జగన్ ఆస్తుల కేసులో ఆరుగురు ఆంధ్రపదేశ్ మంత్రులు, 11 మంది ఐఏఎస్ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చే సింది. కన్నా లక్ష్మీనారాయణ, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్యయ్యలతో పాటు ఐఏఎస్లు శ్రీలక్ష్మి, ఎస్వీ ప్రసాద్, శామ్యూల్, రత్నప్రభ, ఆదిత్యనాథ్, సీవీఎస్కే శర్మ, శ్యాంబాబు, మన్మోహన్ సింగ్ తదితరులకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. నెల్లూరుకు చెందిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం మంత్రులు, ఐఏఎస్లకు నోటీసులు జారీ చేసింది. వైఎస్సార్ హయాంలో 26 వివాదాస్పద జీవోల విడుదల వెనుక మంత్రులు, అధికారుల ప్రమేయముందని పిటిషనర్ ఆరోపించారు.
ఆరుగురు మంత్రులు, 11 మంది ఐఎఎస్ అధికారులకు సుప్రీం కోర్టు నోటీసులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డిపద్మ స్వాగతించారు. కళంకిత మంత్రులకు సుప్రీంకోర్టు నోటీసులివ్వటం సీబీఐకి చెంపపెట్టన్నారు. ఇన్నాళ్లు సీబీఐ ఆడిన నాటకానికి అడ్డుపడిందన్నారు. మంత్రులంతా తక్షణమే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
జగన్ ఆస్తుల వ్యవహారంలో సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రులను బర్తరఫ్ చేయాలని మాజీ మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాతే వీరిని విచారించాలని సూచించారు. ఐఏఎస్ అధికారుల విషయంలో కూడా ఇదే విధానం పాటించాలన్నారు. మద్యం సిండికేటులో ఉన్న మంత్రుల పేర్లు బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
జగన్ ఆస్తుల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆరుగురు రాష్ట్ర మంత్రులు, 11 మంది ఐఏఎస్లకు నోటీసులు జారీ చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ స్పందించారు. ఈ ఆరుగురు మంత్రులు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ తప్పు చేయని మంత్రులైతే రాజీనామా చేసి, సీబీఐ విచారణ ఎదుర్కొవాలన్నారు. వీరిని ఎందుకు ప్రశ్నించలేదని సీబీఐని నిలదీశారు. రాజ్యాంగంపై గౌరవంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డిని ఆయన అభినందించారు.
0 comments:
Post a Comment