హైదరాబాద్: : కాంగ్రెస్ పార్టీ దాని వైఖరి చెప్పినందున తామేమీ స్పందించబోమని, కేంద్రం నిర్ణయం వస్తే ఆమోదయోగ్యం అవునో, కాదో చెబుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డా. ఎంవీ మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకే వైఖరిని అవలంబిస్తోందని, ఎక్కడా మాట మార్చలేదని చెప్పారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్ సీపీ మొదటి ప్లీనరీలో, అఖిలపక్ష సమావేశాల్లో కూడా ఒకే విషయాన్ని చెప్పింది. అన్ని ప్రాంతాల ప్రజలకు నష్టం కలగకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేసింది.అధికారం చేతుల్లో ఉందని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం తగదని చెప్పాం. దానికి మా పార్టీ కట్టుబడి ఉంది’’ అని అన్నారు.
నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ దాని వైఖరి చెప్పకుండా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తీరు వల్లే రాష్ట్రం రావణకాష్టంలా మారిందని, అన్ని రంగాల్లో అభివృద్ది కుంటుపడిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే ముందు ఇష్టానుసారంగా కాకుండా రాష్ట్రానికి చెందిన అన్ని ప్రాంతాల వారితో చర్చించాలని సూచించారు. రెండు ప్రాంతాలకు అన్యాయం జరగకుండా అందరికీ సమన్యాయం జరగాలని అన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా క్షేమం గా ఉండాలనేదే తమ పార్టీ ధ్యేయమని చెప్పారు. ఓట్లు, సీట్ల ప్రాతిపదికన నిర్ణయాలు కాకుండా ప్రజలకు అనుగుణంగా చర్యలుండాలని అన్నారు.
0 comments:
Post a Comment