హెదరాబాద్: పోటీలో ఉన్న అభ్యర్థి మరణించినపుడు ఆ అభ్యర్థికి ఓట్లు వేసినా ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం అవి చెల్లవని, ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డికి ఓట్లు వేసినా ఆ ఓట్లు లెక్కలోకి రావని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందిన (రికగ్నైజ్డ్ పార్టీ) కానందునా, వారు అభ్యర్థిని మార్చే అవకాశం లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్డ్ పార్టీ అని పేర్కొన్నారు. రికగ్నైజ్డ్ పార్టీ అయితే వారం రోజుల్లో అభ్యర్థిని మార్చుకునే వీలుండేదని తెలిపారు. ఆళ్లగడ్డలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి శోభానాగిరెడ్డి మరణించినందున , ఆమె పేరు మీద కాని, ఆమె పార్టీ గుర్తు మీద కాని ఓట్లు వేస్తే ఆ చెల్లవన్నారు. ఆమెకు అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినా, నోటాకు వేసినట్లుగా ఆమెకు వచ్చిన ఓట్లకు విలువ ఉండదని, అవి లెక్కలోకి రావన్నారు.
ఆ తరువాత పోటీలో ఉన్న వారిలో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారే గెలిచినట్లు పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందన్నారు. ప్రజలు ఆమెకే ఎక్కువ ఓట్లు వేసి గెలిపిస్తే ఎలాగనే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్లీ లేఖ రాస్తామని వివరించారు. తెలంగాణ ఇంగ్లీష్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో భన్వర్లాల్ మాట్లాడారు. విలేకరులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
1. రాష్ట్రంలో రాజాకీయాలు కలుషితమయ్యాయి. అన్ని రాజకీయ పార్టీలకు ఇందులో పాత్ర ఉంది. ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచుతున్నాయి. పెద్ద మొత్తంలో పట్టుకున్న డబ్బు విషయంలో విచారణ జరుగుతోంది. అది పూర్తయ్యాక, ఆ పార్టీ, అభ్యర్థి పేర్లు కూడా చెబుతాం.
2. రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఎవరు కృషి చేస్తారని ఓటర్లు భావిస్తారో వారికే ఓటు వేయాలి. స్వచ్ఛందంగా ఓటు వేయండి. ఎవరూ ఇష్టం లేకపోతే నోటాను ఉపయోగించుకోండి. ఓటు వేసేందుకు సొంత వాహనాలు, ప్రైవేటు, ఆర్టీసీ వాహనాల్లో వెళ్లండి. అభ్యర్థులు ఏర్పాటు చేసే వాహనాల్లో వెళ్లవద్దు. అదీ కూడా ప్రలోభానికి గురైన కిందకే వస్తుంది.
3.ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర విభజనపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఆలిండియా సర్వీసెస్ అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నందునా, వారి విభజనను ఎన్నికల తరువాత ప్రకటించాలని మాత్రమే విజ్ఞప్తి చేశారు. ముందు ప్రకటిస్తే ఇబ్బంది అవుతుందని లేఖ రాశాం.
0 comments:
Post a Comment