వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో 70 పడక గదులు ఉన్నట్లు సీఎం నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ చేశారు. సీఎం వాస్తవాలు తెలుసుకోకుండా కళ్లు మూసుకుని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తిరుపతి పట్టణాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పులుగోరు ప్రభాకర్రెడ్డి మంగళవారం వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి నివాసానికి సీఎం ఆయన మంత్రివర్గ సభ్యులు వచ్చి అక్కడ ఎన్ని పడక గదులు ఉన్నాయో చూడాలన్నారు.
ఉప ఎన్నికలు తమ ప్రభుత్వానికి రెఫరెండం కాదని సీఎం ప్రకటించడం రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్లో పీఆర్పీ విలీనం తరువాత జరిగే ఉపఎన్నికల స్థానాలన్నీ కాంగ్రెస్ ఖాతాలోని వేనని ఆయన గుర్తు చేశారు. 18 నియోజకవర్గాల్లో ఓటమి తప్పదని తెలిసే సీఎం తమకు ఈ ఎన్నికలు రెఫరెండం కాదంటున్నారన్నారు. జగన్మోహన్రెడ్డికి కోర్టు సమన్లు పంపడం న్యాయ ప్రక్రియలో ఒక భాగమని అంతమాత్రాన ఆయనకేదో జరగబోతోందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అయితే సీబీఐ, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో ఏమి జరుగుతుం దోనన్న ఉత్కంఠ జగన్ అభిమానుల్లో ఉండవచ్చన్నారు. అవినీతి, అక్రమాల కేసులో 8 మంది మంత్రులను ఎందుకు ప్రశ్నించలేదంటూ న్యాయస్థానం ప్రశ్నించిన నేపథ్యంలో, ఆ మంత్రుల పైనా సీబీఐ కేసులు పెట్టి, చార్జిషీటు దాఖలు చేయాల్సిందేనని రాంబాబు స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment