స్థానిక ఎన్నికలంటే కాంగ్రెస్, టీడీపీలకు భయం పట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం చూసి ఈ రెండు పార్టీలకు నిద్దర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కుతంత్రాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచేందుకు వెనుకాడడం లేదన్నారు. సీఎం, విపక్ష నేత జిల్లాల్లో భారీగా బీసీ రిజర్వేషన్లు తగ్గించారని తెలిపారు.
మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పిఠాపురం ఉప్పాడ సెంటర్ లో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. కిరణ్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని విమర్శించారు. చిరంజీవిలా చంద్రబాబు కూడా తన పార్టీని కాంగ్రెస్కు రాసిచ్చారని అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చకుండా చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. జగనన్న బయట ఉంటే తమ దుకాణాలు మూసుకోవాల్సివస్తుందనే భయంతో టీడీపీ, కాంగ్రెస్ కుట్రలకు పాల్పడ్డాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని ప్రజలను షర్మిల కోరారు.
0 comments:
Post a Comment