ఈ పాపంలో బాబుకూ భాగం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ పాపంలో బాబుకూ భాగం

ఈ పాపంలో బాబుకూ భాగం

Written By news on Wednesday, July 31, 2013 | 7/31/2013

ఈ పాపంలో బాబుకూ భాగం: శోభా నాగిరెడ్డి
హైదరాబాద్ :  వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు  భూమా శోభా నాగిరెడ్డి ధ్వజం
రాష్ట్రంలోని పది కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీ పెద్ద పాపానికి ఒడిగట్టిందని, ఇందులో ప్రధాన విపక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబుకూ భాగం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్  కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇంత పెద్ద నిర్ణయాన్ని ఎవరినీ సంప్రదించకుండా తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ రాష్ట్ర విభజన తన సొంతింటి వ్యవహారంలాగా చేసింది. కాంగ్రెస్ నిర్ణయం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. తెలంగాణ ఇచ్చేశామని ఒకే ఒకమాట చెప్పేసి మొత్తం రెండు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ పాపంలో చంద్రబాబుకూ భాగం ఉంది’ అని అన్నారు.
 
 లేఖ ఇచ్చి దులిపేసుకున్నారు: చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ మాత్రమే ఇచ్చారని, ఒకవేళ విభజన జరిగితే ఆంధ్ర, రాయలసీమలకు ఎలా న్యాయం చేయాలో చెప్పలేదని శోభానాగిరెడ్డి ఆరోపించారు. అసలు ఈ విషయమై ఆయన ఒక్కమాటా మాట్లాడలేదని, నోరెత్తడం లేదని దుయ్యబట్టారు. సీమాంధ్రకు ఇంత అన్యాయం జరగడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణమైతే దాంట్లో చంద్రబాబూ భాగస్వామి అని ఆమె అన్నారు. ఈ రెండు ప్రాంతాలు నష్టపోయే విధంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని, తమ పార్టీలా బాబు కూడా ముందుకొచ్చి కేంద్రాన్ని నిలదీసి ఉంటే ఇంత సులభంగా నిర్ణయం తీసుకుని ఉండే వారు కాదన్నారు. సొంత ఇంటి వ్యవహారంగా సోనియాగాంధీ వ్యవహరించిన తీరుకు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో తగిన మూల్యం చెల్లిస్తుందని ఆమె అన్నారు. ఒక ప్రాంతాన్ని విడదీయాలనుకుంటే ఇతర ప్రాంతాలకు ఎలా న్యాయం చేస్తారో చెప్పలేదన్నారు. నీరు, విద్యుత్ వంటి సమస్యలతో పాటుగా హైదరాబాద్‌పై ఏ నిర్ణయం తీసుకునేదీ ముందు చెప్పలేదన్నారు.
 
 భావితరాలు క్షమించవు:  హైదరాబాద్ నగరాన్ని అన్ని ప్రాంతాల వారూ కలిసి అభివృద్ధి చేశారని, ఎవరు ముఖ్యమంత్రి అయినా హైదరాబాద్ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని పేర్కొన్నారు. అలాంటి హైదరాబాద్ నగరాన్ని ఏకపక్షంగా తెలంగాణ కు ఇస్తామని చెప్పి ఇతర ప్రాంతాలకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తప్పకుండా నిలదీయాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌కు చెందిన రాయలసీమ, కోస్తాంధ్ర ప్రతినిధులు కేవలం సోనియా మెప్పును పొందడానికో, పదవులు కాపాడుకోవడానికో నోరు మెదపకుండా ఉన్నారని,  వారిని భావితరాలు క్షమించబోవని హెచ్చరించారు.  తమలాగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా నిలదీసి ఉంటే ఇలాంటి నిర్ణయం వచ్చి ఉండేది కాదన్నారు. ఒక వేళ నిర్ణయం తీసుకున్నా ముందుగానే అడి గేవారన్నారు. ఇదంతా కాంగ్రెస్, టీడీపీ వైఖరి వల్లనే జరిగిందన్నారు.
 
 ఈ రెండు ప్రాంతాలకు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారో ముందుగా చెప్పి ఆ తర్వాతే కాంగ్రెస్ పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినపుడు సీమాంధ్రకు ఏం చేస్తారని కూడా అడగలేని నిస్సహాయ స్థితిలో ప్రధాన విపక్ష నేత ఈ రాష్ట్రానికి ఉండటం దౌర్భాగ్యం అని ఆమె పేర్కొన్నారు. కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయనను రాజకీయంగా ఎలా దెబ్బతీయాలా, ఆయనకు వ్యతిరేకంగా ఏ విధంగా కుట్రలు పన్నాలా అనే విషయాలపైనే చంద్రబాబు దృష్టిని కేంద్రీకరించారని విమర్శించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదని, ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలకు  తీరని ద్రోహం చేశారని ఆమె విమర్శించారు. తాను నోరు మెదపకుండా ఉండటమే కాక సొంత పార్టీ వారిని సైతం ఏమీ మాట్లాడొద్దనిబాబు ఆంక్షలు విధించారన్నారు. మౌనంగా ఉండటం ద్వారా ఈ రెండు ప్రాంతాల్లో రాజకీయ లబ్ధి పొందుతానని, ఇపుడు సర్పంచ్ పదవులు గెలిచానని బాబు చెప్పుకుంటూ ఉండొచ్చు కానీ, రెండు చోట్ల కాళ్లు పెట్టిన బాబు ఎన్నికల్లో మునగడం ఖాయమని శోభ అన్నారు.
Share this article :

0 comments: