మన యాత్రికులను ఆదుకోండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మన యాత్రికులను ఆదుకోండి

మన యాత్రికులను ఆదుకోండి

Written By news on Friday, June 21, 2013 | 6/21/2013

వారి ప్రాణాలను కాపాడాలని వినతి

సాక్షి, హైదరాబాద్: ఉత్తరాఖండ్‌కు వెళ్లి వరదల్లో చిక్కుకున్న రాష్ట్రవాసులను వెంటనే ఆదుకోవాలని, వారి ప్రాణాలను కాపాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ డిమాండ్ చేశారు. ఆమె గురువారం ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ మేరకు రెండు పేజీల లేఖను రాశారు. ఆచూకీ తెలియని యాత్రికుల కోసం ప్రత్యేక బృందాలను పంపాలని కోరారు. ఇప్పటికే మృతి చెందిన వారి మృత దేహాలను రాష్ట్రానికి తెచ్చేందుకు ప్రభుత్వమే చొరవ చూపాలని, మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. విజయమ్మ ముఖ్యమంత్రికి రాసిన లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.

గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, 

చార్ ధామ్ యాత్రకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన తెలుగువారి గురించి మా పార్టీ తీవ్రమైన ఆందోళన చెందుతోంది. ఉత్తరాఖండ్‌లో సంభవించిన బీభత్సం వందలాది మంది ప్రాణాలను బలిగొందన్న వార్త ఎంతగానో కలచివేసింది. అందులో అనేక తెలుగు కుటుంబాలు ఉండటం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఈ జల విలయం దేశం నలుమూలల నుంచి ఉత్తర కాశీ యాత్రకు వచ్చే యాత్రికుల పాలిట పెను విషాదంగా మారటం విచారకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్తరకాశీ, కేదార్‌నాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన దాదాపు 70 వేల మందికి పైగా యాత్రికులు ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపోవడంవల్ల ప్రాణాపాయ స్థితిలో చిక్కుకు పోయారు. వారిలో చాలామంది మన రాష్ట్రానికి చెందిన వారు కావడం ఆందోళనకరం.

సుమారు ఐదు వేల మంది తెలుగువారు వరద బీభత్సంలో చిక్కుకు పోయి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్నాయి. వారిలో కొందరు మరణించినట్లు కూడా సమాచారం అందుతోంది. మరోవైపు వందలాది మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. హిమాలయాల్లోని అడవుల్లో, దాదాపు ఐదు డిగ్రీల చలిలో, తిండీ తిప్పలు లేకుండా, కనీసం తాగేనీరు సైతం లేకుండా... మనవారు ప్రాణాలు అరచేత పట్టుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారికి తక్షణ సహాయం అందించాలి. వారి ప్రాణాలను కాపాడాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంతోను, ఉత్తరాఖండ్ ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరిపి త్వరితగతిన సహాయ చర్యలు చేపట్టి, క్షేమంగా వారిని వారి స్వస్థలాలకు చేర్చాలి. ఇది ప్రభుత్వ కనీస బాధ్యత.

ఉత్తరాఖండ్ వరద బీభత్సం వార్తలు వెలువడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావాలని మా పార్టీ తరపున విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉంటే... రాష్ట్రానికి చెందిన ఇన్ని వందలమంది యాత్రికుల కుటుంబాల్లో ఈరోజున ఇంతగా ఆందోళన ఉండేది కాదు. సహాయ చర్యల్లో జాప్యం కారణంగా ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. రాష్ట్రం నుంచి వెళ్లిన యాత్రికుల్లో ఎంతమంది ఈ వరదల్లో చిక్కుకు పోయారన్న సమాచారం కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సహాయ చర్యలను ముమ్మరం చేయాలి. వరదల్లో చిక్కుకున్న వందలాది మంది తెలుగువారి ప్రాణాలను కాపాడాలి.

వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని గుర్తించి సహాయం అందించడం కోసం... రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక అధికారుల బృందాన్ని పంపాలి.

బాధితులైన తెలుగు యాత్రికులకు అవసరమైన నాణ్యమైన వైద్య సదుపాయాలు ఉచితంగా అందించాలి.
మృతదేహాలను తీసుకు వచ్చేందుకు ప్రభుత్వమే చొరవ చూపాలి. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. 
మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసంగా పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలి.
ఇట్లు
వై.ఎస్.విజయమ్మ 
Share this article :

0 comments: