హైదరాబాద్, న్యూస్లైన్: ఉపఎన్నికల కోడ్ ముగిసే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కేసులో సీబీఐ తదుపరి చర్యలను ఆపేలా చర్యలు చేపట్టాలని ఆ పార్టీ ప్రతినిధులు ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్లాల్కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో జగన్ విషయంలో సీబీఐ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్లా సూర్య ప్రకాష్, పార్టీ స్టేట్ ఐటీ కన్వీనర్ చల్లా మధుసూదన్రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ , ఐటీ కమిటీ సభ్యుడు రఘు బుధవారం సచివాలయంలో భన్వర్లాల్ను కలిసి ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం జనక్ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు.
జగన్ కేసులో 10 నెలల కిందట విచారణ ప్రారంభించిన సీబీఐ.. ప్రభుత్వం జారీ చేసిన 26 జీఓల విషయాన్ని తేల్చకుండా ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్పై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచి, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనపై తదుపరి ప్రొసీడింగ్స్ను జూన్ 15 వరకు నిలిపివేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత కావాలంటే ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు సీబీఐ చార్జిషీట్ల పేరుతో లీకులు ఇస్తోందని, వాటితో ఆయా పత్రికలు, టీవీలు తప్పుడు అన్వయాలతో జగన్, దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డిలు దోషులు అంటూ తప్పుడు కథనాలు రాస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్లోనే సీబీఐ నడుస్తోంద ని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకమన్నారు. కేంద్రం ఒత్తిడితో, వయలార్ రవి వంటి కేంద్ర పెద్దల కనుసన్నల్లో సీబీఐ విచారణ కొనసాగిస్తోందని ఆరోపించారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే జూన్ 15 వరకు జగన్ కేసులో సీబీఐ తదుపరి ప్రొసీడింగ్స్ను నిలిపివేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
0 comments:
Post a Comment