సాక్షి ప్రతినిధి, అనంతపురం : తాడిపత్రిలో వైఎస్ విజయమ్మ రోడ్షోకు రికార్డు స్థాయిలో జనం పోటెత్తడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపింది. నూతనోత్సాహంతో ఆ పార్టీ శ్రేణులు విజయం దిశగా కదంతొక్కుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జిల్లాలో కదిరి నుంచి వైఎస్ విజయమ్మ ప్రచార శంఖారావాన్ని పూరించారు. ఆదివారం కదిరి, పుట్టపర్తి, హిందూపురం.. సోమవారం మడకశిర, ధర్మవరం, అనంతపురం.. మంగళవారం కళ్యాణదుర్గం, రాయదుర్గం.. బుధవారం గుంతకల్లు, గుత్తి, పామిడిలో వైఎస్ విజయమ్మ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి అపూర్వ జనస్పందన లభించడంతో ప్రత్యర్థి పార్టీల నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
బుధవారం రాత్రి బుక్కరాయసముద్రం సమీపంలోని ఎస్ఆర్ఐటీ కాలేజీలో బసచేసిన ఆమె.. గురువారం ఉదయం 10.30 గంటలకు అక్కడి నుంచి తాడిపత్రికి బయలుదేరారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ సొంతూరు తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి. అనంతపురం జిల్లా అల్లుడైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట వేశారు. తమ ఆడబిడ్డ పుట్టింటికి వస్తోండటంతో ఆ ప్రాంత ప్రజానీకం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆడబిడ్డ కోసం కదలివచ్చారు. తాడిపత్రి శివారులోని నందలపాడు క్రాస్ వద్దకు 11.20 గంటలకు చేరుకున్న వైఎస్ విజయమ్మకు వేలాది మంది ప్రజానీకం ఘన స్వాగతం పలికారు. నందలపాడు క్రాస్ నుంచి వైఎస్సార్ సర్కిల్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం జనప్రవాహం పోటెత్తింది. వైఎస్ విజయమ్మ ప్రచారరథం వెంట జనం పరుగులు తీశారు. అభిమానసంద్రం అడుగడుగునా అడ్డుపడటం.. హారతులు పట్టడం.. బంతిపూల వర్షం కురిపించడంతో నందలపాడు సర్కిల్ నుంచి వైఎస్సార్ సర్కిల్కు చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టింది. రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి రెండు గంటల సమయం పట్టిందంటే జనం ఏ స్థాయిలో పోటెత్తారో విశదం చేసుకోవచ్చు. వైఎస్సార్ సర్కిల్లో ఇసకేస్తే రాలని రీతిలో కిక్కిరిసిన అభిమానులను ఉద్దేశించి వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి తాడిపత్రి, పులివెందులను రెండు కళ్లుగా భావించారు. తాడిపత్రి అభివృద్ధి కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేశారు.. చాగల్లు, పెండేకల్లు రిజర్వాయర్లను పూర్తి చేశారు. రూ.500 కోట్లతో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని మంజూరు చేశారు.. తాడిపత్రిలో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేశారు.. వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట వేస్తారు.. ఆశీర్వదించండి’ అంటూ వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. వైఎస్ విజయమ్మ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న జనం.. ‘తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని వైఎస్సార్సీపీ ఖాతాలో వేసి.. ఆడబిడ్డకు కానుకగా ఇస్తాం’ అంటూ పెద్ద ఎత్తున స్పందించారు. వైఎస్ విజయమ్మ రోడ్షో బంపర్ హిట్ కావడం ‘తెలుగుదేశం - కాంగ్రెస్’ నేతల వెన్నులో వణుకు పుట్టించింది.
0 comments:
Post a Comment