ఒక ఏడాది ఓపిక పట్టండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒక ఏడాది ఓపిక పట్టండి

ఒక ఏడాది ఓపిక పట్టండి

Written By news on Thursday, June 13, 2013 | 6/13/2013

* జగనన్న సీఎం అవుతాడు.. ప్రజా సమస్యలు తీరుస్తాడు
* మరో ప్రజాప్రస్థానంలో షర్మిల ఉద్ఘాటన
* రాజన్న రాజ్యంలో వైఎస్ పథకాలన్నీ అమలవుతాయి
* చేనేత కార్మికులకు మంచి రోజులు వస్తాయి
* వికలాంగులకు మేలు జరుగుతుంది

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘ఒక్క ఏడాది ఓపిక పట్టండి. మంచి రోజులొస్తాయి. మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. జగనన్న సీఎం అవుతాడు. రాజన్న కలలుగన్న సంక్షేమ రాజ్యాన్ని తీసుకువస్తాడు. వైఎస్ రాజశేఖరరెడ్డిగారు చేపట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ జగనన్న కొనసాగిస్తాడు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రజలకు భరోసానిచ్చారు. రాజన్న రాజ్యంలో చేనేత కార్మికులకు మంచి రోజులు వస్తాయని ఉద్ఘాటించారు.

ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు కుతంత్రానికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గ్రామాల మీదుగా సాగింది. పెదపూడి గౌరవమ్మవీధి చేనేత కాలనీలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన చేనేత కార్మికులు తమ కష్టాలను షర్మిలకు వివరించారు. ‘‘చంద్రబాబు హయాంలో కుదేలైన చేనేత రంగాన్ని వైఎస్ అన్ని విధాలా ఆదుకున్నారు. ఆయన హయాంలో చేనేత సంఘాలు, కార్మికులకు భరోసా ఉండేది. 

నష్టాల్లో ఉన్న సంఘాలన్నీ వైఎస్ పాలనలో లాభాల బాట పట్టాయి. ఆయన మరణం తర్వాత మాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. 2009 బడ్జెట్‌లో చేనేత రంగానికి వైఎస్ కేటాయించిన రుణమాఫీ నిధులు ఇప్పటికి కూడా పూర్తిగా విడుదల చేయలేదు..’’ అని గోడు వెళ్లబోసుకున్నారు. చంద్రబాబు హయాంలో రాజమండ్రి, గుంతకల్లు, చీరాల స్పిన్నింగ్ మిల్లులు, నెల్లూరు జరీ మిల్లు మూతపడ్డాయని చెప్పారు. 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు వైఎస్ వృద్ధాప్య పింఛన్లను వర్తింపచేశారని, కానీ ఇప్పుడు దాన్ని నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధలు విన్న షర్మిల.. జగనన్న సీఎం అయ్యాక చేనేత కార్మికులను ఆదుకుంటాడని హామీనిచ్చారు. ఈ సందర్భంగా చేనేత నాయకులు షర్మిలకు చరఖాను బహూకరించారు.

అందరికీ ధైర్యం చెబుతూ..
ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ షర్మిల ముందుకు సాగారు. ‘‘నెలనెలా పింఛన్లు సక్రమంగా రావడం లేదు. ఏదో ఒక సాకుతో ఆలస్యం చేస్తున్నారు’’ అని కప్పు వీరబ్రహ్మారెడ్డి అనే వృద్ధుడు షర్మిలకు మొరపెట్టుకోగా.. ‘‘త్వరలో రాజన్న రాజ్యం వస్తుంది. తప్పకుండా పింఛను అందుతుంది’’ అని భరోసానిచ్చారు. జి.మామిడాడ ఎల్‌ఎన్‌పురంలో వరలక్ష్మి అనే మహిళ షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘మా బతుకులు మళ్లీ బాగుండాలంటే జగనన్న బయటకు రావాలి’’ అని అన్నారు. జి.మామిడాడలోనే వికలాంగుడైన శ్రీనును షర్మిల ఆత్మీయంగా పలకరించారు. ‘‘మీలాంటివారు ఎవ్వరిపైనా ఆధారపడకుండా బతికేందుకు జగనన్న మేలు చేస్తాడు. చిన్నచిన్న వ్యాపారాలు నడుపుకొనేందుకు రుణాలు మంజూరు చేస్తాడు.’’ అని చెప్పారు.

15.5 కిలోమీటర్లమేర నడక..
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం పెదపూడి మండలం గొల్లల మామిడాడ నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి గొల్లల మామిడాడ, లక్ష్మీనరసింహాపురం, పెద్దాడ, పెదపూడి, దోమాడ, కరకుదురు, అచ్యుతాపురత్రయం వరకూ సాగింది. ఈ గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి ఏడు గంటలకు షర్మిల చేరుకున్నారు. బుధవారం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు 2,349.5 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మలాకుమారి, సుంకర చిన్ని, బొడ్డు వెంకట రమణ చౌదరి, స్థానిక నాయకులు డాక్టర్ సత్తి సూర్య నారాయణ రెడ్డి, పంపన రామకృష్ణ, రావూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: