చెప్పిన ప్రతి పనీ, చెప్పని పనీ చేసి చూపిస్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చెప్పిన ప్రతి పనీ, చెప్పని పనీ చేసి చూపిస్తా

చెప్పిన ప్రతి పనీ, చెప్పని పనీ చేసి చూపిస్తా

Written By news on Saturday, March 15, 2014 | 3/15/2014

* రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో తెలుసా?
చంద్రబాబు హామీలపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
పదవి కోసం ఏ గడ్డయినా తినే వ్యక్తి చంద్రబాబు
ఇంటికో ఉద్యోగమిస్తానని అబద్ధాలు చెబుతున్నారు
అంటే మూడున్నర కోట్ల ఉద్యోగాలిస్తారట..
అధికారంలో ఉండగా ఉద్యోగాలు పీకేశారు..
ఆయనకు విశ్వసనీయత లేదు
నేను చంద్రబాబులా దొంగ హామీలివ్వను..
వారసత్వంగా నాకు వచ్చింది విశ్వసనీయత..
చెప్పిన ప్రతి పనీ, చెప్పని పనీ చేసి చూపిస్తా
రాష్ట్రాభివృద్ధికి డబ్బులిచ్చే వారినే ప్రధానిని చేద్దాం
30 ఎంపీ స్థానాలు గెలుచుకుని మనమే సింగపూర్ కట్టుకుందాం
 సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘అధికారం పోయింది కదా.. చంద్రబాబులో ఏమైనా మార్పు వచ్చిందా అని చూస్తే.. ఇవాళ్టికీమార్పు అనేది లేకుండా పోయింది. ప్రజలను ఎలా మోసం చేయాలా అని ఆయన పన్నాగాలు పన్నుతున్నారు. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. అయ్యా చంద్రబాబూ.. రాష్ట్రంలో అసలు ఎన్ని ఇళ్లు ఉన్నాయో తెలుసా? అక్షరాలా మూడున్నర కోట్ల ఇళ్లున్నాయి. అంటే ఆయన మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ‘‘ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారు. ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23,500 మంది ప్రభుత్వోద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించారు. అంగన్‌వాడీ టీచర్లు జీతాలు పెంచాలని అడిగితే గుర్రాలతో తొక్కించారు.
 
 ఇప్పుడేమో ప్రజలను మోసం చేయడానికి ఇలా సాధ్యంకాని హామీలిస్తున్నారు. ఆ మనిషిని ఏమనుకోవాలి? ఇప్పటికీ కూడా అన్నీ ఫ్రీగా ఇస్తానని హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు కళ్లార్పకుండా ఒకే అబద్ధాన్ని వందసార్లైనా చెప్పగల సమర్థుడు. ఆయన వయసు 60 సంవత్సరాలు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చెప్పి.. చివరకు ప్రజలకు వెన్నుపోటు పొడవడానికి కూడా ఆయన ఏమాత్రం వెనుకాడడం లేదు’’ అని ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం స్టీమర్‌రోడ్డులో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ బహిరంగ సభలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
 ఊరిలో ఒకరు చనిపోతేనే మరొకరికి పెన్షన్..
 వైఎస్ సువర్ణయుగానికి ముందు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఉండేవాడు. అవ్వాతాతలకు ముష్టి వేసినట్లు రూ.75 పెన్షన్ ఇచ్చేవారు. ఒక ఊళ్లో పెన్షన్ తీసుకుంటున్న వారిలో ఎవరో ఒకరు చనిపోతే కానీ కొత్తవారికి పెన్షన్ ఇవ్వలేమని అధికారులు చెప్పేవారు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదివే పిల్లల ఫీజులు కట్టాలంటే.. తల్లిదండ్రులు ఉన్న పొలం, ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేది. గ్రామాల్లో హఠాత్తుగా ఏ పెద్దాయనకన్నా గుండెనొప్పి వచ్చి ఆస్పత్రికి తీసుకెళితే ఆపరేషన్ చేయడానికి రెండు లక్షలవుతుందని ఆ డాక్టర్ నిర్దాక్షిణ్యంగా చెప్పేవాడు. ఆ డబ్బు కోసం ఆ కుటుంబసభ్యులు ఐదు రూపాయల వడ్డీకైనా అప్పు తెచ్చి కట్టేవారు. ఆ డబ్బుతో ఆ పెద్దాయన ప్రాణాలు దక్కేవేమోకానీ ఆ అప్పు తీర్చడానికి ఆ కుటుంబ సభ్యులు జీవితాంతం ఊడిగం చేసిన రోజులు నాకు గుర్తున్నాయి. డ్వాక్రా మహిళలను ఎన్నికల సమయంలో చంద్రబాబు ఓట్ల కోసం వాడుకునేవారు. చంద్రబాబుకు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియదు.
 
 రుణ మాఫీ అంటూ చంద్రబాబు మళ్లీ అబద్ధాలు..
 అధికారం పోయిన తర్వాత కూడా చంద్రబాబులో మార్పు రాలేదు. ఆయన అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే రైతన్నల రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెబుతున్నారు. చంద్రబాబు రైతు రుణాలు మాఫీ చేస్తానంటున్నారు కదా మీరు కూడా అలా చెప్పండి సార్ అని చాలామంది నన్ను అడిగారు. రాష్ట్రంలో రైతన్నల రుణాలు లక్షా 27 వేల కోట్లున్నాయి. డ్వాక్రా రుణాలు రూ.20 వేల కోట్లున్నాయి. ఆయన ఉచిత హామీలు చాలా ఇస్తున్నారు. 2008లో దేశం మొత్తం మీద 28 రాష్ట్రాల్లో రూ.65 వేల కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసింది. అందులో మన రాష్ట్రంలో అప్పులు కట్టలేక దివాలా తీసిన రైతులకు సంబంధించి రూ.12 వేల కోట్ల రుణాలను మాత్రమే మాఫీ చేశారు. కేంద్ర ప్రభుత్వమే రూ.65 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే.. చంద్రబాబు రూ. లక్షా 27 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తోంది. రాష్ట్ర బడ్జెట్ లక్షా 25 వేల కోట్లు. చంద్రబాబు మాఫీ కార్యక్రమాలు అమలు చేయాలంటే రూ.లక్షా 60 వేల కోట్ల దాకా కావాలి. పదవి కోసం ఏ గడ్డయినా తినేవాడెవరైనా ఉన్నారంటే అది బాబే.
 
 నేను దొంగ హామీలివ్వలేను.. చంద్రబాబు మాదిరిగా దొంగ హామీలైతే నేను ఇవ్వను. నేనిచ్చే ప్రతి హామీని చేసి చూపిస్తా. ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి నుంచి నాకు వారసత్వంగా వచ్చింది విశ్వసనీయత. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నాలుగు సంతకాలు పెడతా. ఆ నాలుగు సంతకాలు రాష్ట్ర చరిత్రను మార్చేస్తాయి. మొదటి సంతకం అక్కచెల్లెమ్మల కోసం పెడతా. మీ పిల్లల్ని బడికి పంపించండి. ప్రతి చిన్నారికి రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ.వెయ్యి  మీ బ్యాంక్ అకౌంట్‌లో వేసే పథకం తెస్తా. అంతేకాదు ఆ అక్కచెల్లెళ్ల పిల్లల కోసం ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లిష్ మీడియం పెడతా. రెండోసంతకం అవ్వాతాతల కోసం చేస్తా. వారి పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.700 పెంచేందుకు చేస్తా. మూడో సంతకం రైతన్నల కోసం పెడతా. ధాన్యానికి గిట్టుబాటు ధర, మద్దతు ధర కల్పించేందుకు రూ.మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం సంతకం పెడతా. నాలుగో సంతకం డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం వారి రుణాలను మాఫీ చేసేందుకు పెడతా.’’
 
‘‘సీఎంగా నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేసే నాలుగు సంతకాలతోపాటు ఇంకోటి కూడా చేయాల్సి ఉందని చెబుతున్నా. చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపు చూస్తాడు. ఇవాళ మన ఖర్మ ఏంటంటే హైదరాబాద్ మనదికాకుండా పోయింది. చంద్రబాబు హైదరాబాద్‌ను, రాష్ట్ర ప్రజలను అమ్మేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చదువుకున్న ప్రతి పిల్లాడికీ నేను తోడున్నా. వారి కోసం ఐదో పని చేయాల్సి ఉంది. కలసికట్టుగా ఉందాం. 25, 30 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. మన రాష్ట్ర అభివృద్ధికి డబ్బులిచ్చే వ్యక్తిని ప్రధాని కుర్చీలో కూర్చోబెడదాం. చంద్రబాబు సింగపూర్, సింగపూర్ అని చెబుతాడు. డబ్బుంటే చంద్రబాబు మనకు అవసరం లేదు. జుట్టుంటే దాన్ని ఎలాగైనా ముడేసుకోవచ్చు. 30 ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత మనమే సింగపూర్ కట్టుకుందాం. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు మాట్లాడే అలవాటు నాకు లేదు. చెప్పిన పనులు, చెప్పని పనులు కూడా గొప్పగా చేసి చూపిస్తా.’’    
 - వైఎస్ జగన్
 
 వైఎస్సార్ సీపీలో చేరిన కొత్తపల్లి
 నరసాపురంలో నిర్వహించిన వైఎస్సార్ జనభేరి సభలో నరసాపురం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతించారు. తనతోపాటు వేలాది మంది వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు సుబ్బారాయుడు చెప్పారు. జగన్‌ను ఆపే శక్తి ఎవరికీ లేదని, ఆయనకు ఎదురెళ్లటం సునామీకి ఎదురు వెళ్లినట్టేనని కొత్తపల్లి పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల పెన్నిధిగా జగన్‌ను జనం చూస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని ధైర్యంగా చెప్పిన ఏకైక పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డేనని అన్నారు. పేదవాడికి పది రూపాయలు పెట్టాలంటే మనసు ఉండాలని, గుండె ఉండాలని, అటువంటి వ్యక్తి జగన్ అని చెప్పారు.
 
 అంతకుముందు కొత్తపల్లి సుబ్బారాయుడు, వైసీపీ నేత ప్రసాదరాజు జగన్‌ను గుర్రపు బండిపై ఎక్కించి పట్టణంలోకి తీసుకెళ్లారు. జనంతో నరసాపురం కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా జనమే కనిపించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా నరసాపురం చేరుకున్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు, పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చెరకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్, నేతలు పాతపాటి సర్రాజు, గ్రంధి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: