‘సాక్షి’ కోసం గాంధీగిరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘సాక్షి’ కోసం గాంధీగిరి

‘సాక్షి’ కోసం గాంధీగిరి

Written By news on Thursday, May 17, 2012 | 5/17/2012

‘సాక్షి’ మీడియాపై సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పాత్రికేయుల నిరసనలు హోరెత్తుతున్నాయి. బుధవారం ‘సాక్షి’ సిబ్బంది ఖైరతాబాద్ చౌరస్తాలో కరపత్రాలు పంపిణీ చేసి గాంధీగిరి చేశారు. ‘సాక్షిని సాక్ష్యం చెప్పనీయండి’ శీర్షికతో ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం రాసిన వ్యాసాన్ని ప్రయాణికులకు అందజేశారు. ఉదయం 10:30కి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశమైన ‘సాక్షి’ కుటుంబసభ్యులు ర్యాలీగా ఖైరతాబాద్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఐదు బృందాలుగా విడిపోయి కూడలిలోని ఐదుచోట్ల కరపత్రాలు పంపిణీ చేశారు. 

‘సాక్షి’కి జరిగిన అన్యాయాన్ని ఈ కరపత్రం రూపంలో తెలియజేస్తున్నాం. మా బాధను అర్థం చేసుకోండి’ అని వాహన చోదకులను అభ్యర్థించారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జాగ్రత్త తీసుకున్నారు. కేవలం రెడ్‌సిగ్నల్ పడినచోట మాత్రమే వాహనదారులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ‘సాక్షి’ సిబ్బంది చేసిన ఈ ప్రయత్నానికి ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన లభించింది. బస్సుడ్రైవర్లు, ఆటోవాలాలతో సహా మహిళలు కరపత్రాలను తీసుకునేందుకు ఉత్సాహం చూపారు. వాహనాలను శుభ్రం చేసి కూడా పాత్రికేయులు నిరసనను తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగింది. ‘సాక్షి’ పత్రిక, టెలి విజన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Share this article :

0 comments: