రాష్ట్ర విభజనకు హైకమాండ్ పెద్దలే కారణమని కాంగ్రెస్ నేతలు అంతర్గత చర్చల్లో ప్రతినిత్యం నిందిస్తుంటే.. ఆ పార్టీలో విలీనమైన పీఆర్పీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా రాష్ట్ర విభజనకు రెండు కారణాలున్నాయంటూ కొత్త వాదన వినిపిస్తున్నారట. అందులో ఒకటి చంద్రబాబయితే.. రెండోది చిరంజీవట! ఈ కొత్త వాదనేంటని కొందరు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అలియాస్ పీఆర్పీ నేతలను ప్రశ్నిస్తే... అసలు విషయాన్ని వారు విడమరిచి చెబుతున్నారు.
‘కాంగ్రెస్లో విలీనమైతే భవిష్యత్తు బాగుంటుందని, వచ్చే ఎన్నికల్లో గెలవొచ్చని చిరంజీవికి ఆశలు పెట్టారు. దాంతో గంపగుత్తగా పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేశాం. ఈ రోజు చూస్తే.. డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. భవిష్యత్తు గుర్తొస్తేనే భయమేస్తోంది’ అని సెలవిచ్చారు. పైగా.. సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ప్రజలంతా ముక్తక ంఠంతో నినదిస్తూ రోడ్లపైకొస్తే హైకమాండ్ సంగతి పక్కనపెట్టండి.. సీమాంధ్రకు చెందిన మా చిరంజీవి గారు ఇదేమీ పట్టనట్టు హాయిగా మంత్రిపదవిలో తరిస్తూ మమ్మల్ని గాలికొదిలేశారంటూ వాపోయారు.
అదంతా ఓకే.. ఇంతకూ విభజనకు చిరంజీవి కారణమెలా అయ్యారని అడిగిన కాంగ్రెస్ నేతలకు... ‘జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మైనారిటీలో పడిన కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నది మా చిరంజీవే. ఆనాడు పీఆర్పీని విలీనం చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల కిందటే పడిపోయేది. అది జరిగితే మళ్లీ ఎన్నికలొచ్చేవి. మా భవిష్యత్తు కూడా హాయిగా ఉండేది’ అని మాజీ పీఆర్పీ నేతలు చెప్పారట.
మరి చంద్రబాబు సంగతేంటని అడిగితే... ‘ఆయనా అంతే.. శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ వంటి మిగిలిన పక్షాలన్నీ అవిశ్వాసం పెడితే పడగొట్టకుండా ప్రభుత్వాన్ని కాపాడారు. ఆరోజు బాబు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసి ఉంటే ఈ ప్రభుత్వం పడిపోయేది. అప్పుడే పడిపోయి ఉంటే అసలు విభజన అంశం ఇంతదాకా వచ్చేదే కాదు కదా’ అని అసలు విషయాన్ని విడమరిచి చెప్పారు.
0 comments:
Post a Comment