మరో ప్రజాప్రస్థానంలో షర్మిలతో గోడు వెళ్లబోసుకున్న ఉల్లి రైతులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో ప్రజాప్రస్థానంలో షర్మిలతో గోడు వెళ్లబోసుకున్న ఉల్లి రైతులు

మరో ప్రజాప్రస్థానంలో షర్మిలతో గోడు వెళ్లబోసుకున్న ఉల్లి రైతులు

Written By news on Monday, November 12, 2012 | 11/12/2012

ఈ అప్పుల కుప్పలు మోయలేం.. పంట చేతికొచ్చే సరికే ధరలు పడిపోతున్నాయి
రాజన్న ఉన్నప్పుడు బంగారు పంట పండేది ఇప్పుడు పెట్టుబడిలో సగం కూడా వచ్చేలా లేదు
రైతులను గాలికొదిలేసిన ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎందుకు దించడం లేదని షర్మిల ప్రశ్న
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ఆదివారం యాత్ర ముగిసేనాటికి..రోజులు: 25, కిలోమీటర్లు: 325.2

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అన్న వచ్చే వరకు అన్నం పెట్టేదెవరమ్మా.. అప్పటివరకు మేమెలా బతకాలి? ఈ అప్పులను ఎలా మోయాలి’’ అంటూ ఉల్లి రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలిన ప్రభుత్వం, ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైన టీడీపీ కుటిల రాజకీయాలకు నిరసనగా చేపట్టిన మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల 25వ రోజు ఆదివారం కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేశారు. 

ఉదయం పత్తికొండ శివారు నుంచి బయలుదేరిన షర్మిలకు చిన్నహుల్తీ గ్రామానికి చెందిన ఉల్లి రైతులు కనిపించగా అక్కడికి వెళ్లి వారి సాదకబాదకాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండెకరాలు కౌలుకు తీసుకుని, రూ.50 వేలు పెట్టుబడి పెట్టిన దస్తగిరి అనే రైతు మాట్లాడుతూ.. ‘‘ఉల్లి చేతికొచ్చింది. కానీ నీళ్లు అందక గడ్డ చిన్నగా ఊరింది. నిన్నామొన్న ఉల్లి ధర చాలా పడిపోయిందట. పంట చేతికొచ్చేసరికి ఇలా అయ్యింది. క్వింటాలుకు రూ.700 పడే ఉల్లికి.. ఇప్పుడు రూ. 300, 400 పడుతోందట. నిన్న తాడేపల్లిగూడెం వెళ్లిన ఓ రైతు లారీ ఖర్చు కూడా వచ్చేలా లేదని ఉల్లి లారీనీ అక్కడే వదిలేసి వెళ్లాడట. పరిస్థితి ఇంత దారుణంగా ఉంది..’’ అని అన్నారు. వైఎస్ ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉండేదా అని షర్మిల అడగ్గా... ‘‘రాజన్న ఉన్నప్పుడు బంగారు పంట పండేది. అప్పుడు పంట మీద ఏ నష్టమూ లేదు. కానీ ఇప్పుడు పెట్టుబడిలో సగం కూడా వచ్చేలా లేదు’’ అని ఆ రైతు వాపోయాడు. 

దస్తగిరి కోడలు లక్ష్మి మాట్లాడుతూ.. ‘‘పత్తికి కూడా ధర లేదు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు పలికిన పత్తికి ఇప్పుడు ధర లేదు. కౌలుకు తీసుకుని పంటలు పండిస్తే మిగిలేది సున్నా. ఇంక మందు తాగి చచ్చిపోవడం తప్ప మిగిలిందేమీ లేదు. పూర్తిగా నష్టపోయాం. అప్పులు మాత్రం మిగిలాయి.. ’’ అంటూ కన్నీటి పర్యంతమైంది. అందుకు షర్మిల స్పందిస్తూ.. రాజన్న కొడుకుగా జగనన్న కూడా రైతుకు ఏ కష్టమూ రాకుండా చూసుకుంటాడని భరోసా ఇచ్చారు. ‘‘అన్న తొందరగా రావాలనే కోరుకుంటున్నామమ్మా. కానీ అప్పటివరకు అన్నం పెట్టేదెవరు? అప్పటిదాకా బతకాలి కదమ్మా.. చావు తప్ప మాకు మరో మార్గం లేదు’’ అని లక్ష్మి అనడంతో షర్మిల... ‘‘ప్రాణం చాలా విలువైందమ్మా.. ఈ సర్కారు ఎంతోకాలం ఉండదు.. ధైర్యంగా ఉండమ్మా..’’ అని ధైర్యం చెప్పి ముందుకు సాగారు. 

ఐఎంజీపై విచారణ జరిపించరేం?: ఆలూరు నియోజకవర్గ పరిధిలోని ఆస్పరిలో సాయంత్రం జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ‘‘చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించేందుకు ఆయనకు కావాల్సినంత ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆయన అవిశ్వాసం పెట్టరట. ప్రభుత్వాన్ని దించరట. ఉదయం ఒక రైతన్నను కలిశాం. బతుకు భారమైందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆత్మహత్యలే శరణ్యమన్నాడు. రాజన్న రాజ్యం వస్తుందని, జగనన్న వస్తాడని చెబితే అంతవరకు మేం ఎలా బతకాలమ్మా అని రోదించాడు. మనసుకు చాలా బాధేసింది. చంద్రబాబుకు ఈ ప్రభుత్వాన్ని దించేసే శక్తి ఉంది. కానీ దించరు. దించేస్తే ప్రజలు జగనన్న మీద ప్రేమతో వైఎస్సార్‌సీపీని గెలిపిస్తారని కుట్ర పన్ని కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు. అందుకే అవిశ్వాసం పెట్టడం లేదు. ప్రతిఫలంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చంద్రబాబుపై కేసులు పెట్టదు. విచారణ జరిపించదు. 

కేజీ బేసిన్ గ్యాస్ మనకు దేవుడిచ్చిన వరం. మన రాష్ట్ర విద్యుత్తు అవసరాలన్నీ దానితో తీరుతాయి. ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా చవకగా గ్యాస్ కూడా సరఫరా చేయొచ్చు. కానీ లక్షల కోట్ల విలువైన గ్యాస్‌ను చంద్రబాబు రిలయన్స్‌కు కట్టబెట్టారు. దీనిపై ఈ ప్రభుత్వం విచారణ జరిపించదు. ఎకరాకు రూ. 2 కోట్లు పలికే 850 ఎకరాల భూమిని చంద్రబాబు ఐఎంజీ అనే తన బినామీ సంస్థకు ఎకరా రూ. 50 వేల చొప్పున కట్టబెడితే దానిపై విచారణ జరిపించరు. రెండెకరాల నుంచి ఇన్ని వేల కోట్లు చంద్రబాబు ఎలా సంపాదించారని కమ్యూనిస్టులు ఆరోపిస్తే దానిపై విచారణ జరిపించరు. చంద్రబాబును మించిన ధనవంతుడైన రాజకీయ నాయకుడు లేడని తెహల్కా వెబ్‌సైట్ ఆరోపిస్తే దానిపై విచారణ జరిపించరు. కానీ జగనన్నపై అబద్ధపు కేసులు పెట్టి సీబీఐని వాడుకుని నీచమైన రాజకీయాలకు దిగారు..’’ అని షర్మిల మండిపడ్డారు.

హంద్రీనీవా 5 శాతం పనులకు మూడేళ్లా?

‘ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులయ్యారు.ప్రధానమంత్రులయ్యారు. రాష్ట్రపతులయ్యారు. కానీ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే హంద్రీనీవా ప్రాజెక్టు మాత్రం సాకారం కాలేదు. చంద్రబాబు రెండుసార్లు శంకుస్థాపన చేసి గాలికి వదిలేశారు. ఒక్క రాజశేఖరరెడ్డి గారు మాత్రమే చిత్తశుద్ధి ఉన్న మనిషిగా రూ.4 వేల కోట్లతో 95% పనులు పూర్తిచేశారు. ఇంకో రూ. 45 కోట్లు వెచ్చిస్తే మొదటి విడత పనులు పూర్తయ్యేవి. కానీ కొన్ని పనులు పూర్తిచేయడానికి మూడేళ్ల సమయం ఈ ప్రభుత్వానికి సరిపోలేదు. సీఎం వచ్చి ఇప్పుడు ప్రారంభిస్తారట. మంత్రి రఘువీరారెడ్డి గారు వచ్చి పాదయాత్ర చేస్తూ గేట్లు తెరుచుకుంటూ వెళతారట..’’ అని ఎద్దేవా చేశారు. ఇక్కడ గిట్టుబాటు లేక టమాటాను రోడ్లపై పారబోసే దుస్థితి ఉందని, జగనన్న వచ్చాక రైతుకు గిట్టుబాటయ్యేలా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాడని చెప్పారు.

పాదయాత్రకు ఘనస్వాగతం..: ఉదయం పత్తికొండ నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తయ్యాక భోజన విరామం అనంతరం ఆలూరు నియోజకవర్గంలో షర్మిల అడుగుపెట్టారు. ఆ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. సాయంత్రం ఆస్పరిలో జరిగిన బహిరంగ సభ వరకు జనం ర్యాలీగా తరలిరావడంతో ఆస్పరి కిక్కిరిసిపోయింది. బహిరంగ సభ అనంతరం చిరుమానుదొడ్డి సమీపంలో ఏర్పాటుచేసిన రాత్రి బసకు షర్మిల 7.20కి చేరుకున్నారు.
Share this article :

0 comments: