Home »
» వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
డోన్(కర్నూలు), న్యూస్లైన్: డోన్ మండల వైఎస్ఆర్సీపీ నాయకుడు కడిమెట్ల క్రిష్ణ అలియాస్ కిట్టు(29) మంగళవారం తెల్లవారుజామున డోన్లోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. క్రిష్ణ కుటుంబ సభ్యుల కథనం మేరకు.... సహకార సంఘాల ఎన్నికల్లో ఇతని తండ్రి లక్ష్మన్న వైఎస్ఆర్సీపీ మద్దతుతో 1వ ప్రాదేశిక నియోజకవర్గానికి డెరైక్టర్గా పోటీలో ఉన్నారు. సోమవారం సాయంత్రం మండలంలోని వెంకటనాయునిపల్లె గ్రామంలో క్రిష్ట తండ్రి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నలుగురు దుండగులు ఇంటి తలుపు తట్టి కిట్టూ అని పిలిచారు. క్రిష్ణ తలుపు తీయగానే వేటకొడవళ్లతో కిరాతకంగా నరికారు. కుప్పకూలిన వ్యక్తి జుట్టు పట్టుకొని కడుపులో విచక్షణారహితంగా పొడిచారు. తల్లి సరస్వతి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపైనా కర్రలతో దాడి చేసి పరారయ్యారు. సరస్వతి ఈ సంఘటనను సమీపంలో నివసిస్తున్న మరో కుమారుడు రవికి సమాచారమిచ్చారు. అతను క్రిష్ణను స్థానిక వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ప్రచారంలో ప్రజలు అధిక సంఖ్యలో మద్దతు చెబుతుండటంతోనే తమ కుమారున్ని వెంకటనాయునిపల్లె గ్రామ కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక హత్య చేశారని మృతుని తండ్రి లక్ష్మన్న, సోదరుడు రవి ఆరోపించారు. డోన్ టౌన్ ఎస్ఐ మోహన్రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కిట్టు హత్యను హేయమైన చర్యగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి అభివర్ణించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. హత్యలకు పాల్పడి ఎన్నికల్లో గెలుపొందాలనుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
|
|
0 comments:
Post a Comment