నాయకుడంటే వైఎస్సే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాయకుడంటే వైఎస్సే

నాయకుడంటే వైఎస్సే

Written By news on Sunday, May 26, 2013 | 5/26/2013

డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో ధ్రువతార. లీడర్ అన్న పదానికి సిసలు నిర్వచనం. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా రాజనీతిజ్ఞుడిగా, జననేతగా, ప్రజల హృదయ విజేతగా శాశ్వతంగా నిలిచిపోయిన నాయకుడు. నాయకునిగా వైఎస్ ఎదుగుదల పూలబాటేమీ కాదు. ప్రత్యర్థి పార్టీలతోనే గాక పార్టీలోని ప్రత్యర్థులతో కూడా నిత్య పోరాటాలమయంగా సాగిన ప్రస్థానం ఆయనది. ఆ క్రమంలో ఎన్ని సవాళ్లు, సమస్యలు ఎదురైనా ఖాతరు చేయలేదాయన. కేవలం ప్రజాభిమానమే ఆలంబనగా ముందుకు సాగారు. సంక్షేమ పాలనతో వారి గుండెల్లో శాశ్వతంగా గూడు కట్టుకున్నారు. ఇచ్చిన మాట నిలుపుకునేందుకు ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తిత్వంతో విరోధుల మనసు కూడా గెలిచిన అరుదైన వ్యక్తిత్వం వైఎస్సార్‌ది. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కూడా బహుశా అవే సంఘర్షణలు, సమస్యలు, సవాళ్లు రాజకీయ వారసత్వంగా అందాయేమో! ఇచ్చిన మాటపై నిలవడం కోసం జైలుకు వెళ్లేందుకూ వెనుదీయని జగన్‌లో ప్రజలిప్పుడు తమ ప్రియతమ వైఎస్‌నే చూసుకుంటున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్‌ది ప్రత్యేక స్థానం. ప్రత్యర్థి పార్టీల్లోనూ ఆయనను అభిమానించే వాళ్లు కోకొల్లలు. వైఎస్ నిజమైన నాయకుడు అని బహిరంగంగా అంగీకరించిన రాజకీయ ప్రత్యర్థులుండేవారు. అది పార్టీలకు అతీతమైన అభిమానం. ముఖ్యమంత్రి కాక ముందునుంచే ఆయనకు అపారమైన అభిమాన గణం రాష్ట్రమంతటా ఉండేది. సభావేదికెక్కి ఆయన చేయెత్తితే చాలు, ఏదో మీటనొక్కినట్టుగా జనకెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడేవి. వైఎస్ ప్రసంగం తర్వాత ఇక సభాస్థలిలో ఎవరూ మిగలరనే భయంతో, విజయవాడలో ఒక సమావేశంలో అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు సీతారాం కేసరిని ముందే మాట్లాడించి, వైఎస్‌ను చివరి వక్తగా చేశారు! తన నుంచి ఏమీ ఆశించకుండానే లెక్కకు మిక్కిలి జనం తనను ఎంతగానో అభిమానించేంతటి ఘనత వహించారాయన. ముఖ్యమంత్రి అయ్యాక అది ఎన్నెన్నో రెట్లు అధికమైంది.

అసంఖ్యాకమైన జనం ఆయన్ను ఆరాధించడం మొదలైంది. కుటుంబాలకు కుటుంబాలు, గ్రామాలకు గ్రామాలు, జిల్లాలకు జిల్లాలు, మొత్తంగా రాష్ట్రమే వైఎస్ అంటే అవ్యాజమైన ప్రేమ చూపే పరిస్థితి నెలకొంది. ఆయన సహజ నాయకత్వ లక్షణంతో పాటు మరో రెండు ముఖ్య కారణాలున్నాయి. అవి అలుపెరుగని, వెరుపెరుగని వైఎస్ పోరాటపటిమ.. ప్రజల పట్ల ఆయనకున్న అపార వాత్సల్యం. ప్రత్యర్థి పార్టీల వారు కావచ్చు, తన వారికోసం, తననే నమ్ముకున్న వారి కోసం ఎంతకైనా తెగించే తత్వం వైఎస్‌ది. ఏళ్లు, దశాబ్దాల తరబడి శ్రమించి సంపాదించుకున్న పేరు, ప్రతిష్ట, పలుకుబడి వంటివాటిని పణంగా పెట్టయినా తనవారి కోసం నిలబడే తత్వమే ఆయన్ని అప్రతిహత నాయకుణ్ని చేసింది. ఇక ప్రజలతో వైఎస్‌కున్న అనుబంధం సాటి లేనిది. పాతికేళ్ల క్లిష్టతరమైన ప్రస్థానంలో అన్ని దశల్లోనూ ఆయన గమనం జనంతోనే. జనమే ఆయనకు ఇంధనం. విపక్షంలో ఉన్నపుడు జనం తరపున పోరాడటం, అధికారంలో ఉన్నపుడు వారిని ఇంకే విధంగా ఆదుకోగలనో తెలుసుకోవడం... ఇదే వైఎస్ తపనగా ఉండేది.

ప్రజాప్రస్థానం చెరగని చరిత్ర
రాజశేఖరరెడ్డి రాజకీయ గమనంలోనూ ఉత్థాన పతనాలున్నాయి. తొలిసారి ఎమ్మెల్యే అయిన 1978 నుంచి రెండోమారు పీసీసీ అధ్యక్షుడైన 1998 వరకు రెండు దశాబ్దాల రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అయితే రాజకీయంగా ఆయనకు ఎదురైన అనుకూల, ప్రతికూల సందర్భాలన్నీ ఆయనకు జనాదరణను సమానంగా పెంచడం విశేషం. అందుకు ఆయన స్వభావమే కారణమని చెప్పాలి. జనమే ఆలంబనగా దూసుకుపోయే తత్వం వైఎస్‌కు బయటి పార్టీలతో పాటు కాంగ్రెస్‌లో కూడా ఎంతోమందిని గట్టి విరోధులుగా మార్చింది. కాంగ్రెస్ సంస్కృతిలో భాగంగా తరచూ ముఖ్యమంత్రుల్ని మార్చే క్రమంలో నెలకొనే రాజకీయ అనిశ్చితిలో కూడా ప్రజా పక్షం వహించినందుకు ‘అసమ్మతి నేత’ అనే నిందను వైఎస్ మోయాల్సి వచ్చింది. 1999-2004 మధ్య విపక్ష నేతగా ఉండగా పార్టీలకతీతంగా వైరి వర్గాలన్నీ ఒక్కటై వైఎస్‌ను వెంటాడాయి. నిందలు మోపుతూ, సంబంధం లేని పరిణామాలకు బాధ్యుణ్ని చేస్తూ మనస్తాపానికీ గురి చేశాయి. అలాంటి దశలో మళ్లీ జనమే ఆయనకు స్ఫూర్తినిచ్చారు.

చరిత్రాత్మక పాదయాత్ర ద్వారా 2003 ఏప్రిల్‌లో చరిత్ర రచనకు శ్రీకారం చుట్టారు వైఎస్. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ, పాలకుల నిర్లక్ష్యానికి గురై దారీ తెన్నూ కానక అలమటిస్తున్న కోట్లాది తెలుగువారికి భవిష్యత్తుపై కొత్త ఆశలు, విశ్వాసం కల్పించారు. చంద్రబాబు రాజకీయ ఇంద్రజాలం ముందు భవిష్యత్తే లేదని నిస్పృహతో నీరసించిన కాంగ్రెస్‌కూ కొత్త ఊపిరి పోశారు. అధికార బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ ప్రజాక్షేమమే ధ్యేయంగా గడిపారు. వారి సంక్షేమమే అంతిమ ధ్యేయంగా భావించారు. అన్ని విషయాల్లోనూ వైఎస్ లక్షణాల్ని, పద్ధతుల్ని పుణికి పుచ్చుకున్న.. అన్నింటినీ మించి జనంతో మమేకమై.. జనం గురించే సదా యోచిస్తూ... జనపక్షం వహించే అసలు సిసలు వారసుడు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
Share this article :

0 comments: