ప్రజలకిచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బేరసారాలాడుకుని అమ్ముడుపోయిందంటూ ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఇది శాసనసభలో ఆయన
తొలి ప్రసంగం. ‘మంచి పనులు చేసిన వారు కీర్తి కిరీటాలతో ప్రజల మధ్య జీవించి ఉంటారు. మంచి పనులు చేయకపోతే ఎంతకాలం రాజ్య పాలన చేసినా చరిత్రలో కలిసిపోతారు’ అనే అర్థంతో పోతన చెప్పిన పద్యంతో భూమన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘పోతన చెప్పిన విధంగా ఎన్నో మంచి పనులు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల్లో జీవించి ఉన్నారు. మూడున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించడంలో విఫలమైంది. ఫలితంగా ప్రజల తిరస్కారానికి గురైంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను ప్రజలు మట్టికరిపించారు’’ అన్నారు.
వైఎస్ హామీలను మరిచిన సర్కారు
పథకాలకు మంచి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలకు ఒరిగిందేమీ లేదని భూమన అన్నారు. వైఎస్ పథకాలకు తూట్టు పొడిచి ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలింది. వైఎస్ పథకాలను నీరుగార్చిన ఘనత కిరణ్ ప్రభుత్వానికే దక్కుతుందంటూ దుమ్మెత్తిపోశారు. ‘‘రైతులకు ఉచిత విద్యుత్ను 9 గంటలకు పెంచుతామని 2009లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున ప్రజలకు వైఎస్ ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రభుత్వం మరిచింది. అంతేగాక మూడున్నరేళ్లలో ప్రజలపై ఏకంగా రూ. 32 వేల కోట్ల విద్యుత్ భారం వేశారు. రైతులకు 2 గంటలు కూడా కరెంటివ్వలేని పరిస్థితి నెలకొంది. వైద్యమందక ఏటా 3 వేల మంది చిన్నపిల్లలు చనిపోతున్నారు. వీటన్నింటినీ ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే భావించాలి. వైఎస్ హామీలను, ఆయన పథకాలను సంతృప్తస్థాయిలో అమలు చేయగల సత్తా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే ఉందని ప్రజలు విశ్వసించారు. అందుకే ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు’’ అని వివరించారు.
అక్రమ విజయం సిగ్గుచేటు
సహకార ఎన్నికల్లో లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడి, పెద్ద సంఖ్యలో సంఘాల ఎన్నికలు వాయిదా వేసి, గెలిచామని అధికార కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటని భూమన అన్నారు. దాంతో మంత్రి కొండ్రు మురళి జోక్యం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీతో సహా అన్ని పథకాలనూ గతంలో కంటే మెరుగ్గా అమలు చేస్తున్నామన్నారు. వైఎస్ ఫొటో పెట్టుకొంటే ప్రయోజనమేమీ ఉండదని వైఎస్సార్సీపీని ఉద్దేశించి అన్నారు. దాంతో, తాము వైఎస్ ఫొటో పెట్టుకుని, ఆయన పేరు చెప్పుకునే ప్రజల్లోకి వెళ్లామని భూమన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన ఫొటోతోనే వెళ్లి కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. వైఎస్ పేరు చెబితే కాంగ్రెస్కు, టీడీపీకి వణుకు ఎందుకని ప్రశ్నించారు. అధికారం పోతుందని కాంగ్రెస్, అధికారం రాదని టీడీపీ భయపడుతున్నాయన్నారు.
అమ్ముడుపోయిన టీడీపీ
ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడంలో ప్రభుత్వం విఫలమైతే, సర్కారు తీరును ఎండగట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బేరసారాలు ఆడుకొని అమ్ముడుపోయిందని భూమన విమర్శించారు. వైఎస్పై, ఆయన కుటుంబంపై టీడీపీ సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు దుర్మార్గమైన, అరాచకమైన విమర్శలు చేశారంటూ ధ్వజమెత్తారు. రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, తన నిర్ణయాల ద్వారా 3 వేల కిలోమీటర్లు వెనక్కు పోయారంటూ శాసనమండలిలో విపక్ష నేత, టీడీపీ సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు చేసిన విమర్శలను ప్రస్తావించారు. బాబు అవినీతి పాలన గురించి మాట్లాడితే రోజులు, వారాలు కూడా చాలవన్నారు.
0 comments:
Post a Comment