ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వద్ద టీడీపీ నేతలు హడావుడి చేయడం హాస్యాస్పదం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వద్ద టీడీపీ నేతలు హడావుడి చేయడం హాస్యాస్పదం

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వద్ద టీడీపీ నేతలు హడావుడి చేయడం హాస్యాస్పదం

Written By ysrcongress on Thursday, January 26, 2012 | 1/26/2012

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన బృహత్తరమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వద్ద తెలంగాణ టీడీపీ నేతలు హడావుడి చేయడం హాస్యాస్పదం, ఆశ్చర్యకరం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆందోళన చేస్తారేమోనని ఆందోళన చెందిన టీడీపీ నేతలు ఆయన కంటే ముందుగానే తామే ఇందుకోసం ఏదో చేసినట్లుగా ఉండాలని నిరసన కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. 

చంద్రబాబునాయుడు ఆయన పార్టీ నాయకులూ కాపీ రాయుళ్లు మాదిరిగా తయారయ్యారని గట్టు ఎద్దేవా చేశారు. జగన్ ఏం చేస్తే తాము కూడా అది చేయాలని హైరానా పడిపోతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఆందోళన లు, నిరసనలు చేయడంలో తప్పు లేదనీ అయితే ప్రాజెక్టు వద్ద గల పైలాన్‌కు నల్ల గుడ్డ చుట్టడం వంటి చర్యలకు పూనుకోవడం అభ్యంతరకరమని గట్టు అన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంఖుస్థాపన చేసిన రాయికి నల్ల గుడ్డ చుట్టడం అంటే తెలంగాణ ప్రజల కళ్లకు గంతలు కట్టడం వారిని మోసం చేయడమేనని ఆయన మండి పడ్డారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు వంటి వ్యక్తి నేతృత్వంలో ఇపుడు తెలంగాణ నేతలు ఇపుడు రైతు సమస్యల గురించి మాట్లాడ్డం విడ్డూరమని అన్నారు. 

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తింప జేసి తక్షణం నిర్మాణం చేపడతామని చెప్పడం కూడా హాస్యాస్పదమేనని ఆయన అన్నారు. నలభై ఏళ్ల క్రిందటే ప్రాణహిత నిర్మాణం చేపట్టాలనే ఆలోచన ప్రచారంలో ఉందనీ అలాంటపుడు బాబు అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు దీని ఊసెందుకు ఎత్తలేదని ప్రశ్నించారు. బాబు హయాంలో భారీ సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా ఉండిన తెలంగాణ ప్రాంత మంత్రులకైనా ఇదెందుకు గుర్తుకు రాలేదన్నారు. ఒక్క ఫోన్ కాల్‌తో ప్రధానులను చేసిన ఘనత తనదని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రాణహిత విషయంలో తాము ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఫోన్ ఎందుకు చేయలేక పోయారని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల బాధలను వైఎస్ భూతద్దంలో వేసి చూపించారని బాబు చేసిన వ్యాఖ్యలపై గట్టు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నవ్వులాటగా ఉన్నాయన్నారు. టీడీపీ నేతలు వ్యవసాయరంగం, రైతుల సమస్యలపై మాట్లాడ్డం అంటే నేతిబీర కాయలో నేయి ఉన్న చందమేనని గట్టు అభిప్రాయపడ్డారు.
Share this article :

0 comments: