వైఎస్ వల్లే కాంగ్రెస్‌కు ఢిల్లీ పీఠం: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ వల్లే కాంగ్రెస్‌కు ఢిల్లీ పీఠం: షర్మిల

వైఎస్ వల్లే కాంగ్రెస్‌కు ఢిల్లీ పీఠం: షర్మిల

Written By news on Saturday, November 17, 2012 | 11/17/2012

వైఎస్ మరణిస్తే తట్టుకోలేక వందల గుండెలు ఆగిపోయాయి
ఆ బాధిత కుటుంబాలను ఓదార్చుతామన్న కాంగ్రెస్ నేతలు తర్వాత మర్చిపోయారు
ఈ ప్రభుత్వం ఒక్క రాజన్న కుటుంబాన్నే కాదు.. ప్రజలందరినీ కక్షగట్టి ిహ ంసిస్తోంది
అవిశ్వాసం పెట్టాల్సిన చంద్రబాబు.. ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 30, కిలోమీటర్లు: 388.90

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న తండ్రిలా తన రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించాడు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చేసి చూపించాడు. ఒకటి కాదు, రెండు కాదు 30 ఏళ్లు కాంగ్రెస్‌కు సేవ చేసి.. రెండు సార్లు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందంటే.. రాజన్న ఇచ్చిన ఎంపీల వల్ల కాదా? అని అడుగుతున్నాం. మరి అలాంటి రాజన్న చనిపోతే కొన్ని వందల గుండెలు తట్టుకోలేక బాధతో ఆగిపోతే.. ఒక్కరంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు.. ఒక్కటంటే ఒక్క కుటుంబాన్నైనా ఓదార్చారా? బాధిత కుటుంబాలను ఓదార్చుతామని చెప్పి, డబ్బు సాయం చేస్తామని చెప్పి.. వాళ్లని మరిచిపోయారు. చనిపోయిన వాళ్లంతా కాంగ్రెస్ పార్టీ వాళ్లే. అయినా పట్టించుకోలేదు ఆ పార్టీ’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ప్రజా సంక్షేమం పట్టని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దానిపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండాఆ సర్కారుతోనే కుమ్మక్కైన టీడీపీ రాజకీయాలకు నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 30వ రోజు శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలో సాగింది. సాయంత్రం ఎమ్మిగనూరులో జరిగిన భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

వైఎస్‌ను దోషిగా నిలబెట్టే యత్నం..

‘‘రాజశేఖరరెడ్డి ఏ పథకం తెచ్చినా ఇందిరాగాంధీ అని, రాజీవ్ గాంధీ అని వాళ్ల పేర్లే పెట్టాడు. అందుకు బహుమానంగా రాజశేఖరరెడ్డి గారి పేరును దోషిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఇది అన్యాయం కాదా? ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాం. రాజశేఖరరెడ్డి గారి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి.. మీ గుండెల్లో ఆయనను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క రాజన్న కుటుంబాన్నే కాదు.. రాష్ట్ర ప్రజలందరి మీదా కక్షగట్టి హింసిస్తోంది. ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేనే లేదు..’’ అని షర్మిల విమర్శించారు.

సిగ్గులేకుండా మరో అవకాశం ఇవ్వాలంటున్నాడు..

‘‘చంద్రబాబు హయాంలో వందల మంది చేనేత కార్మికులు, 4 వేల మంది రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు రాజన్న వారి కుటుంబాలకు సాయం చేయాలని చంద్రబాబును అడిగితే పైసా కూడా సాయం చేయలేదు. రాజన్న అధికారంలోకి వచ్చాక వారికి లక్షన్నర చొప్పున నష్ట పరిహారం ఇచ్చాడు. చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలాడుతున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి అదే గ్రామాల మీదుగా వెళుతూ ఇప్పుడు సిగ్గు లేకుండా మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. నా మాట నమ్మాలంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. ప్రజలు అమాయకులు కాదు. చంద్రబాబు అనుకుంటున్నట్టు పిచ్చోళ్లు అంతకన్నా కాదు’’ అని షర్మిల నిప్పులు చెరిగారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టినట్టు నటిస్తూనే మిత్రపక్షంగా ఉంటూ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజూ అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు పెంచిపోషిస్తున్నారు..’’ అని షర్మిల మండిపడ్డారు.

కిక్కిరిసిన ఎమ్మిగనూరు..

ఉదయం 10.30కు హెచ్.మురవణి శివారులో ప్రారంభమైన పాదయాత్రలో తొలుత అక్కడి స్థానికులతో షర్మిల రచ్చబండ నిర్వహించారు. అక్కడి నుంచి నాలుగో మైలు(కంబదహాళ్ క్రాస్), కొత్తగొలలదొడ్డి మీదుగా సాయంత్రం ఎమ్మిగనూరు చేరుకున్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో శివారు నుంచే ప్రజలు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 5.30కు ఎమ్మిగనూరులో జరిగిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. అక్కడ సభలో మాట్లాడిన తరువాత రాత్రి 7 గంటలకు శివారులోని రైస్‌మిల్లు వద్ద ఏర్పాటుచేసిన రాత్రి బసకు ఆమె చేరుకున్నారు. శుక్రవారం 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు 30 రోజుల్లో మొత్తం 388.90 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తయింది.

షర్మిల పాదయాత్రలో ప్రముఖులు

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: షర్మిల పాదయాత్రలో శుక్రవారం మాజీ మంత్రి, పార్టీ సీజీసీ సభ్యుడు కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం నుంచి షర్మిల వెంట యాత్రలో నడుస్తున్నారు. విశాఖ పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, పార్టీ నేత తిప్పల నాగిరెడ్డి, ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి, ప్రకాష్ బాబు, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, వై. బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, సాయి ప్రసాద్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఉదయం పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బస చేసిన క్యాంప్‌కు వచ్చి ఆమెతో మాట్లాడి వెళ్లారు.
Share this article :

0 comments: