆలపించగా.. అనూప్ సంగీతం అందించారు. యాత్రలో ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, బాలనాగిరెడ్డి, రాజేశ్, పార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, గౌరు వెంకటరెడ్డి, గోపాల్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, ప్రసాదరాజు, ఎస్వీ మోహన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మలాకుమారి, జనక్‌ప్రసాద్, కోట్ల హరిచక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. శనివారం రాత్రి మాజీ మంత్రి కొండా సురేఖ షర్మిలను కలిశారు.

బాబు మాటలు వారి ఎమ్మెల్యేలే నమ్మట్లేదు

టీడీపీ అధినేత చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఆయన మాటలను ఆయన పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదని షర్మిల విమర్శించారు. శనివారం సాయంత్రం 5.10కి పత్తికొండ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్న షర్మిల అక్కడికి భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘మేం గర్వంగా చెప్పగలుగుతాం. రాజన్న రాజ్యం మళ్లీ తెస్తామని. కానీ చంద్రబాబు నాయుడు చేసింది చెప్పుకోలేకపోతున్నారు. పైగా రాజశేఖరరెడ్డిలా అన్ని పథకాలూ అమలు చేస్తానని చెప్పకనే చెబుతున్నారు. కానీ ఆయన మాటలను ఆ పార్టీ ఎమ్మెల్యేలే నమ్మడం లేదు. అందుకే వాళ్లు మా పార్టీలోకి వస్తున్నారు. చంద్రబాబుకు పాదయాత్ర అవసరమే లేదు. అవిశ్వాసం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేందుకు ఆయనకు ఎమ్మెల్యేలు ఉన్నారు. 

కానీ ఆయన పెట్టరు. ఎందుకు పెట్టరో చెప్పరు’’ అని విమర్శించారు. ‘‘ఈయన అవిశ్వాసం పెట్టరు. వాళ్లు ఈయనపై కేసులు పెట్టరు. అందుకే.. రెండెకరాల చంద్రబాబు ఇన్ని ఆస్తులు ఎలా కూడబెట్టారని కమ్యూనిస్టులు పుస్తకం ప్రచురించినా.. దానిపై విచారణ ఉండదు. అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడని తెహల్కా వెబ్‌సైట్ ప్రచురించినా.. విచారించరు. ఎకరా రూ. 2 కోట్ల విలువ చేసే భూములను ఎకరా రూ. 50 వేలకే తన బినామీ సంస్థ అయిన ఐఎంజీకి కట్టబెట్టినా.. ఆయన్ను విచారించరు. ఎందుకు విచారణ చేయరని మనం కేసు వేస్తే కోర్టులో జడ్జి గారు కూడా ఎందుకు చేయరని సీబీఐని ప్రశ్నించారు. కానీ సీబీఐ సిబ్బంది లేరని చెప్పింది. జగనన్న మీద, ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్ల మీద దాడులు జరపడానికి సిబ్బంది ఉంటారు. కేవలం ఫోన్ కాల్స్ ట్యాప్ చేయడానికే 2 వేల మంది సిబ్బందిని పెట్టారు. కానీ చంద్రబాబుపై విచారణ చేయడానికి వాళ్లకు సిబ్బంది ఉండరు. మీ చీకటి ఒప్పందాలు, రహస్య రాజకీయాలు బట్టబయలయ్యాయి..’’ అని ఆమె దుయ్యబట్టారు.

ఒక రోజు కూలి రూ.12..

‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శనివారం సాగిన మార్గం మధ్యలో పలుచోట్ల వ్యవసాయ కూలీలు షర్మిలను కలిసి తమ బాధలు చెప్పుకొన్నారు. ‘కరువు పనులు లేవు. పోయినా రూ. 30, రూ. 40 కూలి పడుతోంది. ఒక రోజైతేరూ. 12 మాత్రమే వచ్చింది. అడిగితే మీకు దిక్కున్నచోట చెప్పుకోండంటారు. ఇందులో రవాణా చార్జీలకే నాలుగైదు రూపాయలు పోతాయి. అందుకే గుంటూరు జిల్లాకు మిర్చి ఏరడానికి వలస వెళతాం..’ అని తెలిపారు. షర్మిల స్పందిస్తూ ‘అసలు మనుషులేనా మీరు అని ఆ అధికారుల్ని అడగాల్సింది. రూ. 12 కూలితో ఎలా బతుకుతారు? ఏం అవ్వా.. ఈ వయసులో కూడా కూలి పనికి వచ్చావా.. నిన్ను చూస్తుంటే మనసుకు కష్టంగా ఉందమ్మా..’ అనేసరికి.. ‘‘కష్టం చేస్తేనే కడుపులోకి మెతుకులుపోయేది.. ఉన్న పెన్షన్ కూడా పోయింది..’ అని ఆమె వాపోయింది. దీనికి షర్మిల స్పందిస్తూ ‘ఇది రాక్షస రాజ్యం. నీళ్లు ఉండవు. పంటలు పండవు. పనులు ఇవ్వరు. ఉన్న పెన్షన్ తీసేస్తారు..’ అని సర్కారు తీరును ఎండగట్టారు.

మాతా శిశు సంరక్షణకు మంగళం..

తుగ్గలి దాటాక షర్మిలను కర్నూలు జిల్లాకు చెందిన మహిళా ఆరోగ్య కార్యకర్తలు కలిశారు. ‘రాజశేఖరరెడ్డి పెట్టిన మాతాశిశు సంరక్షణ ఇప్పుడు సరిగ్గా అమలుకావడం లేదు. చాలా పనిభారం పెట్టడంతో ఈ పథకం అంతంతమాత్రంగా అమలవుతోంది. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మమ్మల్ని రెగ్యులర్ చేశారు. అయితే పదేళ్ల సర్వీసు నిండిన కార్యకర్తలను రెగ్యులర్ చేయాలని కోరితే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మాకు భద్రత లేకుండాపోయింది. 10 నెలలుగా కాంట్రాక్టు వర్కర్లకు వేతనాలు లేవు. కానీ పని మాత్రం చేయించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఒక్కరే సిబ్బంది ఉంటే.. పర్యవేక్షించేది మాత్రం ప్రోగ్రామ్‌కు ఒక్కరు చొప్పున పది మంది ఉంటారు..’ అని వాపోయారు. ఈ కష్టాలు త్వరలోనే పరిష్కారమవుతాయని షర్మిల అన్నారు.
Share this article :

0 comments: