- వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ హెచ్చరిక
- నరసరావుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
నరసరావుపేటవెస్ట్ : మూడువేల బస్తాల రేషన్ బియ్యం పట్టివేత, కాకాని గ్రామంలో మాజీ ఎంపీపీ తల్లి తన్నీరు నాగేంద్రమ్మపై దాడిచేసిన కేసుల్లో అసలైన దోషులను వెంటనే అరెస్టుచేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అధికార పక్షం ఒత్తిళ్ళకు తలొగ్గి వ్యవహరిస్తున్న డీఎస్పీ, ఆర్డీవోలపై లోకాయుక్తకు ఫిర్యాదుచేస్తామని హెచ్చరించారు. రెండు కేసుల్లో అసలైన దోషులను అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అంటేనే దాడులు చేయటం, దోచుకోవటం, దాచుకోవటమనే నానుడి నిత్యకృత్యమైపోయిందన్నారు. పట్టుకోవాల్సిన అధికారులు అన్నీ తెలిసి కళ్ళప్పగించి చూస్తుంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి స్వయంగా 3వేల బస్తాల రేషన్ బియ్యం పట్టుకొని అప్పచెబితే నిజమైన దోషులను వదిలిపెట్టి అనామకులను అరెస్టుచేసి కేసును నీరుగారుస్తున్నారన్నారు.
ఇందులో స్థానిక టీడీపీ నేతలకు సంబంధముందనేది జగమెరిగిన సత్యమన్నారు. పోలీసు వ్యవస్థ ఇంతదారుణంగా వ్యవహరించటం తానెన్నడూ చూడలేదన్నారు. గతంలో ఏ స్పీకర్పైనా రాని ఆరోపణలు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణపై విన్పిస్తున్నాయని చెప్పారు. నరసరావుపేట మార్కెట్యార్డులో కొనసాగే పశువుల సంతను చిలకలూరిపేటలో సంతను నిర్వహించే ప్రైవేటు వ్యక్తికి రూ.30లక్షలకు అమ్ముకొన్నారన్నారు. ఇంతజరుగుతున్నా జిల్లా కలెక్టర్, మార్కెట్యార్డు డెరైక్టర్లు ఏమిచేస్తున్నారని ప్రశ్నించారు. నాగార్జునసాగర్ ఆయకట్టును ఎండగట్టి రాయలసీమకు నీరిస్తామంటే ఒప్పుకునేదిలేదని, నీటిని విడుదల చేసి నరసరావుపేట డివిజన్లో పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.
పూర్తి బాధ్యత వహించాలి...
ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రేషన్ బియ్యం, కాకానిలో వృద్ధురాలిపై దాడి కేసుల్లో అధికారులు పూర్తిగా బాధ్యత వహించాల్సి వుంటుందని హెచ్చరించారు. డీలర్ల ప్రమేయంలేకుండా రేషన్బియ్యం అక్రమ రవాణా జరగదని, అటువంటి వారితో కూడిన 80 మంది డీలర్ల పేర్లు తన వద్ద ఉన్నాయని, వీరందరిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే నరసరావుపేట నుండి పోటీచేయాలని టీడీపీ వారికి ఆయన సవాల్ విసిరారు. ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. పార్టీ వినుకొండ నియోజకవర్గ కన్వీనర్ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ప్రతి రంగంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు నూరుల్ అక్తాబ్, ఎంపీపీ కె.ప్రభాకరరావు, మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్రెడ్డి, మండల కన్వీనర్ కొమ్మనబోయిన శంకరయాదవ్, జిల్లా కార్యదర్శి యస్.సుజాతాపాల్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment